సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ
ఇండియా పోస్ట్ను సరికొత్తగా తీర్చిదిద్దినందుకు ప్రభుత్వాన్ని ప్రశంసించిన పోస్టల్ ఉద్యోగ సంఘాలు
ఆధునిక, పౌర-కేంద్రీకృత నెట్వర్క్గా మార్చినందుకు ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపిన ఆయా సంఘాలు ప్రతినిధులు
డాక్టర్ జితేంద్ర సింగ్తో భేటీ అయిన పోస్టల్ ఉద్యోగ సంఘాలు.. ఇండియా పోస్ట్ సేవలు, ఉద్యోగుల సమస్యలు, భవిష్యత్ విస్తరణపై చర్చ
చివరి మైలు వరకు ప్రజా సేవలను అందించడంలో ఇండియా పోస్ట్కు ఉన్న దేశవ్యాప్త నెట్వర్క్ కీలకమన్న డాక్టర్ జితేంద్ర సింగ్
విస్తరిస్తున్న ఇండియా పోస్ట్ నెట్వర్క్ ప్రభుత్వం-పౌరుల మధ్య అనుసంధానాన్ని మరింత బలపరుస్తుందని తెలిపిన డాక్టర్ జితేంద్ర సింగ్
నాడు పోస్టు చేయడమైనది:
14 SEP 2026 4:54PM by PIB Hyderabad
ఇండియా పోస్ట్ నెట్వర్క్ను ఆధునిక, పౌర-కేంద్రీకృత సేవా వ్యవస్థగా తీర్చిదిద్దినందుకు అఖిల భారత పోస్టల్ ఉద్యోగ సంఘాల ప్రతినిధులు ప్రభుత్వాన్ని ప్రశంసించారు. సంప్రదాయ మెయిల్ డెలివరీకి మాత్రమే పరిమితం కాకుండా వేగవంతమైన డెలివరీ సేవలు, ఆధార్ సేవలు, పాన్ కార్డు- పాస్పోర్ట్ సేవా సౌకర్యాలు, డోర్స్టెప్ బ్యాంకింగ్, డిజిటల్ పింఛను వంటి అనేక రకాల పౌర-కేంద్రీకృత సేవలను దేశవ్యాప్తంగా ప్రజలకు చేరువ చేసినందుకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీకి వారు కృతజ్ఞతలు తెలిపారు. ఈ మార్పులు ఇండియా పోస్ట్ పాత్రను గణనీయంగా పెంచాయని వారు పేర్కొన్నారు.
ఢిల్లీలోని కర్తవ్య భవన్లో అఖిల భారత పోస్టల్ ఉద్యోగ సంఘాల ప్రతినిధి బృందం కేంద్ర శాస్త్ర-సాంకేతిక మంత్రిత్వశాఖ, భూవిజ్ఞాన శాఖ (స్వతంత్ర బాధ్యత) సహాయ మంత్రి.. ప్రధాని కార్యాలయం, సిబ్బంది-ప్రజా ఫిర్యాదులు-పింఛన్లు, అణుశక్తి-అంతరిక్ష శాఖల సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ను మర్యాదపూర్వకంగా కలిశారు. పోస్టల్ సేవల పరివర్తనతో పాటు ఉద్యోగులు, ఉద్యోగ సంఘాలు, పింఛనుదారులకు సంబంధించిన వివిధ అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు.
గడిచిన దశాబ్ద కాలంలో అందించే సేవల విషయంలో ఇండియా పోస్ట్ పోర్ట్ఫోలియో ఏ విధంగా పెరిగిందో ఆయా ప్రతినిధులు వివరించారు. అందుబాటులోకి తెచ్చిన సేవల విషయంలో 24 గంటల్లోపు డెలివరీ, ఆధార్ సంబంధిత సేవలు, పోస్టల్ నెట్వర్క్ ద్వారా పాన్- పాస్పోర్ట్ సేవలను అందించటం గురించి వారు ప్రస్తావించారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఇంటి వద్దే బ్యాంకింగ్, ఆర్థిక సేవలను అందించడంలో పెరుగుతున్న ఇండియా పోస్ట్ పాత్రను వారు ప్రత్యేకంగా ప్రస్తావించారు.
డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూ మారుతున్న పోస్ట్ మ్యాన్ విధుల్లో ఇండియా పోస్ట్ పరివర్తన స్పష్టంగా కనిపిస్తోందని అన్నారు. పోస్ట్ మ్యాన్ నేడు బ్యాంకింగ్, ఇతర అవసరమైన సేవలను నేరుగా పౌరుల చెంతకు చేర్చటానికే ఎక్కువగా పని చేస్తున్నారని ఆయన తెలిపారు. సంప్రదాయ లేఖల డెలివరీ నుంచి ఆర్థిక, పౌర సేవలను అందించే ఒక విస్తృత వేదికగా పోస్టల్ నెట్వర్క్ మారింది. దీనికి ఉన్న విస్తృతమైన పరిధి ప్రభుత్వ సేవలకు- ప్రజలకు మధ్య ఒక ముఖ్యమైన చివరి మైలు అనుసంధానాన్ని అందిస్తోంది.
ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్, డోర్స్టెప్ బ్యాంకింగ్ విస్తరణ ద్వారా పోస్టల్ నెట్వర్క్ గ్రామాలు, గృహాలకు ఆర్థిక సేవలను తీసుకెళ్లగలిగిందని.. దీనివల్ల ప్రజలు తమ ఇళ్లకు సమీపంలోనే బ్యాంకింగ్ సౌకర్యాలను పొందగలుగుతున్నారని మంత్రి తెలిపారు. పింఛనుదారుల విషయంలో డిజిటల్ లైఫ్ ధ్రువీకరణ పత్రాలు వంటి సేవలను కూడా అందిస్తోన్న పోస్టల్ నెట్వర్క్… అవసరమైన పింఛను సంబంధిత సేవలను మరింత అందుబాటులోకి తీసుకురావటమే కాకుండా ఈ విషయంలో సౌకర్యాన్ని పెంచింది.
కోవిడ్-19 మహమ్మారి సమయంలో దేశవ్యాప్తంగా లాక్డౌన్ ఉన్నప్పటికీ అవసరమైన సేవలను పోస్టల్ నెట్వర్క్ నిరంతరం అందించిందన్న డాక్టర్ జితేంద్ర సింగ్.. ఈ విషయంలో ఉద్యోగులు పోషించిన ముఖ్యమైన పాత్రను గుర్తుచేశారు. పోస్టల్ సిబ్బంది ప్రజల ఇళ్లకు నేరుగా బ్యాంకింగ్ సేవలు, నగదును అందించడంలో సహాయపడ్డారు. దీనితో పాటు అవసరమైన వైద్య, ఆరోగ్య సంరక్షణ సామాగ్రిని రవాణా చేయడానికి పోస్టల్ వాహనాలు, మౌలిక సదుపాయాలు కూడా ఉపయోగపడ్డాయని ఆయన అన్నారు.
పోస్టల్ శాఖకు ఉన్న విస్తారమైన దేశవ్యాప్త నెట్వర్క్ ప్రజా సేవల విషయంలో ఒక విలువైన సంపద అని.. ప్రభుత్వ కార్యక్రమాలు, ప్రజా అవగాహన, చివరి మైలు డెలివరీ కోసం దీనిని మరింత విస్తృతంగా ఉపయోగించుకోవచ్చని డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. ప్రభుత్వ కార్యక్రమాలు, ప్రజలకు సేవలను అందించటం కోసం పోస్టల్ నెట్వర్క్ను మరింత ఎక్కువగా ఉపయోగించే ప్రయత్నాలకు సహకరించడానికి తాము సిద్ధంగా ఉన్నట్లు ప్రతినిధి బృందం తెలియజేసింది.
ఉద్యోగ సంఘాల గుర్తింపు, ధ్రువీకరణకు సంబంధించిన అంశాలు, శాఖాపరమైన వేదికలలో ప్రాతినిధ్యం, పింఛనుదారులు, దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న ఉద్యోగ విషయాలతో సహా పోస్టల్ ఉద్యోగులకు సంబంధించిన సర్వీస్, సంస్థాగత విషయాలను ప్రతినిధి బృందం డాక్టర్ జితేంద్ర సింగ్ ముందుంచింది.
కొన్ని విభాగాల ఉద్యోగులు, సర్వీస్ ప్రయోజనాలకు సంబంధించిన అంశాలను కూడా ప్రతినిధి బృందం లేవనెత్తింది. వర్తించే నిబంధనలతో పాటు చట్టపరమైన, ఆర్థికపరమైన ప్రభావాలను దృష్టిలో ఉంచుకొని పరిశీలన అవసరమైన అంశాలపై తగిన అధికారిక ప్రక్రియ ద్వారా పనిచేయనున్నట్లు డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు.
పోస్టల్ నెట్వర్క్ ద్వారా పౌర-కేంద్రీకృత సేవలను అందించటాన్ని మరింత బలోపేతం చేయడం, ప్రభుత్వ కార్యక్రమాలకు మద్దతుగా దాని విస్తారమైన దేశవ్యాప్త నెట్వర్క్ను సమర్థవంతంగా ఉపయోగించుకోవాల్సిన అవసరంపై కూడా ఈ సమావేశంలో దృష్టి సారించారు.
సమావేశం నిర్వహించినందుకు, తమ సర్వీస్ విషయాలు- సమస్యలను నేరుగా తెలియజేయడానికి అవకాశం కల్పించినందుకు డాక్టర్ జితేంద్ర సింగ్కు ప్రతినిధి బృందం కృతజ్ఞతలు తెలిపింది.
***
(రిలీజ్ ఐడి: 2310241)
సందర్శకుల సూచీ సంఖ్య : : 4