ఆర్థిక మంత్రిత్వ శాఖ
రెండు చిరుత చర్మాలు, సజీవంగా ఉన్న 180 నక్షత్ర తాబేళ్లు, 12 టోకే బల్లులు,
24 కిలోల పాంగోలిన్ పొలుసులు, 500 గ్రాముల పులి ఎముకలను స్వాధీనం చేసుకున్న డీఆర్ఐ
వన్యప్రాణుల అక్రమ రవాణాపై దేశవ్యాప్తంగా చేపట్టిన ఆరు వేర్వేరు దాడుల్లో 13 మంది అరెస్టు
నాడు పోస్టు చేయడమైనది:
09 SEP 2026 9:44PM by PIB Hyderabad
వన్యప్రాణుల అక్రమ రవాణాపై నిఘా పెట్టిన డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ)... దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో గడచిన 10 రోజుల్లో ఆరు కీలక దాడులను చేపట్టింది. ఈ దాడుల్లో రెండు చిరుతపులి చర్మాలు, సజీవంగా ఉన్న 180 భారతదేశ నక్షత్ర తాబేళ్లు, సజీవంగా ఉన్న 12 టోకే బల్లులు, సుమారు 24 కిలోల పాంగోలిన్ పొలుసులు, 500 గ్రాముల పులి ఎముకలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఆరు దాడుల్లో మొత్తం పదమూడు మందిని అరెస్టు చేశారు.

నిఘా వర్గాల సమాచారంతో చేపట్టిన దాడుల్లో భాగంగా 07.09.2026న ఒడిశాలోని కోరాపుట్ జిల్లా జేపోరేలో ఒక వ్యక్తిని అడ్డగించి, చిరుత చర్మాన్ని డీఆర్ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వన్యప్రాణి (సంరక్షణ) చట్టం-1972లోని ఒకటో షెడ్యూల్ ద్వారా చిరుత పులులకు రక్షణ ఉంది. వీటి చర్మాలు, శరీర భాగాల వంటి వాటిని వాణిజ్యం, అమ్మకం, కొనుగోలు, హస్తగతం చేసుకోవటం, రవాణా చేయటం చట్టరీత్యా నిషేధం. ఈ చట్టం ప్రకారం చిరుత పులి చర్మాన్ని, పట్టుబడిన వ్యక్తిని తదుపరి దర్యాప్తు కోసం, చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు కోరాపుట్ అటవీ శాఖకు అప్పగించారు.

అదే రోజున జరిగిన మరో తనిఖీలో భాగంగా బెంగళూరులోని గాంధీనగర్ సమీపంలో ఓ వ్యక్తిని డీఆర్ఐ అధికారులు అడ్డగించారు. అతని వద్ద ఉన్న సామాగ్రిని తనిఖీ చేయగా ఆరు సంచుల్లో సజీవంగా ఉన్న 180 భారతదేశ నక్షత్ర తాబేళ్లను గుర్తించారు. ఈ జాతిని వన్యప్రాణి (సంరక్షణ) చట్టం-1972లోని ఒకటో షెడ్యూల్ జాబితాలో ఉన్న జియోకెలోన్ ఎలిగన్స్గా వైల్డ్లైఫ్ క్రైమ్ కంట్రోల్ బ్యూరో (డబ్ల్యూసీసీబీ) గుర్తించింది. భారతదేశ నక్షత్ర తాబేళ్ల పెంకుపై ఉండే ఆకర్షణీయమైన నక్షత్రం, అరుదైన పెంపుడు జీవి కావడం, వన్యప్రాణుల మార్కెట్లలో డిమాండు ఉండటం వల్ల అంతర్జాతీయంగా వీటి అక్రమ రవాణాకు అవకాశం ఉంటుంది. ఈ చట్టం ద్వారా సజీవంగా ఉన్న 180 తాబేళ్లను స్వాధీనం చేసుకుని, నిందితుడిని అరెస్టు చేశారు.

07.09.2026న జరిగిన మూడో దాడిలో భాగంగా మేఘాలయలోని రి-భోయ్ జిల్లాలో మవ్హతి వైపు వెళ్తున్న బొలెరో ట్రక్కును అడ్డగించిన డీఆర్ఐ అధికారులు... తనిఖీలు నిర్వహించారు. వాహనంలోని మూడు బ్యాగుల్లో 14.68 కిలోల పాంగోలిన్ పొలుసులను గుర్తించారు. వన్యప్రాణి (సంరక్షణ) చట్టం-1972లోని ఒకటో షెడ్యూల్లో పాంగోలిన్లు రక్షిత జాబితాలో ఉన్నాయి. సైట్స్ అపెండిక్స్-I జాబితాలోనూ ఉన్నాయి. ఆసియాలోని పలు ప్రాంతాల్లో సంప్రదాయ వైద్యంలో పాంగోలిన్ పొలుసులను ఉపయోగిస్తారు. ప్రపంచంలోనే అత్యధికంగా అక్రమ రవాణా జరుగుతున్న క్షీరదాల్లో పాంగోలిన్లు ఉన్నాయి. తదుపరి చట్టపరమైన చర్యల కోసం స్వాధీనం చేసుకున్న పొలుసులు, పట్టుబడిన వ్యక్తి, రవాణాకు ఉపయోగించిన వాహనాన్ని మేఘాలయలోని నొంగ్పోహ్ అటవీ రేంజ్ అధికారికి డీఆర్ఐ అప్పగించింది.

అంతకుముందు 2026 సెప్టెంబర్ 5, 6వ తేదీల్లో చిరుత చర్మాన్ని అక్రమంగా రవాణా చేసే వ్యవస్థే లక్ష్యంగా మధ్యప్రదేశ్లోని సిద్ధి అటవీశాఖ అధికారులతో కలిసి డీఆర్ఐ అధికారులు, సిద్ధి జిల్లాలో నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకన్నారు. మహీంద్రా థార్ వాహనంలో ప్రయాణిస్తున్న ఇద్దరి వద్ద నుంచి ఒక చిరుత చర్మాన్ని స్వాధీనం చేసుకున్నారు. తదుపరి దర్యాప్తులు, తనిఖీల ద్వారా ఈ సిండికేట్కు చెందిన మరో ఇద్దరిని గుర్తించారు. వారి నుంచి చిరుత చర్మం, అవయవాల అక్రమ వేట, స్వాధీనం, రవాణా, విక్రయానికి సంబంధించిన పలు ఆధారాలను సేకరించారు. చిరుత చర్మాన్ని, వాహనాన్ని స్వాధీనం చేసుకుని... వన్యప్రాణి (సంరక్షణ) చట్టం-1972 ద్వారా తదుపరి చర్యల నిమిత్తం పట్టుబడిన వ్యక్తులను సిద్ధి అటవీ శాఖ అధికారులకు అప్పగించారు.

వన్యప్రాణుల అక్రమ వాణిజ్యంపై అందిన కచ్చితమైన సమాచారం మేరకు 05.09.2026న అస్సాంలోని కేయోఖాలిలో ఇద్దరు వ్యక్తుల వద్ద సజీవంగా ఉన్న 12 టోకే బల్లులను డీఆర్ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వన్యప్రాణి (సంరక్షణ) చట్టం-1972లోని ఒకటో షెడ్యూల్, సైట్స్ అపెండిక్స్-II జాబితాలో ఈ టోకే బల్లులను చేర్చారు. ఆసియాలోని కొన్ని ప్రాంతాల్లో వీటిని సంప్రదాయ వైద్యం కోసం, శుష్క రూపంలోనూ వాడటం వల్ల అక్రమ రవాణాకు అవకాశం ఏర్పడింది. అరుదైన పెంపుడు జీవిగా కూడా వీటికి డిమాండ్ ఉంది. సజీవంగా ఉన్న బల్లులను స్వాధీనం చేసుకుని, అక్రమ రవాణాకు పాల్పడిన ఇద్దరు వ్యక్తులను, వన్యప్రాణి వస్తువులతో సహా అస్సాంలోని బిశ్వనాథ్ వన్యప్రాణి విభాగం అటవీ రేంజ్ అధికారికి అప్పగించారు.

కర్బి ఆంగ్లాంగ్ జిల్లాలో 28.08.2026న వాహనంలో ప్రయాణిస్తున్న ముగ్గురు ప్రయాణికులను డీఆర్ఐ అధికారులు అడ్డుకున్నారు. వారి నుంచి దాదాపు 9 కిలోల పాంగోలిన్ పొలుసులు, పుర్రె, పళ్లతో సుమారు 0.5 కేజీ పులి ఎముకలను స్వాధీనం చేసుకున్నారు. వన్యప్రాణి (సంరక్షణ) చట్టం-1972 ద్వారా స్వాధీనం చేసుకున్న వన్యప్రాణుల వస్తువులతో సహా వాహనాన్ని, ముగ్గురు వ్యక్తులను అస్సాంలోని బొకొలియా అటవీ రేంజ్ అధికారికి అప్పగించారు.
అంతరించిపోతున్న వన్యప్రాణుల నుంచి జంతువుల చర్మాలు, పాంగోలిన్ పొలుసులు, పులి అవయవాల వరకు వివిధ రకాల వన్యప్రాణుల అక్రమ రవాణా జరుగుతున్నట్లు స్వాధీనం చేసుకున్న వాటి ద్వారా తెలుస్తోంది. దీన్ని బట్టి నిరంతరం అంతర్గత ఏజెన్సీల సమన్వయం అవసరమని స్పష్టం అవుతోంది.
అటవీ శాఖలు, డబ్ల్యూసీసీబీ, ఇతర చట్ట అమలు సంస్థల సహకారంతో, వన్యప్రాణి (సంరక్షణ) చట్టం-1972 ద్వారా, నిఘా వర్గాల సమాచారం ఆధారంగా వన్యప్రాణుల అక్రమ రవాణా వ్యవస్థను డీఆర్ఐ విజయవంతంగా అడ్డుకుంటూ భారతదేశ జీవ వైవిధ్యాన్ని కాపాడుతోంది.
***
(రిలీజ్ ఐడి: 2308656)
సందర్శకుల సూచీ సంఖ్య : : 5