మత్స్య పరిశ్రమ, పశు పోషణ మరియు పాడి పరిశ్రమ మంత్రిత్వ శాఖ
ఆక్వా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు
प्रविष्टि तिथि:
12 AUG 2026 1:34PM by PIB Hyderabad
ఈ–ఫిష్ వేదికలో నమోదైన సమాచారం, రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న డేటాబేస్ ప్రకారం రాష్ట్రంలో సుమారుగా 2.16 లక్షల మంది ఆక్వా రైతులు ఉన్నట్లు ఆంధ్రపదేశ్ ప్రభుత్వం వెల్లడించింది. వీరంతా సుమారు 5.79 లక్షల ఎకరాల్లో మంచినీటి, ఉప్పునీటి ఆక్వాకల్చర్ సాగులో నిమగ్నమై ఉన్నారని తెలియజేసింది.
మార్కెట్ ధరల్లో తగ్గుదల, చేపల మేత ధరల పెరుగుదలతో రాష్ట్రంలోని ఆక్వారైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందించిన నివేదిక తెలియజేస్తోంది. ఈ సమస్యను పరిష్కరించడానికి మేత ధరలను తగ్గించడంతో సహా అనేక చర్యలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకుంటోంది. ఈ నేపథ్యంలో రొయ్యల మేతపై కిలోగ్రాముకు రూ.4.00 చొప్పున ధరలను తగ్గించేందుకు దాణా తయారీదారులు అంగీకరించారు.
చేప, రొయ్యల సాగు చేస్తున్న రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు ఆక్వా రైతు సంఘాలు, ఉత్పత్తుల విలువను పెంచే సంస్థలు, ఎగుమతిదారులు, ఈ రంగానికి చెందిన ఇతర భాగస్వాములతో రాష్ట్ర మత్స్య విభాగం చురుగ్గా సమన్వయం చేసుకుంటోందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలియజేసింది. అదే విధంగా రాష్ట్రవ్యాప్తంగా ఎలాంటి పంట విరామాన్ని అధికారికంగా అమలు చేయడం లేదని కూడా రాష్ట్ర ప్రభుత్వం తెలియజేసింది.
రాష్ట్రంలోని ఆక్వా రైతుల ప్రయోజనాలను పరిరక్షించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కలసి భారత ప్రభుత్వ మత్స్య విభాగం వివిధ చర్యలు తీసుకుంటోంది. రాష్ట్ర ప్రభుత్వం అందించిన వివరాల ప్రకారం, నమోదు చేసుకున్న ఆక్వారైతులకు యూనిట్కు రూ.1.50 చొప్పున సబ్సిడీ టారిఫ్తో విద్యుత్తును అందిస్తోంది. అదే విధంగా దాణా తయారీదారులతో సంప్రదింపులు చేపట్టి రాష్ట్రంలో రొయ్యల మేతపై కిలోగ్రాముకు రూ.4.00 చొప్పున ధర తగ్గించింది. రొయ్యల పెంపకంలో ఆర్థికపరమైన సాధ్యాసాధ్యాలను మెరుగుపరచాల్సిన ప్రాధాన్యాన్ని గుర్తించి, ఆక్వాకల్చర్ సాగు వ్యయాన్ని తగ్గించేందుకు అనేక విధానపరమైన చర్యలను కేంద్ర ప్రభుత్వం చేపట్టింది. 2024–25, 2025–26 కేంద్ర బడ్జెట్లలో ఆక్వాసాగులో ముఖ్యమైన 16 ముడిసరకులపై కస్టమ్స్ సుంకాలను 30 శాతం నుంచి 0–5 శాతానికి హేతుబద్ధీకరించింది. ఫలితంగా అవసరమైన ముడి సరుకుల ధరలు తగ్గాయి. అదేవిధంగా, సాగు పరికరాలు, దాణా పదార్థాలు, నీటి కండిషనర్లు, చేపల వలలు, విలువ జోడించిన సముద్ర ఉత్పత్తులతో సహా 20 రకాలకు పైగా మత్స్య, ఆక్వాకల్చర్ సంబంధిత ఉత్పత్తులపై జీఎస్టీ రేట్లను 12–18 శాతం నుంచి 5 శాతానికి తగ్గించేందుకు భారత ప్రభుత్వం 2025 సెప్టెంబరులో ఆమోదం తెలిపింది.
ఈ చర్యలు ఆంధ్రప్రదేశ్తో సహా వివిధ రాష్ట్రాల్లో రైతులకు సాగు వ్యయాన్ని తగ్గించి, లాభాలను పెంపొదిస్తాయనీ, భారత ఆక్వాకల్చర్ రంగంలో పోటీతత్వాన్ని మెరుగుపరుస్తాయనీ అంచనా వేస్తున్నారు. అదనంగా, దిగుబడి అనంతర నష్టాలను తగ్గించి మత్స్యరైతుల ఆదాయాన్ని పెంపొందించేలా ఉత్పత్తుల విలువను పెంపొందించే పరిశ్రమలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సహిస్తున్నాయి.
రాజ్యసభలో అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా ఈ సమాచారాన్ని మత్స్య, పశుసంవర్ధక, పాడి పరిశ్రమ శాఖ మంత్రి శ్రీ రాజీవ్ రంజన్ సింగ్ అలియాస్ లలన్ సింగ్ అందించారు.
***
(रिलीज़ आईडी: 2298439)
आगंतुक पटल : 9