పౌర విమానయాన మంత్రిత్వ శాఖ
దేశంలో 11 కొత్త ఎఫ్టీఓల ఏర్పాటుకు అంగీకార పత్రాలను సమర్పించిన పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు
అన్ని ఎఫ్టీఓ రౌండ్ టేబుల్ సమావేశానికి అధ్యక్షత వహించిన రామ్మోహన్ నాయుడు... ఎఫ్టీఓ స్లాట్ యాప్ ప్రారంభం
प्रविष्टि तिथि:
05 AUG 2026 9:51PM by PIB Hyderabad
భారతదేశంలో పైలట్ శిక్షణ వ్యవస్థను బలోపేతం చేయటంలో, వేగంగా విస్తరిస్తున్న పౌర విమానయాన రంగానికి మద్దతివ్వటంలో ఓ కీలకమైన ముందడుగు పడింది. భారత విమానాశ్రయాల ప్రాధికార సంస్థ (ఏఏఐ)కు సంబంధించిన ఏడు విమానాశ్రయాల్లో 11 కొత్త ఫ్లయింగ్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్ల (ఎఫ్టీఓలు) ఏర్పాటుకు మార్గం సుగమం అయింది. అందుకు సంబంధించిన అంగీకార పత్రాలను ఇవాళ కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి శ్రీ కింజరాపు రామ్మోహన్ నాయుడు అందజేశారు.
దేశవ్యాప్తంగా 63 ఫ్లయింగ్ బేస్ల నుంచి ప్రస్తుతం 41 ఫ్లయింగ్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్లు కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. ఏడు ఏఏఐ విమానాశ్రయాల్లో ఈ 11 కొత్త ఎఫ్టీఓలను చేర్చటంతో భారత వార్షిక పైలట్ శిక్షణ సామర్థ్యం ఏడాదికి 750 క్యాడెట్లకు పెరుగుతుందని అంచనా. ఇది దేశీయ శిక్షణ వ్యవస్థకు గణనీయంగా ఊతమిస్తుంది.
ఈ సందర్భంగా శ్రీ రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ... "ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దార్శనిక నాయకత్వంలో ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న విమానయాన మార్కెట్లలో ఒకటిగా భారత్ అవతరించింది. వికసిత్ భారత్, ఆత్మనిర్భర్ భారత్ స్ఫూర్తితో విమానయాన మౌలిక సదుపాయాలను విస్తరిస్తున్నాం. ఈ రంగం దీర్ఘకాలిక వృద్ధికి మద్దతుగా భవిష్యత్తుకు సిద్ధంగా ఉండే శ్రామిక శక్తిని తయారుచేస్తున్నాం" అని అన్నారు.
గత రెండేళ్లుగా ఎఫ్టీఓ వ్యవస్థ వృద్ధిని వివరిస్తూ.. "గత రెండేళ్లలో భారత్ ఇప్పటికే ఆరు కొత్త ఎఫ్టీఓలను ఏర్పాటు చేసింది. దీంతో భారత ఎఫ్టీఓల వద్ద అందుబాటులో ఉన్న శిక్షణ విమానాల సంఖ్య 324 నుంచి 385కి పెరిగింది. ఫలితంగా పైలట్ శిక్షణ వ్యవస్థలో వార్షిక ఫ్లయింగ్ గంటలు 25 శాతానికి పెరిగాయి. ఇది కేవలం సంఖ్య పరంగా పెరుగుదల మాత్రమే కాదు... శిక్షణ సామర్థ్యం, కార్యాచరణ వినియోగంలో స్పష్టమైన మెరుగుదల" అని మంత్రి తెలిపారు.
ఈ విస్తరణ వల్ల పైలట్ల ఉత్పాదకతలో గణనీయమైన వృద్ధి కనబడింది. వాణిజ్య పైలట్ లైసెన్సులు (సీపీఎల్ల) సంఖ్య 2024లో 1,347 నుంచి 2025 నాటికి 1,652కి పెరిగింది. ఇది గత దశాబ్దంలోనే అత్యధికం కాగా... 2026లో ఈ సంఖ్య మరింత పెరుగుతుందని అంచనా.
శ్రీ రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ... "భారతీయ విమానయాన సంస్థల వద్ద ప్రస్తుతం 1,640 విమానాల ఆర్డర్లు ఉన్నాయి. రాబోయే ఐదేళ్లలో దాదాపు 500 విమానాలు అందుబాటులోకి వస్తాయని అంచనా. ఈ అపూర్వమైన వృద్ధిని అందుకునేందుకు శిక్షణ పొందిన విమానయాన నిపుణుల బలమైన దేశీయ వ్యవస్థ అవసరం. 'భారతదేశంలో శిక్షణ పొందండి... భారతదేశంలో విమానం నడపండి' అనేది మా స్పష్టమైన దృక్పథం" అని తెలిపారు.
పైలట్ శిక్షణను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం చేపట్టిన విధానపరమైన సంస్కరణలను కూడా మంత్రి తెలియజేశారు. వీటిలో ఎఫ్టీఓ విధాన సరళీకరణ, విమానాశ్రయ సుంకాల రద్దు, భూమి అద్దెల క్రమబద్దీకరణ ఉన్నాయి. సీపీఎల్ పరీక్షల విధానం కూడా డిజిటలైజ్ అయింది. పరీక్షలకు దరఖాస్తు చేసుకునే విద్యార్థులు పరీక్ష పోర్టల్ ద్వారా జనరేట్ అయిన కంప్యూటర్ నంబర్తో దరఖాస్తులను సులభంగా సమర్పించవచ్చు. ఎలక్ట్రానిక్ లైసెన్సులను జారీ చేస్తున్న రెండో దేశంగా భారత్ నిలవటంతో నేడు భారతీయ పైలట్లు ప్రపంచవ్యాప్తంగా మరింత పోటీతత్వంతో ఉన్నారు.
కేంద్రమంత్రి ప్రసంగంలో ప్రధానమైన అంశం డీజీసీఏ ఎఫ్టీఓ ర్యాంకింగ్ వ్యవస్థ. "పైలట్ శిక్షణను మరింత పారదర్శకంగా, డేటా ఆధారితంగా, యువ ఆశావహులు, వారి కుటుంబాలకు ఆకర్షణీయంగా తీర్చిదిద్దేందుకు ఈ ర్యాంకింగ్ వ్యవస్థను ప్రవేశపెట్టారు. ఈ వ్యవస్థ ద్వారా ఇప్పటికే మంచి ఫలితాలు వస్తుండటం నాకు సంతోషాన్ని కలిగించింది. దీనివల్ల 'సి' కేటగిరీ ఎఫ్టీఓలు తగ్గి, 'బి' కేటగిరీ ఎఫ్టీఓలు పెరిగాయి. గత ఆరు నెలల్లో ఐజీఆర్యూఏ ప్రతి విమానానికి సగటున ఏడాదికి 1,765 విమానయాన గంటలను సాధించింది. ఇది ప్రపంచవ్యాప్త ప్రామాణికమైన సుమారు 1,500 గంటల కంటే చాలా ఎక్కువ. 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఈ అకాడమీ 27 శాతం ఆదాయ వృద్ధిని నమోదు చేసింది. అంతేకాకుండా, గత రెండు దశాబ్దాలుగా నిరంతరం ఎదుర్కొంటున్న నష్టాల నుంచి కోలుకుని ఈ ఆర్థిక సంవత్సరాన్ని బడ్జెట్ మిగులుతో ముగించింది" అని మంత్రి తెలిపారు.
హాన్సా-3 (ఎన్జీ) ద్వారా స్వదేశీ శిక్షణా విమానాల అభివృద్ధిలో సాధించిన పురోగతిని కూడా శ్రీ రామ్మోహన్ నాయుడు ప్రస్తావించారు. భారతదేశంలో స్వావలంబన గల విమానయాన శిక్షణా వ్యవస్థను బలోపేతం చేయటంలో ఇదొక కీలక ముందడుగుగా అభివర్ణించారు.
"మన ప్రయత్నాలన్నింటిలో ప్రధానంగా భద్రత ఉండాలి. శిక్షకుల పర్యవేక్షణను బలోపేతం చేయాలి. ప్రామాణిక ఆపరేటింగ్ విధానాలను కచ్చితంగా పాటించేలా చూడాలి. అన్ని ఎఫ్టీఓల్లో బలమైన భద్రతా సంస్కృతిని పెంపొందించాలి" అని చెబుతూ మంత్రి ప్రసంగాన్ని ముగించారు.
ఈ కార్యక్రమం సందర్భంగా ఎఫ్టీఓ ఐఎఫ్ఆర్ స్లాట్ బుకింగ్ యాప్ను కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు ప్రారంభించారు. ఐఎఫ్ఆర్ శిక్షణను సులభతరం చేయటానికి అందుబాటులో ఉన్న విమానాశ్రయ మౌలిక సదుపాయాలను సక్రమంగా, సరైన రీతిలో వినియోగించుకునేందుకు ఈ మొబైల్ యాప్ను అభివృద్ధి చేశారు. ఇది దేశంలోని ఏఏఐ విమానాశ్రయాల్లో అందుబాటులో ఉన్న ఐఎఫ్ఆర్ శిక్షణ స్లాట్లను ఎఫ్టీఓలు స్పష్టంగా చూసుకునేలా వీలు కల్పిస్తుంది. డిజిటల్ పద్ధతిలో స్లాట్ బుకింగ్ అభ్యర్థనలను సమర్పించేందుకు ఇది సహాయపడుతుంది.
ఈ కార్యక్రమంలో పౌర విమానయాన శాఖ కార్యదర్శి శ్రీ సమీర్ కుమార్ సిన్హా, పౌర విమానయాన శాఖ అదనపు కార్యదర్శి శ్రీ పునీత్ కన్సల్, ఏఏఐ చైర్మన్ శ్రీ విపిన్ కుమార్తో పాటు పౌర విమానయాన శాఖ, డీజీసీఏ, ఏఏఐకి సంబంధించిన పలువురు ఉన్నతాధికారులు, దేశవ్యాప్తంగా ఉన్న ఫ్లయింగ్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్స్ ప్రతినిధులు పాల్గొన్నారు.







***
(रिलीज़ आईडी: 2295377)
आगंतुक पटल : 6