మంత్రిమండలి
చిత్ర నిర్మాణం పై భారతదేశానికి, ఇజ్రాయల్ కు మధ్య ఒప్పందానికి ఆమోదం తెలిపిన మంత్రివర్గం
Posted On:
20 FEB 2018 1:19PM by PIB Hyderabad
భారతదేశానికి మరియు ఇజ్రాయల్ కు మధ్య చిత్రాల సహ నిర్మాణానికి ఉద్దేశించిన ఒక ఒప్పందానికి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఎక్స్-పోస్ట్ ఫ్యాక్టో ఆమోదం తెలిపింది. ఈ ఒప్పందం పై ఇజ్రాయల్ ప్రధాని శ్రీ బెంజామిన్ నెతన్యాహూ భారతదేశంలో పర్యటనకు విచ్చేసిన తరుణంలో 2018 జనవరి 15వ తేదీన న్యూ ఢిల్లీ లోని హైదరాబాద్ హౌస్ లో- ఉభయ ప్రధానుల సమక్షంలో- సంతకాలయ్యాయి.
ఒక అంతర్జాతీయ పక్షంతో కలసి ఒక భారతీయ చిత్రాన్ని సహ నిర్మాణం చేయడం అంటే ఒక భారతీయ నిర్మాత అంతర్జాతీయ నిధులను అందుబాటులోకి తెచ్చుకొని, అంతర్జాతీయ స్థాయిలో స్క్రిప్ట్ పైన, ఇంకా ప్రతిభ విషయంలోను సమన్వయం నెలకొల్పుకోవడంతో పాటు ఆ చిత్రం తాలూకు పంపిణీ సదుపాయాన్ని కూడా పొందడమే అని అర్థం. ఈ ఒడంబడికలో భాగంగా ఏదైనా చిత్రాన్ని కలసి నిర్మిస్తే అది ఇటు భారతదేశంలోను, అటు ఇజ్రాయల్ లోను జాతీయ నిర్మాణంగా అర్హతను సంపాదించుకొంటుంది. ఇది రెండు దేశాలలో సృజనాత్మకమైన, కళాత్మకమైన, సాంకేతికపరమైన, ఆర్థికపరమైన మరియు మార్కెటింగ్ కు సంబంధించిన వనరుల తాలూకు ఉమ్మడి సమూహానికి రంగాన్ని సిద్ధం చేస్తుంది. కలసి నిర్మించిన చిత్రాలు రెండు దేశాలలోను చిత్రోత్సవాలలో దేశీయ నిర్మాణాలుగా పాలుపంచుకొనేందుకు కూడా అర్హతను పొందుతాయి. అంతేకాకుండా, ఆయా దేశాలలో నిర్మాణ మరియు నిర్మాణానంతర కార్యకలాపాలకు లభ్యమయ్యే ఇతర ప్రోత్సాహకాలకు కూడా ఈ చిత్రాలు పాత్రమవుతాయి.
చిత్ర సహ నిర్మాణ ఒప్పందం పై సంతకాల ప్రక్రియ ఇరు దేశాలలో చిత్ర నిర్మాణ సంబంధిత వివిధ అంశాలను మరింత మెరుగైన రీతిలో అవగాహన చేసుకోవడానికి, ఇంకా కళ, సంస్కృతుల ఆదాన ప్రదానానికి, రెండు దేశాల ప్రజల మధ్య సుహృద్భావ వాతావరణాన్ని కల్పించడానికి బాట వేస్తుంది. కళాకారులు, సాంకేతిక నిపుణులతో పాటు సాంకేతికేతర విభాగాల సిబ్బంది పరంగా ఉద్యోగాల కల్పనకు కూడా ఈ ఒప్పందం తోడ్పడనుంది.
***
(Release ID: 1521145)
Visitor Counter : 82