సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ

శాస్త్రీయ ఆవిష్కరణాల్లో అభివృద్ధి పథంలో భారత్ కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్

జమ్మూ విశ్వవిద్యాలయంలో జరిగిన ' జాతీయ సైన్స్ డే'లో కీలక ఉపన్యాసం చేసిన మంత్రి

Posted On: 28 FEB 2021 5:16PM by PIB Hyderabad

శాస్త్రీయ ఆవిష్కరణాల్లో భారత్ వేగంగా అభివృద్ధి పథంలో పయనిస్తున్నదని కేంద్ర ఈశాన్య ప్రాంతాల అభివృద్ధి, సిబ్బంది వ్యవహారాలు, ప్రజాఫిర్యాదులు, పెన్షన్లు, అణుశక్తి, అంతరిక్ష శాఖల సహాయ ( స్వతంత్ర)మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. ' జాతీయ సైన్స్ డే' సందర్భంగా జమ్ము విశ్వవిద్యాలయంలో జరిగిన సదస్సులో మంత్రి పాల్గొన్నారు. సదస్సులో కీలక ఉపన్యాసం ఇచ్చిన మంత్రి స్వదేశంలో శాస్త్రీయ ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోడీ నాయకత్వంలో కేంద్రప్రభుత్వం గత కొన్ని సంవత్సరాలుగా ఆచరణీయమైన విప్లవాత్మక నిర్ణయాలను తీసుకున్నదని చెప్పారు. ప్రధానమంత్రి లక్ష్యమైన ' ఆత్మ నిర్భర్ భారత్' సాధనకు ఇది సహకరిస్తుందని మంత్రి అన్నారు. ఈ సందర్భంగా అంతరిక్ష రంగంలో దేశానికి స్వాతంత్ర్యం సిద్దించిన తరవాత తొలిసారిగా ప్రైవేట్ రంగానికి అనుమతి ఇవ్వాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని మంత్రి ప్రస్తావించారు.  ఇదేవిధంగా అణుశక్తి , అణుఇంధన రంగాల్లో కూడా కేంద్రాలను నెలకొల్పడానికి జాయింట్ వెంచర్లకు అనుమతి ఇవ్వాలని కేంద్ర మంత్రివర్గం నిర్ణయించిందని మంత్రి వివరించారు.


ఈ ఏడాది జాతీయ సైన్స్ డే ప్రధాన ఇతివృత్తంగా ఉన్న ' శాస్త్రీయ ఆవిష్కరణల భవిష్యత్ ...' అనే అంశం భారతదేశ ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా ఉందని అన్న మంత్రి ఈ అంశంలో భారతదేశం అనుసరిస్తున్న విధానాలను ఇతర దేశాలు మార్గదర్శకంగా తీసుకుంటున్నామని చెప్పారు. కోవిడ్ వాక్సిన్ అభివృద్ధి దీనికి నిదర్శనమని మంత్రి తెలిపారు. వాక్సిన్ ను స్వదేశంలో అభివృద్ధి చేయడమే కాకుండా దీనిని విదేశాలకు కూడా ఎగుమతి చేస్తున్నామని అన్నారు. పిఎస్‌ఎల్‌విసి 51 / అమెజోనియా -1 ను విజయవంతంగా ప్రయోగించి ఇస్రో మరో ఘన విజయాన్ని సాధించిన రోజున సైన్స్ డే జరగడం గొప్ప విశేషమని డాక్టర్ జితేంద్రసింగ్ వ్యాఖ్యానించారు.అనేక ఇతర దేశాల తరువాత ఆలస్యంగా భారతదేశం తన అంతరిక్ష ప్రయాణాన్ని ప్రారంభించినప్పటికీ, ఈ రోజు మంగళ్ యాన్ మరియు చంద్రయాన్ ల ద్వారా సేకరించిన సమాచారాన్ని  అమెరికాకు చెందిన నాసా వంటి ప్రపంచంలోని ప్రధాన సంస్థలకు  అందించే స్థితికి  చేరుకున్నదని మంత్రి అన్నారు.


జీవన స్థితిగతులను మెరుగు పరిచే అంశంతోపాటు వివిధ రంగాలకు అంతరిక్ష సాంకేతిక ప్రయోజనాలను అందించిన ఘనత ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోడీకి దక్కుతుందని మంత్రి పేర్కొన్నారు. స్మార్ట్ నగరాలు, వ్యవసాయం ప్రకృతి వైపరీత్యాలు, జాతీయరహదారులు, రక్షణ తదితర రంగాల్లో  అంతరిక్ష సాంకేతిక అంశాలు అమలు జరుగుతున్నాయని మంత్రి అన్నారు.


స్వతంత్ర భారతదేశం  75 వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన తరుణంలో ఈ ఏడాది 'జాతీయ విజ్ఞాన దినోత్సవం' జరుపుకుంటున్నామని పేర్కొన్న మంత్రి 100 సంవత్సర వేడుకలను ఘనంగా నిర్వహించడానికి రానున్న  25 సంవత్సరాలకు ప్రణాళికలను సిద్ధం చేస్తున్నామని డాక్టర్ జితేంద్ర సింగ్  తెలిపారు. శాస్త్రీయ  శక్తి సామర్థ్యాలతో భారతదేశం ప్రపంచ సూపర్ పవర్‌గా రూపుదిద్దుకుంటుందన్న ధీమాను వ్యక్తం చేసిన మంత్రి ఈ దిశలో  ప్రయాణం ఇప్పటికే ప్రారంభమైందని అన్నారు.



 విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ మనోజ్ కుమార్ ధార్, విశ్వవిద్యాలయంలోని వివిధ విభాగాల  పరిశోధన కార్యకలాపాలపై నివేదికను సమర్పించారు.  ప్రొఫెసర్ నరేష్‌పాధ జాతీయ సైన్స్ డే ప్రాముఖ్యతను వివరించారు.  ప్రొఫెసర్ రజనీకాంత్ వందన సమర్పణ చేశారు. ఈ సందర్భంగా విశ్వవిద్యాలయంలోని వివిధ విభాగాలకు చెందిన ప్రతిభావంతులైన పరిశోధకులు మరియు విద్యార్థులకు అవార్డులు , సర్టిఫికెట్లను అందజేశారు.

***



(Release ID: 1701613) Visitor Counter : 119


Read this release in: English , Urdu , Hindi , Punjabi