సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
స్వాత్రంత్య పోరాట ఘట్టాలను చాటిచెప్పిన చాయాచిత్ర ప్రదర్శన
రీజినల్ ఔట్ రీచ్ బ్యూరో, హైదరాబాద్ ఆధ్వర్యంలో ఫోటో ఎగ్జిబిషన్ ను ప్రశంసించిన రాష్ట్ర గవర్నర్ శ్రీమతి తమిళిసై సౌందర రాజన్
`ఆజాదీకా అమృత్ మహోత్సవ్' వేడుకల సందర్భంగా వరంగల్ పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ లో పాల్గొన్న రాష్ట్ర గవర్నర్
దేశం స్వేచ్ఛా వాయువులు పీల్చేందుకు పోరాటం చేసిన వారిని స్మరించుకున్న గవర్నర్
Posted On:
12 MAR 2021 5:48PM by PIB Hyderabad
కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ, రీజినల్ ఔట్ రీచ్ బ్యూరో, హైదరాబాద్ ఆధ్వర్యంలో `ఆజాదీకా అమృత్ మహోత్సవ్’ వేడుకల ప్రారంభోత్సవం సందర్భంగా వరంగల్ పోలీస్ పరేడ్ గ్రౌండ్స్లో ఏర్పాటు చేసిన చాయాచిత్ర ప్రదర్శనను తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శ్రీమతి తమిళిసై సౌందర రాజన్ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎగ్జిబిషన్లోని ప్రతి ఫోటోనూ ఆసక్తిగా వీక్షించిన రాష్ట్ర గవర్నర్, దండి మార్చ్ నుంచి మొదలుకొని స్వాత్రంత్య పోరాట ఘట్టాలను చాటి చెప్పేలా ఉన్న అరుదైన చిత్రాలతో ఉన్న ఎగ్జిబిషన్ ఆకట్టుకుందని ప్రశంసించారు.
ఫోటో ఎగ్జిబిషన్ ను తిలకించిన వారికి స్వాత్రంత్య పోరాట ఉద్విగ్న ఘట్టాలు గుర్తుకు వస్తాయని గవర్నర్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. రీజినల్ ఔట్ రీచ్ బ్యూరో ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కోవిడ్ డిజిటల్ ప్రచార వాహనాలను కూడా గవర్నర్ శ్రీమతి తమిళిసై సౌందరరాజన్ తిలకించారు. కరోనా మహమ్మారి విషయంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఈ సందర్భంగా గవర్నర్ సూచించారు.
ఈ సందర్భంగా సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ, దక్షిణ భారతదేశ డైరెక్టర్ జనరల్ శ్రీ వేంకటేశ్వర్లు గారు మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం స్వాతంత్య్ర పోరాటానికి 75 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా `ఆజాదీ కా అమృత్ మహోత్సవ్` కార్యక్రమం నిర్వహిస్తున్నదని తెలిపారు. ఇందులో భాగంగా కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ, రీజినల్ ఔట్ రీచ్ బ్యూరో హైదరాబాద్ విభాగం ఈ ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసిందని తెలిపారు. స్వాతంత్య్ర పోరాటంలోని కీలక ఘట్టాలకు వేదికగా ఈ ఎగ్జిబిషన్ ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రీజినల్ ఔట్ రీచ్ బ్యూరో అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ మానస్ కృష్ణకాంత్ , ఆర్ఓబీ అధికారులు శ్రీధర్ సూరునేని, అర్ధ శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.
వరంగల్ తో పాటు తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్, నల్లగొండ, నిజామాబాద్ లో ఆజాదీకా అమృత్ మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు.
***
(Release ID: 1704396)
Visitor Counter : 153