ఆయుష్

అఖిల భారత ఆయుర్వేద సంస్థలో ప్రపంచంలోనే మొట్టమొదటి "బయో బ్యాంక్ ఆఫ్ ఆయుర్వేద" స్థాపనకు పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చిన - కేంద్ర ఆయుష్ శాఖ మంత్రి


ఏ.ఐ.ఐ.ఏ. పనితీరును సందర్శించి, ప్రశంసించిన - కేంద్ర ఆయుష్ శాఖ మంత్రులు

ఏ.ఐ.ఐ.ఏ. లో బహుళ ప్రయోజనకర యోగా హాల్ మరియు మినీ ఆడిటోరియంలను ప్రారంభించిన - కేంద్ర ఆయుష్ శాఖ మంత్రి

Posted On: 08 AUG 2021 4:19PM by PIB Hyderabad

కేంద్ర ఆయుష్ శాఖ మంత్రి శ్రీ సర్బానంద సోనోవాల్ మరియు కేంద్ర ఆయుష్ శాఖ సహాయ మంత్రి డాక్టర్ ముంజపారా మహేంద్ర భాయ్ ఆదివారం అఖిల భారత ఆయుర్వేద సంస్థ ను సందర్శించి, బహుళ ప్రయోజన యోగా హాల్ మరియు మినీ ఆడిటోరియం ను ప్రారంభించారు.  మంత్రులిద్దరూ  అఖిల భారత ఆయుర్వేద సంస్థ   పని తీరును ఎంతో ప్రశంసించారు.  ప్రపంచంలోనే అత్యుత్తమ ఆయుర్వేద సంస్థ గా తీర్చిదిద్ది, సంస్థ మరింతగా అభివృద్ధి చెందడానికి తమ పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు.   శ్రీ సర్బానంద సోనోవాల్, సంస్థ భవిష్యత్ ప్రణాళిక ను ప్రశంసిస్తూ, ఆయుర్వేదంలో ప్రపంచంలోనే మొట్టమొదటి బయో బ్యాంక్‌ ను ఏ.ఐ.ఐ.ఏ. లో స్థాపించడానికి పూర్తి సహాయం అందిస్తామని కూడా హామీ ఇచ్చారు.

మంత్రులిద్దరూ, ఏ.ఐ.ఐ.ఏ. లో వివిధ సౌకర్యాల ను సందర్శించి, సంస్థ విశిష్టతలను తెలుసుకోవడంలో ఆసక్తి కనబరిచారు.  శ్రీ సర్బానంద ఈ సందర్భంగా మాట్లాడుతూ, సంస్థలో శాస్త్రీయ పరిశోధనలను మరింత తీవ్రతరం చేయడంతో పాటు, వారి భాషలో విజయవంతమైన పరిశోధన ప్రజలకు చేరేలా చూడాలని, ఎ.ఐ.ఐ.ఎ. డైరెక్టర్, ప్రొఫెసర్ డాక్టర్ తనూజ నేసారి కి,  సూచించారు.  ఏ.ఐ.ఐ.ఏ. లో అమలు చేస్తున్న ఆరోగ్యకరమైన చికిత్సా విధానాన్ని, సహాయ మంత్రి డా. ముంజపార మహేంద్ర భాయ్ ప్రశంసిస్తూ, సమగ్రమైన, సంపూర్ణ చికిత్స పై దృష్టి పెట్టాలని సూచించారు.

ఇద్దరు మంత్రులూ కలిసి, దాదాపు అన్ని ప్రధాన విభాగాలు సందర్శించారు.  సంస్థ లో కొనసాగుతున్న చికిత్స, పరిశోధన సౌకర్యాలపై అధ్యాపకులు, విద్యార్థులతో వివరంగా సంభాషించారు.  పిల్లల కోసం మరియు నేత్రాల కోసం ఏ.ఐ.ఐ.ఏ. అమలు చేస్తున్న పంచకర్మ అనే విశిష్ట వైద్య విధానాన్ని, మంత్రులిద్దరూ ప్రత్యేకంగా ప్రశంసించారు.  ఆయుర్వేద దంత వైద్య విభాగాన్ని సందర్శించిన తర్వాత మంత్రులు ఆయుర్వేద శస్త్రచికిత్సా సౌకర్యాలను కూడా పరిశీలించారు.  రక్త నిధి వద్ద, రోగనిరోధక వ్యాధులు మరియు లుకేమియా వంటి వ్యాధుల పై పరిశోధనలు మరింత లోతుగా చేయాలని, కేంద్ర మంత్రి సూచించారు.  ఫార్మకాలజీ ప్రయోగశాల వద్ద, ఆయుర్వేద ఔషధాల నాణ్యతా ప్రమాణాలను పెంచడంలో నిశితంగా పనిచేయాలని కూడా ఆయన సంస్థ కు సూచించారు.  ఏ.ఐ.ఐ.ఏ. అమలు చేస్తున్న ఆయుర్వేద మూలికలతో ధూపం వేసే విధానాన్ని కూడా మంత్రులు ప్రశంసించారు.

ఇద్దరు మంత్రులిద్దరూ ప్రధానంగా సామర్థ్యం మరియు ఆచరణాత్మక పరిజ్ఞానంపై దృష్టి కేంద్రీకరించారు.  బహుళ ప్రయోజనకర యోగా హాల్‌ ను ప్రారంభించిన తర్వాత, శ్రీ సోనోవాల్ కొన్ని సంక్లిష్టమైన యోగాసనాలు ప్రదర్శించ వలసిందిగా విద్యార్థులను కోరారు.  ఆ తరువాత విద్యార్థుల ప్రదర్శనను ఆయన ప్రశంసించారు.

కోవిడ్ సమయంలో అఖిలభారత ఆయుర్వేద సంస్థ చేపట్టిన శాస్త్రీయ చికిత్సా అధ్యయనాలను తెలియజేసే ఒక లఘు చిత్రాన్ని మంత్రులకు చూపించారు.  సంస్థ కార్యక్రమాలతో పాటు, కోవిడ్ ఆరోగ్య కేంద్రం, కోవిడ్ పరీక్షా కేంద్రాల కార్యకలాపాల పట్ల కూడా వారు సంతృప్తి వ్యక్తం చేశారు.

 

 

*****



(Release ID: 1743904) Visitor Counter : 200