సాంస్కృతిక మంత్రిత్వ శాఖ
రేపు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో హైదరాబాద్ విమోచన దినోత్సవ వేడుకలు - ముఖ్య అతిథిగా ఉపరాష్ట్రపతి
నాడు పోస్టు చేయడమైనది:
16 SEP 2026 7:51PM by PIB Hyderabad
హైదరాబాద్ విమోచన దినోత్సవం సందర్భంగా సెప్టెంబర్ 17న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో జరిగే వేడుకలకు ఉపరాష్ట్రపతి శ్రీ సీపీ.రాధాకృష్ణన్ ముఖ్య అతిథిగా హాజరవుతారు.
తెలంగాణ గవర్నర్ శ్రీ శివ ప్రతాప్ శుక్లా, కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖల మంత్రి శ్రీ గజేంద్ర సింగ్ షెకావత్, కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి శ్రీ బండి సంజయ్ కుమార్, మల్కాజ్గిరి ఎంపీ శ్రీ ఈటల రాజేందర్, కేంద్ర సాంస్కృతిక శాఖ కార్యదర్శి శ్రీ వివేక్ అగర్వాల్, కేంద్ర రిజర్వ్ పోలీస్ దళం డైరెక్టర్ జనరల్ శ్రీ జ్ఞానేంద్ర ప్రతాప్ సింగ్, కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం డైరెక్టర్ జనరల్ శ్రీ ప్రవీర్ రంజన్తో పాటు పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.
ఈ సందర్భంగా కేంద్ర సాయుధ పోలీసు బలగాలకు చెందిన మొత్తం 10 దళాలు కవాతు నిర్వహిస్తాయి. ఉపరాష్ట్రపతి పరేడ్ను వీక్షించి గౌరవ వందనం స్వీకరిస్తారు.
ఈ కార్యక్రమంలో “హైదరాబాద్ విమోచనం” ఇతివృత్తంతో ప్రత్యేక సాంస్కృతిక ప్రదర్శన ఉంటుంది. సాలార్ జంగ్ మ్యూజియంలో నిర్వహించిన హైదరాబాద్ విమోచన దినోత్సవ క్విజ్ పోటీల విజేతలను కూడా ఈ సందర్భంగా సత్కరిస్తారు. జాతీయ గేయం ‘వందేమాతరం’ ను సామూహికంగా ఆలపిస్తారు.
కేంద్ర ప్రభుత్వ సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో కార్యక్రమ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రదర్శనను హర్యానా మాజీ గవర్నర్ శ్రీ బండారు దత్తాత్రేయ నేడు ప్రారంభించారు. హైదరాబాద్ విమోచన దినోత్సవానికి సంబంధించిన చారిత్రక ఘట్టాలతో పాటు జాతీయ ఐక్యత, సమగ్రతకు సంబంధించిన అంశాలను ఇందులో ప్రదర్శిస్తున్నారు. నేడు వేలాది మంది పాఠశాల విద్యార్థులు ఈ ప్రదర్శనను సందర్శించారు.
రేపు జరిగే కార్యక్రమంలో అప్పటి హైదరాబాద్ రాష్ట్రం భారతదేశంలో విలీనమైన చారిత్రక ఘట్టాన్ని స్మరించుకోనున్నారు. దేశ ఐక్యత, సమగ్రతను బలోపేతం చేసేందుకు పోరాడిన, సేవలందించిన సాహసవంతులకు, ప్రజలకు ఘన నివాళులు అర్పించనున్నారు.
***
(రిలీజ్ ఐడి: 2311143)
సందర్శకుల సూచీ సంఖ్య : : 11