రైల్వే మంత్రిత్వ శాఖ
తిరిగి వెళ్ళే వలసదారులకు భారతీయ రైల్వే ద్వారా సౌకర్యాలు
Posted On:
05 FEB 2021 3:56PM by PIB Hyderabad
లాక్-డౌన్ కారణంగా చిక్కుకుపోయిన కార్మికులు, ఇతర వ్యక్తులు, వారి, వారి సొంత రాష్ట్రాలకు చేరుకోవడానికి ఉపయోగపడేవిధంగా, భారతీయ రైల్వేలు, 2020 మే, 1వ తేదీ నుండి 2020 ఆగస్టు, 31వ తేదీ వరకు, 4621 శ్రామిక్ ప్రత్యేక రైళ్ళను నడిపింది. ఈ శ్రామిక్ ప్రత్యేక రైళ్ళను రాష్ట్ర ప్రభుత్వాలు అభ్యర్ధించాయి. సాధారణ పరిస్థితులలో, అటువంటి ప్రత్యేక రైళ్ళను, రాష్ట్ర ప్రభుత్వం / ఏదైనా ఏజెన్సీ లేదా ఒక వ్యక్తి కానీ, రాను, పోను పూర్తి ఛార్జి పై ముందుగా బుక్ చేసుకుంటారు. ఈ ఛార్జి లో, రెండు వైపులా సాధారణ ఛార్జీతో పాటు, సర్వీస్ ఛార్జ్, ఖాళీ వాగన్ల ఛార్జి, డిటెన్షన్ ఛార్జ్ మొదలైనవి ఉంటాయి.
అయితే, భారతీయ రైల్వే, ఒక వైపు మాత్రమే సాధారణ ఛార్జీలపై ఈ శ్రామిక్ ప్రత్యేక రైళ్ళను బుక్ చేయడానికి అనుమతించింది. దీనికి అదనంగా ప్రయాణీకుల నుండి నేరుగా ఎటువంటి ఛార్జీలను వసూలు చేయలేదు. రాష్ట్ర ప్రభుత్వాలు లేదా వారి అధీకృత ప్రతినిధుల నుండి, రైల్వే శాఖ, ఈ శ్రామిక్ ప్రత్యేక రైళ్ళ ఛార్జీలను వసూలు చేసింది. ఇంకా, ప్రయాణీకులకు భద్రత కల్పించడంతో పాటు, కోవిడ్-19 మహమ్మారి వ్యాప్తిని అరికట్టడానికి వీలుగా, ఈ శ్రామిక్ రైళ్ళలో మెరుగైన పారిశుధ్యం, ప్రత్యేక భద్రత, వైద్య ఏర్పాట్లు, రైలు బోగీల శానిటైజేషన్, ఉచిత భోజనం, నీరు మొదలైన ప్రత్యేక ఏర్పాట్లను రైల్వేలు చేశాయి. రాష్ట్ర ప్రభుత్వం మరియు భారత రైల్వేలు ఆహారాన్నీ, త్రాగు నీటినీ ఉచితంగా అందించాయి. మొత్తం మీద, ఈ సమయంలో, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అందజేసిన సేవలకు అదనంగా, రైల్వేలు కూడా 1.96 కోట్ల భోజనాలతో పాటు, 2.19 కోట్లకు పైగా త్రాగు నీటి సీసాలను, అందించాయి.
ఈ రోజు రాజ్యసభలో అడిగిన ఒక ప్రశ్నకు, రైల్వే, వాణిజ్య, పరిశ్రమలు, వినియోగదారుల వ్యవహారాల, ఆహారం, ప్రజా పంపిణీ శాఖల మంత్రి శ్రీ పియూష్ గోయల్, లిఖితపూర్వకంగా అందజేసిన సమాధానంలో, ఈ సమాచారాన్ని తెలియజేశారు.
****
(Release ID: 1695692)
Visitor Counter : 101