రైల్వే మంత్రిత్వ శాఖ

కోల్‌కతా నగరం మరియు పరిసర పట్టణ ప్రాంతాల కోసం కోల్‌కతా ఈస్ట్ వెస్ట్ మెట్రో కారిడార్ ప్రాజెక్ట్ కోసం సవరించిన వ్యయాన్ని ఆమోదించిన - కేంద్ర మంత్రి మండలి


12 స్టేషన్లతో కూడిన ఈ ప్రాజెక్టు మొత్తం మార్గం పొడవు - 16.6 కిలోమీటర్లు


రైల్వే మంత్రిత్వ శాఖ పరిధిలోని కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ కోల్‌కతా మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ ఈ ప్రాజెక్టును అమలు చేస్తోంది


ఈ ప్రాజెక్టు ట్రాఫిక్ రద్దీని తగ్గిస్తుంది, పట్టణ అనుసంధానతను మెరుగుపరచడంతో పాటు ప్రతీ రోజూ లక్షలాది మంది ప్రయాణికులకు పరిశుభ్రమైన రాకపోకల సౌకర్యాన్ని అందిస్తుంది


ప్రాజెక్టు పూర్తి అంచనా వ్యయం 8575 కోట్ల రూపాయలు కాగా, 2021 డిసెంబర్ నాటికి పూర్తిచేయాలని లక్ష్యంగా నిర్ణయించారు.

Posted On: 07 OCT 2020 4:31PM by PIB Hyderabad

కోల్‌కతా ఈస్ట్ వెస్ట్ కారిడార్ ప్రాజెక్టు నిర్మాణానికి సవరించిన వ్యయ అంచనాలను పునః రూపకల్పన చేసిన మార్గం ప్రకారం ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర మంత్రి మండలి ఆమోదించింది.

అమలు వ్యూహాలు & లక్ష్యాలు:

*          రైల్వే మంత్రిత్వ శాఖ పరిధిలోని కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ కోల్‌కతా మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ ఈ ప్రాజెక్టును అమలు చేస్తోంది. 

*          ఈ ప్రాజెక్టు పూర్తి అంచనా వ్యయం 8575 కోట్ల రూపాయలు.  కాగా ఇందులో,  రైల్వే మంత్రిత్వ శాఖ వాటా 3268.27 కోట్ల రూపాయలు;  కేంద్ర గృహ నిర్మాణం, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వాటా 1148.31 కోట్ల రూపాయలు;  జపాన్ అంతర్జాతీయ సహకార సంస్థ (జైకా) రుణం 4158.40 కోట్ల రూపాయలు ఉన్నాయి. 

*          5.3 కిలోమీటర్ల పొడవైన ఎలివేటెడ్ కారిడార్ 14.02.2020 తేదీ నాటికే ప్రారంభించబడింది.

*           మరో 1.67 కిలో మీటర్ల కారిడార్ 05.10.2020 తేదీన ప్రారంభించబడింది.

*           ఈ మొత్తం ప్రాజెక్టును 2021 డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్ణయించారు. 

ప్రధాన ప్రభావం:

పశ్చిమాన పారిశ్రామిక నగరం హౌరా మరియు తూర్పున సాల్ట్ లేక్ సిటీ లతో కోల్ కతాలోని వ్యాపార జిల్లా కు సమర్థవంతమైన రాకపోకల రవాణా అనుసంధానతను, సురక్షితమైన, సౌకర్యవంతమైన ప్రజా రవాణా వ్యవస్థ ద్వారా  సృష్టించాలనే ఉద్దేశ్యంతో ఈ భారీ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టాలని సంకల్పించడం జరిగింది.  ఈ ప్రాజెక్టు ట్రాఫిక్ రద్దీని తగ్గించడంతో పాటు, నగరవాసులకు పరిశుభ్రమైన రాకపోకల సౌకర్యాన్ని కలిగిస్తుంది.  ఇది కోల్ ‌కతా నగరానికి ఆర్థికపరమైన, సమర్థవంతమైన, పర్యావరణ అనుకూల రవాణా సౌకర్యాన్ని అందిస్తుంది.  ఇది కోల్‌కతా ప్రాంతం యొక్క భారీ రవాణా సమస్యను పరిష్కరించడంతో పాటు, ప్రయాణ సమయాన్ని తగ్గించడం ద్వారా ఉత్పాదకత మరియు వృద్ధిని పెంపొందిస్తుంది. 

ఇంటర్ చేంజ్ హబ్‌లను నిర్మించడం ద్వారా మెట్రో, సబ్-అర్బన్ రైల్వే, ఫెర్రీ, బస్సు రవాణా వంటి బహుళ రవాణా మార్గాలను ఇది అనుసంధానం చేస్తుంది.  ప్రతీ రోజూ లక్షలాది మంది ప్రయాణికులకు, ఇది,  సున్నితమైన, ఎటువంటి ఇబ్బందులు, అవరోధాలు లేని రవాణా మార్గాన్ని నిర్ధారిస్తుంది.

ప్రాజెక్టు ప్రయోజనాలు:

*          సురక్షితమైన, సమర్థవంతమైన, పర్యావరణ హితమైన రవాణా వ్యవస్థను అందించడం ద్వారా ప్రజలకు ప్రయోజనం చేకూరుస్తుంది. 

*         ప్రయాణ సమయం తగ్గుతుంది. 

*          ఇంధన వినియోగం తగ్గుతుంది.

*          రహదారి మౌలిక సదుపాయాలపై మూలధన వ్యయం తగ్గుతుంది. 

*          కాలుష్యం మరియు ప్రమాదాలు తగ్గుతాయి.

*          రవాణా ఆధారిత అభివృద్ధి (టి.ఓ.డి) మెరుగౌతుంది. 

*          కారిడార్ ‌లో భూముల విలువ పెరగడం ద్వారా అదనపు ఆదాయం లభిస్తుంది. 

*          ఉద్యోగాలు కల్పించబడతాయి. 

*          "ఆత్మ నిర్భర్ భారత్" మరియు "వోకల్ ఫర్ లోకల్" యొక్క స్ఫూర్తిని పొందుపరుస్తుంది.

నేపధ్యం :

కోల్‌కతా ఈస్ట్-వెస్ట్ మెట్రో కారిడార్ ప్రాజెక్టు - కోల్‌కతా నగరంతో పాటు, దాని చుట్టుపక్కల పట్టణ ప్రాంతాల సుస్థిర అభివృద్ధికి కీలకమైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టు.  ఈ ప్రాజెక్టు రాకపోకల రద్దీని తగ్గించడంతో పాటు, ప్రతీ రోజూ లక్షలాది మంది ప్రయాణికులకు పరిశుభ్రమైన రవాణా పరిష్కారాన్ని అందిస్తుంది.  ఇది రైలు ఆధారిత మాస్ రాపిడ్ ట్రాన్సిట్ విధానం ద్వారా కోల్‌కతా, హౌరా మరియు సాల్ట్ లేక్‌లకు ఇబ్బందులు, అవరోధాలు లేని అనుసంధానతను కల్పిస్తుంది.  సమర్థవంతమైన, ఎటువంటి ఇబ్బందులు లేని రవాణా ఇంటర్ చేంజ్ హబ్‌లను నిర్మించడం ద్వారా మెట్రో, రైల్వే, బస్సు రవాణా వంటి అన్ని ఇతర రవాణా మార్గాలను కూడా ఇది అనుసంధానిస్తుంది.  ఈ ప్రాజెక్టులో భాగంగా, హుగ్లీ నదికి దిగువన ఉన్న సొరంగంతో సహా 16.6 కిలోమీటర్ల పొడవైన మెట్రో రైల్వే కారిడార్ ను నిర్మిస్తారు.  ఇది, భారతదేశంలో, ఒక పెద్ద నది దిగువన నిర్మించిన మొట్టమొదటి రవాణా సొరంగ మార్గం. దీనితో పాటు, భారతదేశంలోని లోతైన మెట్రో స్టేషన్లలో ఒకటిగా హౌరా స్టేషన్ నిలుస్తుంది.

*****



(Release ID: 1662482) Visitor Counter : 139