మత్స్య పరిశ్రమ, పశు పోషణ మరియు పాడి పరిశ్రమ మంత్రిత్వ శాఖ
అంతర్జాతీయ జలాల్లో సుస్థిర మత్స్య సంపద వినియోగానికి సంబంధించిన అధికారిక పత్రాన్ని, ఒడిశా డీప్ సీ ఫిషింగ్ మిషన్ పత్రాన్ని విడుదల చేయనున్న భారత ఉప రాష్ట్రపతి
మత్స్య సహకార సంఘాలు, ఎఫ్ఎఫ్పీఓల ద్వారా మత్స్య రంగానికి ప్రోత్సాహం
प्रविष्टि तिथि:
08 JUL 2026 7:50AM by PIB Hyderabad
భారత ప్రభుత్వ మత్స్య శాఖ ఆధ్వర్యంలో జూలై 9, 2026న ఒడిశాలోని భువనేశ్వర్లో అంతర్జాతీయ జలాల్లో స్థిరమైన మత్స్య సంపద వినియోగానికి సంబంధించిన అధికారిక పత్రాన్ని (ఎల్ఓఏ) విడుదల చేసేందుకు జాతీయ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అంతర్జాతీయ జలాల్లో స్థిరమైన మత్స్య సంపద వినియోగానికి సంబంధించిన అధికారిక పత్రాన్ని భారత గౌరవ ఉప రాష్ట్రపతి శ్రీ సీపీ రాధాకృష్ణన్ విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా ఒడిశా డీప్ సీ మిషన్ పత్రాన్ని కూడా ఉప రాష్ట్రపతి విడుదల చేస్తారు.
ఈ జాతీయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఒడిశా గవర్నర్ గౌరవ డాక్టర్ హరిబాబు కంభంపాటి, ఒడిశా ముఖ్యమంత్రి గౌరవ శ్రీ మోహన్ చరణ్ మాఝీ, కేంద్ర మత్స్య, పశు సంవర్ధక, పాడి పరిశ్రమ, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి గౌరవ శ్రీ రాజీవ్ రంజన్ సింగ్, కేంద్ర విద్యాశాఖ మంత్రి గౌరవ శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ ముఖ్య అతిథులుగా పాల్గొంటారు. వీరితో పాటు కేంద్ర మత్స్య, పశు సంవర్ధక, పాడి పరిశ్రమ, పంచాయతీ రాజ్ శాఖ సహాయమంత్రి ప్రొఫెసర్ ఎస్.పీ. సింగ్ బఘేల్, ఒడిశా ప్రభుత్వ మత్స్య, ఏఆర్డీ, ఎంఎస్ఎంఈ శాఖల సహాయమంత్రి (స్వతంత్ర బాధ్యత) శ్రీ గోకులానంద మల్లిక్, భువనేశ్వర్ ఎంపీ శ్రీమతి అపరాజిత సారంగి, కంధమాల్ ఎంపీ శ్రీ సుకాంత పాణిగ్రాహి, ఖుర్దా ఎమ్మెల్యే శ్రీ ప్రశాంత కుమార్ జగదేవ్ ఈ కార్యక్రమానికి హాజరవుతారు. ఈ వేడుకలో ఒడిశా ప్రభుత్వం, సంబంధిత కేంద్ర మంత్రిత్వ శాఖలు, ఇతర విభాగాల అధికారులతో పాటు, మహిళా మత్స్యకారులతో కలిసి సుమారు 1,000 మంది చేపలు సాగు చేసేవారు, మత్స్యకారులు పాల్గొంటారు.
వివిధ కార్యక్రమాల ద్వారా మత్స్య రంగం డిజిటలైజేషన్పై దృష్టి సారించటంతో పాటు మత్స్యకార రైతు ఉత్పత్తిదారుల సంఘాలు (ఎఫ్ఎఫ్పీఓ), మత్స్యకార సహకార సంఘాలను బలోపేతం చేయటానికి భారత ప్రభుత్వ మత్స్య శాఖ ప్రాధాన్యతనిస్తోంది.
నేషనల్ కో-ఆపరేటివ్ ఎక్స్పోర్ట్స్ లిమిటెడ్ (ఎన్సీఈఎల్)తో సహా మత్స్యకార సహకార సంఘాలకు, ఫిషింగ్ నౌకల యజమానులకు ఎల్ఓఏను ఉప రాష్ట్రపతి అందిస్తారు. భారతదేశానికి చెందిన అర్హత గల ఫిషింగ్ నౌకలకు అంతర్జాతీయ జలాల్లో నియంత్రిత చేపల వేటకు ఇది వీలు కల్పిస్తుంది. శ్రీ మహావీర్ మచ్చిమార్ సహకారి మండలి లిమిటెడ్, శ్రీ మార్తాండ ప్రసన్న కొలాబా మత్స్యోద్యోగ వివిధ కార్యకారి సహకారి సంస్థ మర్యాదిత్, సౌత్ గోవా మెకనైజ్డ్ బోట్ ఓనర్స్ కో-ఆపరేటివ్, మార్కెటింగ్ సొసైటీ లిమిటెడ్, పారాదీప్ మెరైన్ ప్రైమరీ ఫిష్ ప్రొడక్షన్, మార్కెటింగ్ కో-ఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్, తెంగపట్టణం డీప్ సీ ఫిష్ ప్రొడ్యూసర్స్ కో-ఆపరేటివ్ సొసైటీ, మాల్పే ఫిషర్ మెన్స్ ప్రైమరీ కో-ఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ వంటి మత్స్యకార సహకార సంఘాలు అవార్డులు అందుకోనున్నాయి. ఈ సంఘాలకు ఎల్ఓఏను అందిస్తారు.
భారతదేశ మత్సకార నౌకల ద్వారా అంతర్జాతీయ జలాల్లో స్థిరమైన మత్స్య సంపద వినియోగానికి సంబంధించిన మార్గదర్శకాలు-2025 ప్రకారం అధికారిక పత్రాన్ని (ఎల్ఓఏ) పొందటం తప్పనిసరి నిబంధన. అంతర్జాతీయ జలాల్లో వేట, చేపల వేటకు సంబంధించి కార్యకలాపాల్లో పాల్గొనే భారత ఫిషింగ్ నౌకల కోసం పారదర్శకమైన, బాధ్యతాయుతమైన వ్యవస్థగా దీన్ని రూపొందించారు. నిర్దిష్ట నౌకకు మాత్రమే ఎల్ఓఏ వర్తిస్తుంది. వేరొకరికి బదిలీ చేసేందుకు వీలుండదు. ఇది రియల్క్రాఫ్ట్ మత్స్యకార నౌకల నమోదు పోర్టల్తో అనుసంధానమై ఉంటుంది. క్రమబద్ధమైన, గుర్తించదగిన, పర్యవేక్షించగలిగే కార్యకలాపాలను ఇది చూసుకుంటుంది. కనీస ఖర్చుతో ఎలాంటి కఠినమైన నిబంధనలు లేకుండా, ఎప్పటికప్పుడు అప్లికేషన్ ట్రాకింగ్ సదుపాయంతో అందుబాటులో ఉండే ఈ ఎల్ఓఏ.. మత్స్యకారులకు, పడవల నిర్వాహకులకు నిబంధనలను సులువుగా పాటించేందుకు సహాయపడుతుంది. ఎల్ఓఏ పొందిన నౌకలు సంబంధిత ప్రాంతీయ మత్స్య నిర్వహణ సంస్థలు (ఆర్ఎఫ్ఎంఓలు) సూచించిన రక్షణ, నిర్వహణ చర్యలను తప్పనిసరిగా పాటించాలి. ఇందులో భాగంగా చేపల వేట పరిమితులు, వేట పరికరాల నిబంధనలు, ఇతర జీవుల మరణాల తగ్గింపు చర్యలు, ఫిష్ అగ్రిగేటింగ్ డివైజ్ (ఎఫ్ఏడీ) నిర్వహణ, ప్రయాణ నివేదికలు, బాధ్యతాయుతమైన, స్థిరమైన చేపల వేట కోసం అవసరమైన ఇతర నిబంధనలను పాటించాల్సి ఉంటుంది.
లోతైన, అంతర్జాతీయ సముద్ర జలాల్లో స్థిరమైన పద్ధతుల్లో చేపల వేట సాగించేందుకు మత్స్యకార రైతు ఉత్పత్తిదారుల సంఘాలు (ఎఫ్ఎఫ్పీఓ), మత్స్యకార సహకార సంఘాలను ఎల్ఓఏ మరింత బలోపేతం చేస్తుంది. దీని వల్ల అధిక విలువ గల సముద్ర వనరులు లభించి, మత్స్యకారుల ఆదాయం పెరుగుతుంది. ఎల్ఓఏ ప్రక్రియ ఆన్లైన్ ద్వారా జరుగుతుంది. ఈ ప్రక్రియ పారదర్శకంగా, నిర్ణీత సమయానికి పూర్తవుతుంది. తద్వారా మత్స్య రంగంలో సేవలందించటం సులువవుతుంది. పారదర్శకత, చేపల నాణ్యతను గుర్తించటం, సుపరిపాలన మెరుగవుతాయి.
ఒడిశా ప్రభుత్వం చేపట్టిన ప్రతిష్టాత్మక బ్లూ ఎకానమీ కార్యక్రమమే ఒడిశా డీప్ సీ ఫిషింగ్ మిషన్ (2026–2036). రాష్ట్రంలోని తీరప్రాంత, లోతైన సముద్ర మత్స్య సంపద సామర్థ్యాన్ని వెలికితీయటానికి, ఒడిశాను లోతైన సముద్ర చేపల వేట, సముద్ర ఉత్పత్తుల ఎగుమతులకు ప్రముఖ కేంద్రంగా మార్చటమే ఈ మిషన్ ఉద్దేశం. ఆధునిక మత్స్య పరిశ్రమ మౌలిక సదుపాయాలు, విలువ ఆధారిత వ్యవస్థలు, శాస్త్రీయ మత్స్య నిర్వహణ, మార్కెట్ అనుసంధానాల్లో పెట్టుబడుల ద్వారా చేపల ఉత్పత్తిని పెంచేందుకు, ఉపాధి అవకాశాలను కల్పించేందుకు, మత్స్యకారుల ఆదాయాన్ని పెంపొందించేందుకు, సముద్ర మత్స్య రంగంలో స్థిరమైన వృద్ధిని సాధించేందుకు ఈ మిషన్ సహకరిస్తుంది.
భారత ఫిషింగ్ నౌకలు భారతదేశ ఈఈజడ్ పరిధికి అవతల ఉన్న ప్రాంతాల్లో చేపల వేటను సాగించేందుకు వీలుగా... క్రమబద్ధమైన, పారదర్శకమైన, స్థిరమైన వ్యవస్థకు ఈ అధికారిక పత్రం (ఎల్ఓఏ), ఒడిశా డీప్ సీ ఫిషింగ్ మిషన్ డాక్యుమెంట్ కీలకంగా నిలుస్తాయి. ఇది అంతర్జాతీయ సముద్ర జలాల్లో స్థిరమైన, బాధ్యతాయుతమైన మత్స్య సంపద సేకరణ దిశగా భారతదేశ ఫిషింగ్ నౌకలకు సాధికారత చేకూరుస్తుంది. అంతర్జాతీయ సముద్ర జలాల్లో మత్స్య వనరులను బాధ్యతాయుతంగా వినియోగించుకోవటం, మత్స్యకారుల జీవనోపాధిని బలోపేతం చేయటం, సముద్ర ఆహార ఎగుమతులను పెంచటం, ప్రపంచ సుస్థిర ప్రమాణాలకు కట్టుబడి ఉండటం, సంపన్నమైన, సమ్మిళిత బ్లూ ఎకానమీ.. జాతీయ దార్శనికతను ముందుకు తీసుకెళ్లటం పట్ల భారతదేశానికున్న నిబద్ధతకు ఇది నిదర్శనం.
నేపథ్యం
భారతదేశానికి సుమారు 11,099 కిలోమీటర్ల పొడవైన తీరప్రాంతం, దాదాపు 24 లక్షల చదరపు కిలోమీటర్ల ప్రత్యేక ఆర్థిక మండలిలో విస్తారమైన, విభిన్నమైన సముద్ర వనరులున్నాయి. భారతదేశపు ఈఈజడ్ పరిధిలోని సముద్ర మత్స్య సంపద సామర్థ్యం 58.6 లక్షల ఎంటీ ఉన్నట్లు అంచనా. ఇది సుమారు 50 లక్షల మంది మత్స్యకారుల జీవనోపాధికి మద్దతివ్వటమే కాకుండా.. ఆహార భద్రత, పోషకాహారం, ఉపాధి, ఆదాయం, ఎగుమతి రాబడికి దోహదపడుతుంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చేపల వేట, అక్వాకల్చర్ రంగాల్లో భారత్ అగ్రగామిగా ఉంది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో దేశం నుంచి సుమారు రూ.73,890 కోట్ల విలువైన సముద్ర ఆహార ఉత్పత్తుల ఎగుమతి జరిగింది.
చాలా మత్స్యకార కార్యకలాపాలు తీరానికి 40-50 నాటికల్ మైళ్ల పరిధిలోనే జరుగుతాయి. అయితే లోతైన జలాలు, దేశ సరిహద్దులకు అవతల ఉన్న ప్రాంతాల్లో ట్యూనా వంటి అధిక విలువ గల చేపల వనరుల వేటకు ఎక్కువగా అవకాశాలున్నాయి. స్థిరమైన సముద్ర మత్స్య పరిశ్రమ వ్యూహాత్మక ప్రాముఖ్యతను గుర్తిస్తూ... భారత ఈఈజడ్, అంతర్జాతీయ జలాల నుంచి మత్స్య సంపదను స్థిరంగా వినియోగించుకునేందుకు అనువైన మార్గదర్శక నిబంధనలను భారత ప్రభుత్వం విడుదల చేసింది. ఇందులో భారత మత్స్యకార నౌకల ద్వారా అంతర్జాతీయ జలాల్లో మత్స్య సంపదను స్థిరంగా వినియోగించుకునేందుకు సంబంధించిన మార్గదర్శకాలు-2025 కూడా ఉన్నాయి.
భారతదేశ ఈఈజడ్, అంతర్జాతీయ జలాల నుంచి మత్స్య సంపదను పర్యావరణహితంగా, స్థిరంగా వినియోగించుకునేందుకు అనుకూలమైన విధానాన్ని తీసుకురానున్నట్లు 2025-26 కేంద్ర బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. వ్యూహాత్మకంగా ఎంతో ప్రాధాన్యత గల సుస్థిర సముద్ర మత్స్య రంగాన్ని గుర్తించి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా భారతదేశ మొత్తం ఈఈజడ్ విస్తీర్ణంలో దాదాపు 49 శాతం వాటా ఉన్న అండమాన్, నికోబార్ దీవులు, లక్షద్వీప్ వంటి ద్వీప భూభాగాలపై ప్రత్యేక దృష్టి సారిస్తారు. సముద్ర మత్స్య రంగంలో ఇప్పటివరకు వినియోగించుకోని అపారమైన అవకాశాలను వెలికితీయటంతో పాటు... స్థిరత్వం, సమానత్వం, జాతీయ సముద్ర ప్రయోజనాలు, మత్స్యకార వర్గాల దీర్ఘకాలిక జీవనోపాధి భద్రతను కాపాడేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఈ ప్రకటన తెలియజేస్తోంది.
ఈ లక్ష్య సాధనలో భాగంగా డిసెంబర్ 9, 2025న భారత మత్స్యకార నౌకల ద్వారా అంతర్జాతీయ జలాల్లో స్థిరమైన మత్స్య సంపద వినియోగానికి సంబంధించిన మార్గదర్శకాలు-2025 విడుదలయ్యాయి. భారతదేశ ఈఈజెడ్ పరిధికి అవతల ఉన్న అంతర్జాతీయ జలాల్లో భారత మత్స్యకార నౌకల ద్వారా అధికారిక, నియంత్రిత, బాధ్యతాయుతమైన మత్స్యకార కార్యకలాపాలను ప్రోత్సహించేందుకు విధానపరమైన చర్యల్లో ఈ నూతన మార్గదర్శకాలు కీలకంగా నిలుస్తాయి. జాతీయ చట్టాలు, అంతర్జాతీయ బాధ్యతలు, పరిరక్షణ నియమాలను పూర్తిగా పాటిస్తూనే.. జాతీయ అధికార పరిధికి అవతల ఉన్న ప్రాంతాల్లో అధిక-విలువైన సముద్ర మత్స్య సంపద రంగంలో భారత్ భాగస్వామ్యం వైపు సాగుతున్న ప్రయాణంలో ఈ విధాన రూపకల్పన కీలక ముందడుగుని సూచిస్తుంది.
***
(रिलीज़ आईडी: 2282413)
आगंतुक पटल : 7