కార్మిక, ఉపాధికల్పన మంత్రిత్వ శాఖ
డాక్టర్ మన్సుఖ్ మాండవీయ అధ్యక్షతన ముంబయిలో సెప్టెంబర్ 11, 12 తేదీల్లో భవన, ఇతర నిర్మాణ రంగ కార్మికుల జాతీయ సమావేశం
వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు అనుసరిస్తున్న ఉత్తమ విధానాలు, విజయవంతమైన కార్యక్రమాలపై సదస్సులో చర్చ
నిర్మాణ రంగ కార్మికుల సంక్షేమం కోసం చేపట్టిన కీలక చర్యల పురోగతిపై సమీక్ష
నాడు పోస్టు చేయడమైనది:
09 SEP 2026 12:40PM by PIB Hyderabad
మహారాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ముంబయిలో సెప్టెంబర్ 11, 12 తేదీల్లో భవన, ఇతర నిర్మాణ కార్మికుల (బీఓసీడబ్ల్యూ) కోసం కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ జాతీయ సదస్సును నిర్వహించనుంది. కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ-యువజన వ్యవహారాలు, క్రీడలశాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ అధ్యక్షతన ఈ సదస్సు జరగనుంది. కేంద్ర కార్మిక, ఉపాధి-సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలశాఖ సహాయ మంత్రి శ్రీమతి శోభా కరంద్లాజే, వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల కార్మికశాఖ మంత్రులు, ఉన్నతాధికారులు, బీఓసీడబ్ల్యూ సంక్షేమ బోర్డుల చైర్పర్సన్లు, కార్యదర్శులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉన్నతాధికారులు ఈ సదస్సులో పాల్గొంటారు.
దేశంలోనే అతిపెద్ద ఉపాధి కల్పించే రంగాల్లో నిర్మాణ రంగం ఒకటిగా ఉంటూ.. లక్షలాది మంది కార్మికుల జీవనోపాధికి ఆధారంగా నిలుస్తోంది. కొత్త కార్మిక చట్టాల అమలుతో మారుతున్న బీఓసీడబ్ల్యూ వ్యవస్థను సమీక్షించేందుకు, సంక్షేమ బోర్డుల పనితీరును మరింత బలోపేతం చేసేందుకు ఈ సదస్సు కీలక వేదికగా నిలవనుంది. చట్టపరమైన బాధ్యతలు, కార్మికుల నమోదు, సంక్షేమ పథకాల అమలు, సంక్షేమ నిధుల పర్యవేక్షణ, వినియోగం వంటి అంశాలపై సదస్సులో చర్చించనున్నారు. వివిధ శాఖలు, సంస్థల మధ్య సమన్వయం పెంపొందించడం, సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా సేవలను అందించడంలో ఉన్న అవకాశాలనూ పరిశీలించనున్నారు.
రాష్ట్రాల బీసీఓడబ్ల్యూ సంక్షేమ బోర్డులు అమలు చేస్తున్న వినూత్న విధానాలు, విజయవంతమైన కార్యక్రమాలను సదస్సులో పంచుకోనున్నారు. నిర్మాణ కార్మికులకు సంక్షేమ కార్యక్రమాలను మరింత విస్తృతంగా, సమర్థవంతంగా అందేలా.. ఇతర రాష్ట్రాలు కూడా వీటిని అనుసరించి అమలు చేయగల ఉత్తమ విధానాలను గుర్తించేందుకు ఈ చర్చలు దోహదపడనున్నాయి.
2025 నవంబర్లో న్యూఢిల్లీలో జరిగిన జాతీయ కార్మిక సదస్సులో ప్రారంభించిన మూడు ప్రధాన కార్యక్రమాలైన రాష్ట్ర బీఓసీడబ్ల్యూ డిజిటల్ లేబర్ చౌక్, లేబర్ చౌక్-ఫెసిలిటేషన్ సెంటర్లు, ఆన్లైన్ బీఓసీడబ్ల్యూ సెస్ వసూలు వేదికల పురోగతిని ఈ సదస్సులో సమీక్షించనున్నారు. ఈ కార్యక్రమాల ద్వారా కార్మికులకు ఉపాధి అవకాశాలను బలోపేతం చేయడం, వారికి గౌరవప్రదమైన, సులభంగా అందుబాటులో ఉండే సేవలు అందించడం, సెస్ వసూలు, పర్యవేక్షణలో పారదర్శకత, సామర్థ్యాన్ని పెంచడం లక్ష్యంగా పెట్టుకున్నారు.
రెండు రోజుల పాటు జరిగే ఈ సదస్సులో అంతర్జాతీయ కార్మిక చలనశీలత మార్గాలు, నైపుణ్యాభివృద్ధి, ఉపాధి అవకాశాలు, కార్మిక గణాంకాలు, లేబర్ స్టాక్ వంటి అంశాలపై కూడా చర్చించనున్నారు. కేంద్రం, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, బీసీఓడబ్ల్యూ సంక్షేమ బోర్డుల మధ్య మరింత సమన్వయం పెంచడం, అమలులో ఉన్న లోపాలను గుర్తించడం, నిర్మాణ కార్మికులకు సామాజిక భద్రత, సంక్షేమం, ఉపాధి అవకాశాలు మరింత సమర్థవంతంగా, సులభంగా అందేలా ప్రాధాన్యతా చర్యలను రూపొందించడం ఈ సదస్సు లక్ష్యం.
***
(రిలీజ్ ఐడి: 2308257)
సందర్శకుల సూచీ సంఖ్య : : 3