లోక్సభ సచివాలయం
భారత్-ఉజ్బెకిస్తాన్ మధ్య శతాబ్ధాల నాటి చారిత్రక, సాంస్కృతిక, నాగరికత సంబంధాలు: లోక్సభ స్పీకర్
ద్వైపాక్షిక సంబంధాలకు సరికొత్త ఊతమివ్వనున్న భారత్-ఉజ్బెకిస్థాన్ పార్లమెంటరీ స్నేహ బృందం: లోక్సభ స్పీకర్
లోక్సభ స్పీకర్తో ఉజ్బెకిస్తాన్ విదేశాంగ మంత్రి శ్రీ బఖ్తియోర్ సైదోవ్ భేటీ
प्रविष्टि तिथि:
04 AUG 2026 3:43PM by PIB Hyderabad
భారత్, ఉజ్బెకిస్థాన్ దేశాలు శతాబ్దాల నాటి చారిత్రక, సాంస్కృతిక, నాగరికత సంబంధాలతో ముడిపడి ఉన్నాయని లోక్సభ స్పీకర్ శ్రీ ఓం బిర్లా పేర్కొన్నారు. ఈ సుదీర్ఘ అనుబంధమే ఇరు దేశాల చిరకాల మైత్రికి కీలకంగా నిలుస్తోందని అన్నారు. పార్లమెంట్ హౌస్లో ఉజ్బెకిస్థాన్ విదేశాంగ మంత్రి బఖ్తియోర్ సైదోవ్తో స్పీకర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా శ్రీ బిర్లా మాట్లడుతూ.. ఇరు దేశాల మధ్య పెరుగుతున్న రాజకీయ విశ్వాసం, విస్తరిస్తున్న వాణిజ్యం, పెట్టుబడులు, ప్రజల మధ్య పెరుగుతున్న సంబంధాలు రాబోయే రోజుల్లో ఈ ద్వైపాక్షిక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తాయని ధీమా వ్యక్తం చేశారు. భారత్-ఉజ్బెకిస్థాన్ సంబంధాలపై ఇరు దేశాల నాయకులు విస్తృత చర్చలు జరిపారు. ముఖ్యంగా పార్లమెంటరీ సహకారం, వాణిజ్యం, పెట్టుబడులు, విద్య, సంస్కృతితో పాటు ప్రాంతీయ, ప్రపంచ ప్రాముఖ్యత కలిగిన పలు అంశాలపై ప్రత్యేకంగా దృష్టి సారించారు.
భారతీయ ప్రజాస్వామ్య సంప్రదాయాల గురించి శ్రీ ఓం బిర్లా మాట్లాడుతూ.. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్, ప్రజల ఆకాంక్షలను, వైవిధ్యాన్ని ప్రతిబింబించే అద్భుతమైన పార్లమెంటరీ వ్యవస్థను కలిగి ఉందని తెలిపారు. 543 మంది సభ్యులున్న లోక్సభ దేశవ్యాప్తంగా కోట్లాది మంది పౌరులకు ప్రాతినిధ్యం వహిస్తోందని చెప్పారు. భారత్లోని బహుళ పక్ష రాజ్యాంగ వ్యవస్థ విభిన్న ఆలోచనలకు, నిర్మాణాత్మక చర్చలకు సమాన అవకాశాలు కల్పిస్తుందని వివరించారు. భారత పార్లమెంట్ పనితీరును వివరిస్తూ... మన పార్లమెంటు ఏడాదికి మూడు సమావేశాలను నిర్వహిస్తుందని స్పీకర్ పేర్కొన్నారు. ప్రస్తుతం జరుగుతున్న వర్షాకాల సమావేశాల్లో జాతీయ ప్రాధాన్యత కలిగిన పలు ముఖ్యాంశాలపై చురుగ్గా చర్చలు సాగుతున్నాయని ఉజ్బెకిస్థాన్ విదేశాంగ మంత్రికి తెలియజేశారు.
మౌలిక సదుపాయాల కల్పన, డిజిటల్ ఆవిష్కరణలు, సాంకేతికత, అనుసంధానం, పెట్టుబడులు, వాణిజ్య రంగాల్లో భారత్ సాధించిన గణనీయమైన పురోగతిని లోక్సభ స్పీకర్ శ్రీ ఓం బిర్లా ప్రస్తావించారు. భారతీయ యువత ప్రపంచవ్యాప్తంగా నాయకత్వ బాధ్యతలు చేపట్టడం పెరుగుతోందని ఆయన అన్నారు. ప్రముఖ విశ్వవిద్యాలయాలు, అంతర్జాతీయ సంస్థలతో భారత్ భాగస్వామ్యం నిరంతరం విస్తరిస్తోందని అన్నారు. 2026 మార్చిలో ఏర్పాటు చేసిన భారత్-ఉజ్బెకిస్థాన్ పార్లమెంటరీ స్నేహా బృందం ఇరు దేశాల చట్టసభల మధ్య సంబంధాలకు కొత్త ఊపునిస్తుందని... ఆర్థిక, విద్యా, సాంస్కృతిక, ప్రజా సంబంధాల రంగాల్లో సహకారాన్ని మరింత పెంపొందిస్తుందని ఆయన నమ్మకం వ్యక్తం చేశారు.
2025 ఏప్రిల్లో తాష్కెంట్లో జరిగిన 150వ అంతర్-పార్లమెంటరీ యూనియన్ (ఐపీయూ) అసెంబ్లీలో తాను పాల్గొన్న విషయాన్ని స్పీకర్ ఓం బిర్లా ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఆ పర్యటనలో ఉజ్బెకిస్థాన్ అధ్యక్షుడు శ్రీ షవ్కత్ మిర్జియోయేవ్, సెనేట్ ఛైర్పర్సన్ తంజిలా నార్బయేవా, శాసనసభ స్పీకర్ నురిద్దీన్ ఇస్మాయిలోవ్లతో జరిగిన ఉన్నత స్థాయి భేటీలను ప్రస్తావించారు. ఆ పర్యటనలే ఇరుదేశాల పార్లమెంటరీ సహకారానికి గొప్ప పునాది వేశాయని చెప్పారు. భారత్-ఉజ్బెకిస్థాన్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలు స్థిరంగా అభివృద్ధి చెందుతుండటం పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తూ, విదేశాంగ మంత్రి ప్రస్తుత పర్యటన ఇరు దేశాల సమగ్ర భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తుందని స్పీకర్ ఓం బిర్లా ఆశాభావం వ్యక్తం చేశారు.
భారత్తో ఉన్న బహుముఖ భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ఉజ్బెకిస్థాన్ కట్టుబడి ఉందని ఆ దేశ విదేశాంగ మంత్రి శరీ బఖ్తియోర్ సైదోవ్ పేర్కొన్నారు. రాజకీయ, ఆర్థిక, పార్లమెంటరీ సహకారాన్ని విస్తరించడానికి తాష్కెంట్ అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. భారత్ పటిష్టమైన ప్రజాస్వామ్య సంప్రదాయాలను ఆయన ప్రశంసించారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్ చట్టసభల అనుభవం నుంచి ఉజ్బెకిస్థాన్ ఎంతో లబ్ధి పొందుతుందని అన్నారు. ఇరుదేశాల సమగ్ర వ్యూహాత్మక బంధం విస్తరించడానికి మెరుగైన పార్లమెంటరీ భాగస్వామ్యం ఎంతో తోడ్పడుతుందని శ్రీ సైదోవ్ చెప్పారు. వాణిజ్యం, పెట్టుబడులు, ఉమ్మడి ప్రాజెక్టులు, వర్ధమాన రంగాల్లో సహకారాన్ని పెంచుకోవడానికి భాగస్వామ్య దృక్పథం అవసరమని ఆయన పిలుపునిచ్చారు.
ఈ భేటీ సందర్భంగా ఉజ్బెకిస్థాన్ ఆతిథ్యం ఇచ్చిన 150వ అంతర్-పార్లమెంటరీ యూనియన్ (ఐపీయూ) అసెంబ్లీ వివరాలతో కూడిన ప్రత్యేక స్మారక ప్రచురణను లోక్సభ స్పీకర్ శ్రీ ఓం బిర్లాకు శ్రీ బఖ్తియోర్ సైదోవ్ అందజేశారు.
***
(रिलीज़ आईडी: 2294439)
आगंतुक पटल : 14