గృహ నిర్మాణం మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ

75 సంవత్సరాల స్వాతంత్ర్య వేడుకల్లో భాగంగా 18 సంవత్సరాలు నిండిన వారందరికీ 'సంతోషాల పొదరిల్లు' అనే అంశంపై లఘు చిత్ర పోటీని నిర్వహిస్తున్న పీఎంఎవై-యు


'అందరికీ వసతి ' అనే అంశంపై ప్రతి ఒక్కరిలో చైతన్యం కలిగించడానికి జాతీయ స్థాయిలో చర్చా కార్యక్రమాన్ని ప్రారంభించిన పీఎంఎవై-యు

Posted On: 17 JUL 2021 2:46PM by PIB Hyderabad

ప్రజలందరికి సొంత ఇంటి సౌకర్యం కల్పించాలన్న ప్రధానమంత్రి ఆశయ సాధనలో ప్రతి ఒక్కరిని భాగస్వాములను చేయాలన్న లక్ష్యంతో ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన - అర్బన్ (పీఎంఎవై-యు) రెండు వినూత్న కార్యక్రమాలను ప్రారంభించింది. ప్రతి ఒక్కరికి గృహ వసతిని అందుబాటులోకి తేవాలన్న లక్ష్యంతో ప్రపంచంలో అతిపెద్ద గృహ పథకంగా గుర్తింపు పొందిన ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన - అర్బన్ (పీఎంఎవై-యు) ప్రారంభమై ఆరు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా 2021 జూన్ 25వ తేదీన ఈ కార్యక్రమాలు ప్రారంభం అయ్యాయి. దేశానికి స్వాతంత్ర్యం సిద్దించి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నిర్వహిస్తున్న ఆజాది కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా నిర్వహించనున్న 75 సెమినార్లు, వర్క్‌షాప్‌లలో భాగంగా ఈ రెండు కార్యక్రమాలు జరగనున్నాయి. 

ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన - అర్బన్ అమలులోకి వచ్చి ఆరు సంవత్సరాలు పూర్తి కావడంతో పాటు పథకాన్ని అమలు చేయడానికి కేంద్రం తన వాటాగా ఒక లక్ష కోట్ల రూపాయలను ఇంతవరకు విడుదల చేసింది. ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన - అర్బన్ పథకంలో భాగంగా 1.12 గృహాలను నిర్మించాలని లక్ష్యంగా నిర్ణయించుకోవడం జరిగింది. లక్ష్య సాధనలో వేగంగా అడుగులు వేస్తున్న ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన - అర్బన్ ఇంతవరకు 83 లక్షల గృహాల నిర్మాణాన్ని చేపట్టి, 50 లక్షల గృహాలను నిర్మించింది. 

75 సంవత్సరాల స్వాతంత్ర్య భారతావని సాధించిన అపూర్వ విజయాలు, దేశ చరిత్ర,సంస్కృతిని ప్రతిబింబించే విధంగా కేంద్ర ప్రభుత్వం  ఆజాది కా అమృత్ మహోత్సవ్‌ ను పెద్ద ఎత్తున నిర్వహించాలని నిర్ణయించింది.  ఆజాది కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా  పీఎంఎవై-యు   తన రెండు కార్యక్రమాలను వినూత్నంగా నిర్వహించాలని నిర్ణయించింది. 

వీటి నిర్వహణకు సంబంధించిన విధివిధానాలు ఇప్పటికే విడుదల అయ్యాయి. 

ఒకటైన ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన - అర్బన్ ఆరు సంవత్సరాల ప్రస్థానం ప్రతిబింబించే  విధంగా లఘు చిత్రాల నిర్మాణ పోటీ జరుగుతుంది. దీనిలో పీఎంఎవై-యు లబ్ధిదారులు, విద్యార్థులు, యువత, ప్రజలు, సంస్థలు వ్యక్తిగతంగా లేదా అందరూ కలిసి పాల్గొనవచ్చును. పీఎంఎవై-యు అమలు జరుగుతున్న తీరు, దీనివల్ల కలిగిన ప్రయోజనాలు, లబ్ధిదారుల జీవితాల్లో చోటు చేసుకున్న మార్పులు ఇతివృత్తంగా నిర్మించ వలసిన లఘు చిత్రాల నిర్మాణ పోటీలో 18 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ప్రతి భారత పౌరుడు పాల్గొనవచ్చును. 2021 సెప్టెంబర్ ఒకటవ తేదీలోగా తమ చిత్రాలను సమర్పించవలసి ఉంటుంది. 2021 సెప్టెంబర్ 30వ తేదీన విజేతలను ప్రకటిస్తారు. మూడు తరగతుల్లో సర్టిఫికెట్ తో పాటు వరుసగా 25,000, 20,000, 15,000 రూపాయలను నగదు బహుమతిగా విజేతలకు అందిస్తారు. 

చర్చలు, సమావేశాలు, సమాచార వ్యాప్తి ద్వారా ప్రతి ఒక్కరికి గృహ వసతి పై అవగాహన కల్పించాలన్న లక్ష్యంతో  ‘ఆవాస్ పర్ సంవాద్పేరిట అవగాహనా కార్యక్రమాలను నిర్వహించాలని ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన - అర్బన్ నిర్ణయించింది. ఇంజనీరింగ్, పట్టణ ప్రాంతాల అభివృద్ధి, ఆర్థిక రంగం తదితర అంశాలపై ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించి వారిని చైతన్యవంతులను చేయడానికి దేశవ్యాపితంగా 2021 జూలై ఒకటవ తేదీ నుంచి సెప్టెంబర్ 30వరకు 75 75 వర్క్‌షాప్‌లు మరియు సెమినార్ల ద్వారా ఈ కార్యక్రమం అమలు జరుగుతుంది. రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల సహకారంతో గుర్తింపు పొందిన విద్యా సంస్థలు, ప్రాథమిక రుణ సంస్థలు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తాయి. కోవిడ్-19 నిబంధనలను పాటిస్తూ ఆఫ్ లైన్ లేదా ఆన్ లైన్ విధానంలో వీటిని నిర్వహిస్తారు. దీనిలో పాల్గొనే వారందరికీ పీఎంఎవై-యు సర్టిఫికెట్లను ప్రదానం చేస్తుంది. 

ఇప్పటికే అమలు జరుగుతున్న రెండు కార్యక్రమాల్లో అన్ని వర్గాలకు చెందిన వారు పాల్గొనడానికి ఉత్సాహం చూపుతూ తమ పేర్లను నమోదు చేసుకుంటున్నారు. వర్క్‌షాపులు నిర్వహించడానికివిద్యాసంస్థలు మరియు పిఎల్‌ఎల్‌లు పిఎమ్‌వై (యు) వెబ్‌సైట్‌, : https://pmay-urban.gov.in/ పీఎంఎవై-యు  మొబైల్యాప్ ద్వారా నమోదు చేసుకోవచ్చు. 

తన లబ్ధిదారులతో పాటు సంబంధిత వర్గాలతో పిఎమ్‌వై (యు) నిరంతరం చర్చిస్తూ వారి అభిప్రాయాలను తెలుసుకోవడానికి ప్రాధాన్యత ఇస్తోంది. పిఎమ్‌వై (యు) కొత్తగా ప్రారంభించిన ఈ రెండు కార్యక్రమాలు స్వంత పక్కా ఇళ్లలో నివసిస్తున్న ప్రజల జీవన స్థితిగతులు, కల సాకారం కావడంతో వారు పొందుతున్నఆనందం, సంబంధిత వర్గాల ఆకాంక్షలను తెలుసుకోవడానికి ఉపయోగపడతాయి. 

***



(Release ID: 1736524) Visitor Counter : 212