గనుల మంత్రిత్వ శాఖ
కీలక, వ్యూహాత్మక ఖనిజ బ్లాకుల ఎనిమిదో విడత వేలాన్ని ప్రారంభించనున్న కేంద్ర గనుల మంత్రిత్వ శాఖ
प्रविष्टि तिथि:
14 JUL 2026 5:56PM by PIB Hyderabad
న్యూఢిల్లీలో జూలై 15, 2026న కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి, బొగ్గు, గనుల శాఖ సహాయమంత్రి శ్రీ సతీశ్ చంద్ర దూబేతో పాటు మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులు, ఇతర ప్రముఖులు కలిసి వ్యూహాత్మక, కీలక ఖనిజాల బ్లాకుల వేలం ఎనిమిదో విడతను ప్రారంభిస్తారు.
ఎనిమిదో విడత ద్వారా 9 రాష్ట్రాల్లో విస్తరించిన 20 కీలక, వ్యూహాత్మక ఖనిజ బ్లాకులను చేర్చారు. వీటిలో కొత్తగా గుర్తించిన 13 బ్లాకులు, రెండోసారి వేలం వేస్తున్న 7 బ్లాకులు ఉన్నాయి. మాలిబ్డినం, గ్రాఫైట్, గ్లకోనైట్, అరుదైన మృత్తికా మూలకాలు (ఆర్ఈఈ), వెనెడియం, గాలియం, టైటానియం, టంగ్స్టన్, పాస్పరైట్, పొటాష్, లిథియం, సిీసియం, రుబీడియం వంటివి ఈ ఖనిజాల జాబితాలో ఉన్నాయి. ఇవి స్వచ్ఛ ఇంధనం, అధునాతన తయారీ రంగం, ఎరువులు, రక్షణ, ఇతర వ్యూహాత్మక రంగాలకు కీలకమైనవి.
ఏడు విడతల్లో వేలం ప్రక్రియ విజయవంతంగా పూర్తవటంతో, వేలం కోసం చేపట్టిన 88 కీలక, వ్యూహాత్మక ఖనిజ బ్లాకుల్లో 56 బ్లాకులను గనుల మంత్రిత్వ శాఖ విజయవంతంగా విక్రయించింది. దీని ద్వారా విజయాల రేటు 63 శాతానికి పైగా నమోదైంది. వరుసగా జరిగిన వేలం రౌండ్లలో పరిశ్రమల నుంచి లభించిన బలమైన స్పందన.. ప్రభుత్వ పారదర్శక, పోటీతత్వ, మార్కెట్ ఆధారిత వేలం విధానంపై పెట్టుబడిదారుల్లో పెరుగుతున్న విశ్వాసాన్ని ప్రతిబింబిస్తోంది. ఆర్థిక వృద్ధి, సాంకేతిక పురోగతి, స్వచ్ఛ ఇందన పరివర్తనకు కీలక ఖనిజ వనరులను భద్రపరచుకోవటంలో భారతదేశ ప్రయత్నాలకు ఇది మరింత బలాన్ని చేకూరుస్తోంది.
వేలం విధానం ప్రారంభమైనప్పటి నుంచి 20205-26 ఆర్థిక సంవత్సరంలో రికార్డు స్థాయిలో 212 ఖనిజ బ్లాకులను విజయవంతంగా వేలం వేయటం ద్వారా ఖనిజ రంగం కీలక ఘట్టాన్ని నమోదు చేసింది. ఇందులో 22 కీలక, వ్యూహాత్మక ఖనిజ బ్లాకులు కూడా ఉన్నాయి. భారతదేశ ఆర్థిక వృద్ధి, సాంకేతిక పురోగతి, స్వచ్ఛ ఇంధన పరివర్తనకు అత్యంత అవసరమైన కీలక ఖనిజ వనరులను భద్రపరచటంలో ప్రభుత్వానికున్న నిబద్ధతను ఇది స్పష్టం చేస్తోంది.
వేలం ప్రక్రియను మరింత సులభతరం చేసేందుకు ప్రభుత్వం ఇటీవల ఖనిజాల (వేలం) నియమాలు-2026 సవరణలను ప్రకటించింది. ఈ సంస్కరణలు ముందస్తు మొత్తాన్ని చెల్లించే సమయ పరిమితిని మరింత సులభతరం చేశాయి. గనులను లీజుకివ్వటం, అన్వేషణ లైసెన్స్ ఒప్పందాల అమలులో మరింత సౌలభ్యాన్ని కల్పిస్తాయి. బిడ్డర్ల తప్పిదం కాకుండా ఇతర కారణాల వల్ల వేలం రద్దయితే... బిడ్ సెక్యూరిటీ, పర్ఫార్మెన్స్ సెక్యూరిటీ, ఇతర చెల్లింపులను సకాలంలో తిరిగి చెల్లించేందుకు ఇవి వీలు కల్పిస్తాయి. సులభతర వ్యాపార నిర్వహణ, పెట్టుబడిదారుల్లో విశ్వాసాన్ని పెంచటం, వేలం వేసిన ఖనిజ బ్లాకులను వేగంగా వినియోగంలోకి తీసుకురావటమే లక్ష్యంగా ఈ చర్యలను తీసుకున్నారు.
***
(रिलीज़ आईडी: 2284664)
आगंतुक पटल : 12