బొగ్గు మంత్రిత్వ శాఖ
అస్సాంలో ఆరోగ్య మౌలిక సదుపాయాలను బలోపేతం చేసేందుకు కోల్ ఇండియా లిమిటెడ్ (సిఐఎల్) తోడ్పాటు
నాడు పోస్టు చేయడమైనది:
09 SEP 2021 5:02PM by PIB Hyderabad
అస్సాంలోని బారక్ లోయ ప్రాంతంలో ఏకైక మెడికల్ కాలేజీ అయిన సిల్చార్ మెడికల్ కాలేజీ & ఆసుపత్రి ఆరోగ్య మౌలిక సదుపాయాలను బలోపేతం చేసేందుకు అస్సాం ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖతో బొగ్గు మంత్రిత్వ శాఖ పరిధిలోని కోల్ ఇండియా లిమిటెడ్ (సిఐఎల్) ఎంఒయుపై సంతకాలు చేసింది. తమ కార్పరేట్ సామాజిక బాధ్యత(సిఎస్ఆర్) చొరవలో భాగంగా సిల్చార్ మెడికల్ కాలేజీ - ఆసుపత్రిలో ఐసియు సౌక్యాన్ని, మెడికల్ గ్యాస్ పైప్లైన్ ను ఏర్పాటు చేసేందుకు సిఐఎల్ రూ. 5 కోట్లు అందించనుంది.
అస్సాం ముఖ్యమంత్రి డాక్టర్ బిశ్వ శర్మ, ఆరోగ్య మంత్రి కేశబ్ మహంత సమక్షంలో ప్రతినిధులు ఎంఒయుపై సంతకాలు చేశారు.
దేశవ్యాప్తంగా ఆరోగ్య సౌకర్యాలను మెరుగుపరచడంలో తోడ్పడేందుకు సిఐఎల్, దాని సంస్థలు అనేక అధిక పెట్టుబడితో అత్యంత ప్రభావం చూపగల ప్రాజెక్టులను చేపట్టారు. వారు చేపట్టిన ప్రముఖ ప్రాజెక్టులలో ఒడిషాలోని తాల్చేర్లో రూ. 492 కోట్లతో మెడికల్ కాలేజీ - ఆసుపత్రి ఏర్పాటు, కోల్కొతాలో రూ. 41 కోట్లతో కాన్సర్ చికిత్స చేయించుకుంటున్న పిల్లలకు, వారి కుటుంబాలకు ప్రేమాశ్రయ హోం, థలసీమియా వ్యాధితో బాధపడుతూ బోన్ మారో ట్రాన్స్ప్లాంట్ చేయించుకోవాలనుకునే పిల్లలకు రూ. 40 కోట్లతో మద్దతు, ఒడిషాలోని ఝర్సుగూడాలో రూ. 40 కోట్లతో కార్డియాక్ కేర్ సెంటర్ ఏర్పాటు వంటివి ఉన్నాయి.
ఆర్థిక సంవత్సరం 2020-21లో సిఐఎల్, దాని అనుబంధ సంస్థలు కోవిడ్ పరిహార ప్రాజెక్టుల కింద రూ. 259 కోట్లను వెచ్చించారు. ఆ ఏడాది మొత్తం సిఎస్ఆర్ వ్యయంలో అది 48%. ఇందుకు అదనంగా 2019-20 ఆర్థిక సంవత్సరంలో సిఐఎల్ రూ. 221 కోట్లను పిఎం కేర్స్ నిధికి విరాళంగా ఇచ్చింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కూడా మిషన్ ప్రాణ వాయు కింద 30 ఆసుపత్రులలో రూ.46 కోట్ల వ్యయంతో 32 ఆక్సిజన్ ప్లాంట్లను సిఐఎల్ ఏర్పాటు చేస్తోంది.
***
(రిలీజ్ ఐడి: 1753591)
సందర్శకుల సూచీ సంఖ్య : : 177