పర్యావరణం, అడవులు, మరియు వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ
వాయు కాలుష్యానికి కళ్లెం వేసేందుకు ధూళి నియంత్రణ చర్యలను కఠినంగా అమలు చేయాలని 'వాయు కాలుష్య కమిషన్' ఆదేశం
Posted On:
23 DEC 2020 8:54PM by PIB Hyderabad
నానాటికీ క్షీణిస్తున్న గాలి నాణ్యతపై, 'దిల్లీ-ఎన్సీఆర్, సరిహద్దు ప్రాంతాల్లో వాయు నాణ్యత నిర్వహణ కమిషన్' సమీక్ష నిర్వహించింది. దిల్లీ-ఎన్సీఆర్లో వాయు కాలుష్యానికి కళ్లెం వేసేందుకు ధూళి నియంత్రణ చర్యలను కఠినంగా అమలు చేయాలని కచ్చితంగా ఆదేశించింది.
నిర్మాణాల కూల్చివేతల సమయంలో నిబంధనలను అతిక్రమించేవారిపై గట్టి చర్యలు చేపట్టాలని కమిషన్ నిర్దేశించింది. తనిఖీలు, ధూళి నియంత్రణ చర్యల అమలు కోసం అధికారులతో బృందాలు ఏర్పాటు చేయాలని కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు, రాష్ట్రాల కాలుష్య నియంత్రణ బోర్డులు, దిల్లీ కాలుష్య నియంత్రణ కమిటీకి ఆదేశాలు జారీ చేసింది.
నిర్మాణ నిషేధం, కూల్చివేత నిషేధ నిబంధనలు అతిక్రమించినవారి నుంచి పర్యావరణ పరిహార రుసుము వసూలు చేయాలని చెప్పింది.
ఏడాది పొడవునా సాగే నిర్మాణ, కూల్చివేతల ప్రక్రియల నుంచి వస్తున్న దుమ్ము, వాయు కాలుష్యంలో ప్రధాన పాత్ర పోషిస్తోంది. పీఎం2.5 నుంచి పీఎం10 వరకు చేరి, వాయు నాణ్యతపై తీవ్ర ప్రభావం చూపుతోంది.
'కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ' జారీ చేసిన 'నిర్మాణాలు, కూల్చివేతల వ్యర్థాల నిర్వహణ నిబంధనలు'; 'నిర్మాణం, కూల్చివేత వ్యర్థాల' నిర్వహణలో దుమ్మును తగ్గించే చర్యలపై మార్గదర్శకాలను కచ్చితంగా పాటించేలా చూడటానికి ఆకస్మిక తనిఖీ బృందాలను నియమించాలని కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డుకు, హర్యానా, రాజస్థాన్, యూపీ రాష్ట్రాల కాలుష్య నియంత్రణ బోర్డులకు, దిల్లీ కాలుష్య నియంత్రణ బోర్డుకు కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. జాతీయ రాజధాని ప్రాంతంలో నిర్మాణాలు, కూల్చివేతల నిబంధనలు పాటించడంపై 15 రోజులపాటు తనిఖీ చేసి తమకు నివేదికలు సమర్పించాలని కూడా నిర్దేశించింది.
***
(Release ID: 1683410)