ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ ఫర్మేశన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ
సీ-డీఏసీ, భారత భూగర్భ సర్వే సంస్థల విస్తృత అవగాహన ఒప్పందం
నవ తరం సాంకేతికతల సాయంతో భూగర్భ శాస్త్రం, ఖనిజాన్వేషణ, విపత్తుల వేళ తీసుకోదగ్గ సహాయక చర్యలను పటిష్ఠపరచడమే ధ్యేయం
భూ విజ్ఞాన సంబంధిత సేవల కోసం కృత్రిమ మేధ, హై-పెర్ఫార్మెన్స్ కంప్యూటింగ్, ఉన్నత డిజిటల్ సాంకేతికతలను వినియోగించుకోనున్న భాగస్వామ్యమిది
प्रविष्टि तिथि:
04 AUG 2026 4:55PM by PIB Hyderabad
నవ తరం సాంకేతికతల సాయంతో భూ విజ్ఞానశాస్త్రం, ఖనిజాన్వేషణ, విపత్తుల వేళ తీసుకోదగిన సహాయక చర్యలకు సంబంధించిన సహకారాన్ని బలోపేతం చేయడానికి ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతికత మంత్రిత్వశాఖ (ఎమ్ఈఐటీవై)కు చెందిన సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ (సీ-డీఏసీ), భారత భూగర్భ సర్వే సంస్థ (జీఎస్ఐ) ఒక విస్తృత అవగాహన ఒప్పందాన్ని (ఎమ్ఓయూ) కుదుర్చుకున్నాయి.
ఎమ్ఈఐటీవై కార్యదర్శి శ్రీ ఎస్.కృష్ణన్ సమక్షంలో సీ-డీఏసీ డైరెక్టర్ జనరల్ శ్రీ ఎమ్. మాగేశ్, భారత భూగర్భ సర్వే సంస్థ (జీఎస్ఐ) అదనపు డైరెక్టర్ జనరల్ శ్రీ ప్రదీప్ సింగ్ న్యూఢిల్లీలోని ఎలక్ట్రానిక్స్ సదన్లో ఎమ్ఓయూపై సంతకాలు చేశారు.

సీ-డీఏసీకి చెందిన ఉన్నత స్థాయి కంప్యూటింగ్ (హెచ్పీసీ) సామర్థ్యాల్నీ, జీఎస్ఐకి చెందిన భూగర్భ ప్రావీణ్యాన్నీ మేళవించి, ఉన్నత డిజిటల్ సాంకేతికతలతో నేల అడుగున అన్వేషణను చేపట్టడంలో ఎదురయ్యే సవాళ్లను పరిష్కరించాలన్నదే ఈ ఒప్పంద లక్ష్యం. ఈ భాగస్వామ్యంలో పెద్ద భూభౌతిక డేటాసెట్లను ప్రాసెస్ చేయడానికి కృత్రిమ మేధ (ఏఐ)నీ, హెచ్పీసీనీ ఉపయోగిస్తారు. దీనితో.. అధిక స్పష్టత కలిగిన 3డీ సబ్సర్ఫేస్ మ్యాపింగ్, ఖనిజ నిక్షేపాలను గుర్తించడానికి ముందస్తు అంచనాలతో కూడిన మోడళ్ల రూపకల్పన, దశాబ్దాల నాటి పాత అసంఘటిత భూవైజ్ఞానిక రికార్డులను ఒక డొమైన్ లార్జ్ లాంగ్వేజ్ మోడల్ (ఎల్ఎల్ఎమ్)గా ఆవిష్కరించడానికి మార్గం సుగమం అవుతుంది.
కొండచరియలు విరిగిపడే ప్రమాదం పొంచి ఉన్న ప్రాంతాలను సింథెటిక్ అపెర్చర్ రాడార్ (ఎస్ఏఆర్) ను ఉపయోగించి పర్యవేక్షిస్తుండటం, ప్రాథమిక హెచ్చరిక వ్యవస్థలను రూపొందించడం, హిమానీనద సరస్సుల విస్ఫోటం వల్ల అకస్మాత్తుగా విరుచుకుపడే వరదలకు (గ్లేసియర్ లేక్ అవుట్బరస్ట్ ఫ్లడ్స్.. జీఎల్ఓఎఫ్) సంబంధించిన అధ్యయనాల్ని చేపట్టడం ద్వారా విపత్తుకు సంబంధించిన నష్టాల తీవ్రతను తగ్గించడానికి ఈ సహకారం తోడ్పడనుంది. దీనికి అదనంగా కీలక ఖనిజాలు, రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ (ఆర్ఈఈ)ని కనుగొనే ప్రక్రియను వేగవంతం చేయడం కూడా ఈ ఒప్పందం మరో ఉద్దేశం. ఈ కార్యక్రమంతో భారత్కు ఆర్థిక భద్రత, సరఫరా వ్యవస్థ దృఢతరం కావడంతో పాటు సాంకేతిక స్వావలంబనలో తోడ్పాటు లభిస్తుంది.

ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్న వారిలో ఎమ్ఈఐటీవై సంయుక్త కార్యదర్శి శ్రీ సుదీప్ శ్రీవాస్తవ, డీజీసీఓ, జీఎస్ఐ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ శ్రీ మనీశ్ ఖార్, డీజీసీఓ, జీఎస్ఐ డైరెక్టర్ డాక్టర్ ప్రవీర్ పంకజ్, డీజీసీఓ, జీఎస్ఐ డైరెక్టర్ డాక్టర్ ముకేశ్ వర్మ, ఎమ్ఈఐటీవై గ్రూప్ కోఆర్డినేటర్ ( ఐటీ ఆర్ అండ్ డీ) శ్రీ మనోజ్ జైన్, సీ-డీఏసీ (కార్పొరేట్, ప్రభుత్వ వాణిజ్యం) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కమొడోర్ సందీప్ వాధ్వా, సీ-డీఏసీ హైదరాబాద్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ సీహెచ్. ఎ.ఎస్. మూర్తి, సీ-డీఏసీ కోల్కతా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీ మృణ్మయ్ కుమార్ దాస్, సీ-డీఏసీ పుణేకు చెందిన సైంటిస్టు ‘ఎఫ్’ శ్రీ ప్రసాద్ వడ్లాకొండావర్,
సీ-డీఏసీ పుణే కు చెందిన సైంటిస్ట్ ‘జీ’, విభాగ అధిపతి డాక్టర్ మనోజ్ ఖరే, సీ-డీఏసీ చెన్నైకి చెందిన సైంటిస్ట్ ‘ఎఫ్’, కేంద్ర అధిపతి డాక్టర్ డి. ఎతిరాజన్, సీ-డీఏసీ చెన్నైకి చెందిన సైంటిస్ట్ ‘ఎఫ్’ శ్రీమతి పూంగుళలి. పి, సీ-డీఏసీ చెన్నైకి చెందిన సైంటిస్ట్ ‘ఈ’ శ్రీమతి సాయంతనీ భట్టాచార్య, సైంటిస్ట్ ‘సి’ శ్రీమతి గీతా సింగ్తో పాటు సీ-డీఏసీ, ఎమ్ఈఐటీవైల ప్రతినిధులు ఉన్నారు.
***
(रिलीज़ आईडी: 2294677)
आगंतुक पटल : 7