భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహన పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు


‘పీఎం ఇ-డ్రైవ్‌’ పథకం కింద ₹2,000 కోట్లు కేటాయింపు

प्रविष्टि तिथि: 04 AUG 2026 6:34PM by PIB Hyderabad

   విద్యుత్‌ వాహనాలకు సంబంధించి దేశవ్యాప్తంగా ప్రస్తుతం ‘పీఎం ఇ-డ్రైవ్‌’ పథకం అమలవుతోంది. అయితే, కేంద్ర ప్రభుత్వం దీనికింద రాష్ట్రాలవారీగా నిధులు కేటాయించలేదు. ఈ నేపథ్యంలో 22.07.2026 నాటికి అస్సాంలోని కాచార్ జిల్లాలో అమ్ముడైన 8,003 సహా రాష్ట్రవ్యాప్తంగా 42,035 ఎలక్ట్రిక్‌ (ఈవీ) వాహనాలు అమ్ముడయ్యాయి. అంతేగాక ఆ రాష్ట్రంలో 40,009 ఈవీలకు ప్రోత్సాహకాలు మంజూరు చేశారు. ఈ మేరకు వాస్తవ తయారీదారు (ఓఈఎం)లకు ₹99.10 కోట్ల దాకా వాపసు చెల్లించారు.

అస్సాం సహా దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహన పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్ల (ఈవీపీసీఎస్‌) ఏర్పాటుకు ‘పీఎం ఇ-డ్రైవ్‌’ పథకం కింద ప్రభుత్వం ₹2,000 కోట్లు కేటాయించింది. అయితే, వీటి ఏర్పాటుపై అస్సాం ప్రభుత్వం నుంచి ఇప్పటిదాకా ఎలాంటి ప్రతిపాదన రాలేదు.

ఇక అస్సాంలోని కాచార్ జిల్లాకు సంబంధించి భారీ పరిశ్రమల మంత్రిత్వశాఖ (ఎంహెచ్‌ఐ) సంబంధిత అంచనాలేవీ కూడా రూపొందించలేదు.

ఆ రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలు సహా దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్ రవాణాను ప్రోత్సహించడం, ఛార్జింగ్ మౌలిక సదుపాయాల బలోపేతంతో పాటు ఎలక్ట్రిక్ ప్రజా రవాణా-వాణిజ్య వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించడానికి ‘ఎంహెచ్‌ఐ’ కింది పథకాలను అమలు చేస్తోంది:

     i.     ‘ఫేమ్‌ ఇండియా’ పథకం ఫేజ్‌-2 (ఫాస్టర్‌ అడాప్షన్‌ అండ్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ ఆఫ్‌ హైబ్రిడ్‌ అండ్‌ ఎలక్ట్రిక్‌ వెహికల్స ఇన్‌ ఇండియా): ఈ పథకాన్ని 01.04.2019 నుంచి 31.03.2024 వరకు ఐదేళ్ల కాలానికిగాను ₹11,500 కోట్ల బడ్జెట్ కేటాయింపుతో ప్రభుత్వం అమలు చేసింది. దీనికింద ఎలక్ట్రిక్ ద్విచక్ర-త్రిచక్ర, చతుశ్చక్ర వాహనాల వినియోగం పెంపు దిశగా డిమాండ్ ఆధారిత ప్రోత్సాహకాలతోపాటు ఎలక్ట్రిక్ బస్సులు, ‘ఈవీపీసీఎస్‌’ల ఏర్పాటుకు గ్రాంట్లు మంజూరు చేసింది. ఆ మేరకు ‘ఫేమ్‌-2’ పథకం కింద సుమారు 16.72 లక్షల ఎలక్ట్రిక్ వాహనాల విక్రయానికి మద్దతు లభించింది. దీంతోపాటు 30.06.2026 నాటికి 5,297 ఎలక్ట్రిక్ బస్సులు కూడా అందుబాటులోకి వచ్చాయి. మరోవైపు దేశమంతటా ‘ఈవీపీసీఎస్‌’ల ఏర్పాటుకు ఈ పథకం కింద ప్రభుత్వం ₹912.50 కోట్లు కేటాయించింది.

    ii.     భారత్‌లో ఆటోమొబైల్-ఆటో విడిభాగాల పరిశ్రమ కోసం ‘ఉత్పత్తి సంధానిత ప్రోత్సాహక పథకం (పీఎల్‌ఐ-ఆటో): అత్యాధునిక (ఈవీలు సహా) ఆటోమోటివ్ టెక్నాలజీ (ఏఏటీ) ఉత్పత్తుల తయారీ సామర్థ్యం పెంచే లక్ష్యంతో కేంద్ర బడ్జెట్‌లో  ₹25,938 కోట్ల నిధుల కేటాయిస్తూ ప్రభుత్వం 23.09.2021న ఈ పథకాన్ని ప్రకటించింది.

   iii.     జాతీయ అత్యాధునిక కెమిస్ట్రీ సెల్ (ఏసీసీ) బ్యాటరీ స్టోరేజ్ కార్యక్రమం కోసం పీఎల్‌ఐ పథకం:: దేశంలో ఏసీసీ తయారీని ప్రోత్సహించేందుకు ₹18,100 కోట్ల బడ్జెట్ కేటాయింపుతో ప్రభుత్వం 09.06.2021న ఈ పథకాన్ని ప్రకటించింది. దేశంలో 50 జీడబ్ల్యూహెచ్‌ సామర్థ్యం గల ఏసీసీ బ్యాటరీల కోసం పోటీతత్వ సహిత దేశీయ తయారీ వ్యవస్థ ఏర్పాటు చేయడం ఈ పథకం లక్ష్యం.

  iv.     పీఎం ఎలక్ట్రిక్ డ్రైవ్ రివల్యూషన్ ఇన్ ఇన్నొవేటివ్ వెహికల్ ఎన్‌హాన్స్‌మెంట్ (పీఎం ఇ-డ్రైవ్‌) పథకం: ఈ పథకం ₹10,900 కోట్ల అంచనా వ్యయంతో 01.04.2024 నుంచి అమలులోకి వచ్చింది. దీనికింద సుమారు 28.30 లక్షల ద్విచక్ర-త్రిచక్ర ఎలక్ట్రిక్‌ వాహనాలు సహా ఈవీ ట్రక్కులు, బస్సులు, అంబులెన్స్‌ల  కొనుగోలుకు ప్రోత్సాహకం మంజూరు చేస్తారు. అంతేకాకుండా, ‘ఈవీపీసీఎస్‌’ల ఏర్పాటుతో పాటు పరీక్షా సంస్థల ఆధునికీకరణకూ ఈ పథకం కింద ఆర్థిక సహాయం లభిస్తుంది. ఇక ఈ పథకం కింద 14,028 ఇ-బస్సుల వినియోగం కోసం ₹4,391 కోట్లు కేటాయించారు. ఇందులో 13,800 బస్సులను 40 లక్షలకు పైగా జనాభా గల 7 నగరాలకు (ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్, ముంబై, అహ్మదాబాద్, పుణె సూరత్) కేటాయించారు. అలాగే, జమ్మూకాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతానికి 200 బస్సులు మంజూరయ్యాయి. దేశవ్యాప్తంగా ‘ఈవీపీసీఎస్‌’ల ఏర్పాటుకు ప్రభుత్వం  ₹2,000 కోట్లు కేటాయించింది.

    v.     పీఎం ఇ-బస్సు సేవ - పేమెంట్ సెక్యూరిటీ మెకానిజం (పీఎస్‌ఎం) పథకం: ఈ పథకాన్ని ₹3,435.33 కోట్ల అంచనా వ్యయంతో 28.10.2024న ప్రకటించారు. దేశవ్యాప్తంగా 38,000కు పైగా ఎలక్ట్రిక్ బస్సుల వినియోగానికి తోడ్పాటునివ్వడం దీని లక్ష్యం. ప్రజా రవాణా సంస్థల (పీటీఏ) నుంచి చెల్లింపు వైఫల్యం తలెత్తితే ఇ-బస్సు నిర్వాహకులకు భద్రత కల్పించడమే ఈ పథకం ప్రధానోద్దేశం.

వీటన్నిటితో పాటు దేశంలో ఎలక్ట్రిక్ వాహన వినియోగం పెంపు దిశగా కేంద్ర ప్రభుత్వం కింది కార్యక్రమాలను కూడా చేపట్టింది:

     i.     విద్యుత్‌ వాహనాలు, వాటి ఛార్జర్లు, ఛార్జింగ్ స్టేషన్లపై జీఎస్టీ 5 శాతం తగ్గింపు.

    ii.     బ్యాటరీతో నడిచే వాహనాలకు గ్రీన్ లైసెన్స్ ప్లేట్ల జారీతోపాటు వాటికి పర్మిట్ నిబంధనల నుంచి మినహాయింపు ఇవ్వనున్నట్లు రోడ్డు రవాణా-జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ ప్రకటించింది.

   iii.     ఈవీలపై రహదారి పన్ను మాఫీ దిశగా ఆ మంత్రిత్వశాఖ రాష్ట్రాలకు ఒక సూచనాత్మక ఆదేశం జారీ చేసింది. తద్వారా ఈవీల ప్రారంభ ధరనే తగ్గించే వెసులుబాటు కలుగుతుంది.

***


(रिलीज़ आईडी: 2294622) आगंतुक पटल : 12
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी