హోం మంత్రిత్వ శాఖ

భారత జనగణన-2021 నిర్వహణ-జాతీయ జనాభా పుస్తక నవీకరణకు కేంద్ర మంత్రిమండలి ఆమోదం

Posted On: 24 DEC 2019 4:23PM by PIB Hyderabad

   భారత జనగణన-2021తోపాటు జాతీయ జనాభా పుస్తక (NPR) నవీకరణ నిమిత్తం ఇవాళ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఈ మేరకు జనగణన కోసం రూ.8,754.23 కోట్లు, జనాభా పుస్తక నవీకరణ కోసం రూ.3,941.35 కోట్లతో రూపొందించిన వ్యయ అంచనాలను కూడా ఆమోదించింది.

లబ్ధిదారులు:

   జనగణన భారతదేశంలోని మొత్తం జనాభాకు సంబంధించినది కాగా, జాతీయ జనాభా పుస్తకం అసోం రాష్ట్రం మినహా దేశమంతటికీ వర్తిస్తుంది.

వివరాలు:

  • భారత జనగణన ప్రపంచంలోనే అత్యంత భారీ పాలనాపరమైన, గణాంకపరమైన కసరత్తు. దశాబ్దానికి ఒకసారి నిర్వహించే ఈ జనగణన కార్యక్రమాన్ని రెండు దశల్లో నిర్వహిస్తారు.

 

  1. తొలుత నివాసాలన్నిటి జాబితా రూపొందించి, ఇళ్ల లెక్కింపు చేపడతారు. ఈ ప్రక్రియ 2020 ఏప్రిల్ నుంచి సెప్టెంబరు నెలవరకూ కొనసాగుతుంది.
  2. ఆ తర్వాత 2021 ఫిబ్రవరి 9 నుంచి 28వ తేదీదాకా జనాభా లెక్కింపు సాగుతుంది.

ఈ మేరకు అసోం రాష్ట్రం మినహా దేశవ్యాప్తంగా ఇళ్ల జాబితా రూపకల్పనతోపాటు జాతీయ జనాభా పుస్తక నవీకరణ ప్రక్రియ కూడా పూర్తవుతుంది.

  • జాతీయ ప్రాధాన్యంగల ఈ మహా యజ్ఞం సందర్భంగా 2011లో 28 లక్షలమంది క్షేత్రస్థాయి సిబ్బంది విధులు నిర్వర్తించగా ఈసారి 30 లక్షల మంది ఇందులో పాలుపంచుకుంటారు.
  • గణాంక సేకరణ కోసం మొబైల్ యాప్, పర్యవేక్షణ నిమిత్తం కేంద్ర పోర్టల్ వినియోగించనున్న నేపథ్యంలో మెరుగైన నాణ్యతతో జనాభా గణాంకాలను త్వరగా  ప్రకటించే అవకాశం ఉంటుంది.
  • గణాంక విస్తృతి మరింత మెరుగ్గా, వినియోగహితంగా ఉంటుంది కాబట్టి విధాన రూపకల్పన పరామితులకు అనుగుణంగా అన్ని వివరాలూ ఒక్క మీట నొక్కితే లభ్యమయ్యేలా అందుబాటులో ఉంటాయి.
  • జనగణన... ఒక-సేవ రూపేణా అన్ని మంత్రిత్వ శాఖలకూ అవసరమైనప్పుడల్లా కచ్చితమైన, యాంత్రికంగా అర్ధమయ్యే, కార్యాచరణహిత రూపంలో లభ్యమవుతుంది.

ఉద్యోగావకాశాల సృష్టి సామర్థ్యంసహా ప్రధాన ప్రభావం:

  • జనగణన కేవలం గణాంక కసరత్తు కాదు... దీని ఫలితాలు సాధారణ ప్రజానీకానికి కూడా వినియోగహిత రూపంలో అందుబాటులో ఉంటాయి.
  • మంత్రిత్వ శాఖలు, రాష్ట్ర ప్రభుత్వాలు, పరిశోధన సంస్థలుసహా అందరు వినియోగదారులకు, భాగస్వాములకు మొత్తం సమాచారం అందుబాటులో ఉంటుంది.
  • చివరకు గ్రామ/వార్డు వంటి అత్యంత దిగువస్థాయి పాలన వ్యవస్థదాకా కూడా గణాంక పంపిణీకి వీలుంటుంది.
  • సమితి స్థాయి జనగణన వివరాలు పార్లమెంటు, శాసనసభ నియోజకవర్గాల సరిహద్దుల నిర్ణయానికి వీలుగా సంబంధిత కమిషనుకు అందుబాటులో ఉంటాయి.
  • పాలనపరమైన లేదా అధ్యయనపూర్వక గణాంకాలతో కలిస్తే జనగణన సమాచారం ప్రభుత్వ విధాన రూపకల్పనకు శక్తిమంతమైన ఉపకరణం అవుతుంది. జనగణన... ఒక-సేవ రూపేణా అన్ని మంత్రిత్వ శాఖలకు/రాష్ట్ర ప్రభుత్వాలకు, ఇతర భాగస్వాములకు అవసరమైనప్పుడల్లా కచ్చితమైన, యాంత్రికంగా అర్ధమయ్యే, కార్యాచరణహిత రూపంలో డ్యాష్బోర్డు వంటి సదుపాయాలతో లభ్యమవుతుంది.
  • ఈ రెండు మహా యజ్ఞాలవంటి కసరత్తు ఫలితంగా సుదూర ప్రాంతాలుసహా దేశమంతా ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలు అందుబాటులోకి వస్తాయి. జనగణన, జనాభా పుస్తక కసరత్తు విధుల్లో ఉండేవారికి చెల్లించే గౌరవ వేతనానికి ఇది అదనం. ఆ మేరకు స్థానిక స్థాయిలో దాదాపు 2,900 రోజులపాటు సుమారు 48వేల మందికి ఉపాధి లభిస్తుంది. ఒక్కమాటలో చెబితే- 2.4కోట్ల పనిదినాల ఉపాధి సృష్టించబడుతుంది. అంతేకాకుండా డిజిటల్ పద్ధతిలో, సమన్వయంతో చేసే ఈ పని స్వభావం గణాంక సేకరణకు సంబంధించింది కాబట్టి విధుల్లో ఉన్నవారితోపాటు రాష్ట్ర/జిల్లా స్థాయిలో సాంకేతిక మానవశక్తి వినియోగంవల్ల సామర్థ్య నిర్మాణం కూడా జరుగుతుంది. దీనివల్ల ఆయా వ్యక్తులకు భవిష్యత్ ఉపాధి అవకాశాలు కూడా మెరుగుపడే వీలుంటుంది.

అమలు వ్యూహం - లక్ష్యాలు:

  • జనగణన ప్రక్రియలో ప్రతి ఇంటికీ వెళ్లి, ఇళ్ల జాబితా, జనాభా లెక్కింపునకు సంబంధించిన వేర్వేరు ప్రశ్నపత్రాలను అందజేయాల్సి ఉంటుంది.
  • జనగణన చేపట్టేవారు సాధారణంగా ప్రభుత్వ ఉపాధ్యాయులు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాలు వారిని నియమిస్తాయి. వారు తమకు అప్పగించిన ప్రధాన బాధ్యతతోపాటు జాతీయ జనాభా పుస్తక సంబంధిత పని కూడా చేస్తారు.
  • సబ్-డివిజన్, జిల్లా, రాష్ట్ర స్థాయిలోనూ జనగణన విధుల్లో సిబ్బందిని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు లేదా జిల్లా యంత్రాంగం నియమిస్తాయి.
  • 2021 జనగణనలో వినూత్న చర్యలేమిటంటే:-

 

  1. సమాచార సేకరణ కోసం దేశంలో తొలిసారిగా మొబైల్ యాప్ వినియోగం.
  2. జనగణనలో పాల్గొనే అధికారులు/ఉన్నతాధికారుల పర్యవేక్షణ, నిర్వహణ కోసం ఏకైక ఆధార వనరుగా బహుళ భాషా మద్దతుతో పోర్టల్ వినియోగం.
  3. జనాభా లెక్కింపు దశలో ప్రజలకు స్వీయ-లెక్కింపు దిశగా ఆన్ లైన్ సదుపాయం. సమాచార విశ్లేషణలో సమయం పొదుపు నిమిత్తం వివరణాత్మక స్పందనల నమోదుకు కోడ్ డైరెక్టరీ
  4. ప్రభుత్వ ద్రవ్య చెల్లింపుల వ్యవస్థ (PFMS), ప్రత్యక్ష లబ్ధి బదిలీ వ్యవస్థలద్వారా జనగణన, జాతీయ జనాభా పుస్తక నవీకరణ విధుల్లోగల సిబ్బంది బ్యాంకు ఖాతాలకు నేరుగా గౌరవ వేతనం బదిలీ రూపంలో మొత్తం వ్యయంలో 60 శాతం లావాదేవీలు.
  5. క్షేత్రస్థాయిలో పనిచేసేవారికి నాణ్యమైన శిక్షణ, జాతీయ-రాష్ట్రస్థాయి శిక్షకులను సిద్ధం చేయడం కోసం జాతీయ/రాష్ట్రస్థాయి శిక్షణ సంస్థల సేవల వినియోగం.

నేపథ్యం:

   భారతదేశంలో 1872 నుంచీ క్రమం తప్పకుండా దశవార్షిక జనగణన కార్యక్రమం నిరంతరాయంగా కొనసాగుతోంది. ఈ మేరకు 2021 కసరత్తు 16వ జనగణన కాగా, స్వాతంత్ర్యం తర్వాత ఈ ప్రక్రియ చేపడుతుండటం ఇది 8వ సారి. వార్డు, గ్రామ, పట్టణ స్థాయులలో ప్రాథమిక సమాచారానికి అతిపెద్ద వనరు జనగణనే. ఇళ్ల స్థితిగతులు, సౌకర్యాలు-ఆస్తులు, జనాభా, మతం, ఎస్సీ/ఎస్టీల సంఖ్య, భాష, సాహిత్యం-విద్య, ఆర్థిక కార్యకలాపాలు, వలసలు, సంతాన సాఫల్యత తదితర అనేక పరామితుల సంబంధిత సూక్ష్మస్థాయి సమాచారానికి జనగణనే మూలాధారం. జనాభా లెక్కింపు నిమిత్తం జనగణన చట్టం-1948, జనాభా నిబంధనలు-1990 చట్టబద్ధ చట్రాన్ని సమకూరుస్తున్నాయి.

   ఇక పౌరసత్వ చట్టం-1955, పౌర నిబంధనలు-2003కు అనుగుణంగా జాతీయ జనాభా పుస్తకం (NPR) 2010లో రూపొందించబడింది. ఆ తర్వాత ఆధార్ విశిష్ట గుర్తింపు సంఖ్యను జోడించడంద్వారా 2015లో ఇది నవీకరించబడింది.

 

*****



(Release ID: 1597523) Visitor Counter : 148