బొగ్గు గ్యాసిఫికేషన్పై దృష్టి సారిస్తూ స్వచ్ఛ బొగ్గు సాంకేతికతలపై బ్రిక్స్ అనుబంధ కార్యక్రమాన్ని కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఉన్నతాధికారులు, ప్రభుత్వ రంగ సంస్థల ప్రతినిధులు, పరిశ్రమల ప్రముఖులు, సాంకేతిక నిపుణులతో పాటు రష్యా, ఇథియోపియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) దేశాల బ్రిక్స్ ప్రతినిధులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి శ్రీ సనోజ్ కుమార్ ఝా ప్రసంగిస్తూ.. భారతదేశ ఇంధన భద్రతను బలోపేతం చేయటంలో, పారిశ్రామిక అభివృద్ధికి ఊతమివ్వటంలో బొగ్గు గ్యాసిఫికేషన్ కీలక పాత్ర పోషిస్తుందని స్పష్టం చేశారు. కోల్ గ్యాసిఫికేషన్ ద్వారా బొగ్గును సిన్ గ్యాస్గా మార్చవచ్చని.. దీని ద్వారా అమ్మోనియా, మిథనాల్, హైడ్రోజన్, సింథటిక్ ఇంధనాలు, డీఆర్ఐ, ఇతర విలువైన ఉత్పత్తులను తయారు చేయవచ్చని తెలిపారు. ఈ సాంకేతికత దేశీయ బొగ్గు వనరులను సమర్థవంతంగా వినియోగించుకోవటానికి తోడ్పడమే కాక, దిగుమతుల కోసం ఇతర దేశాలపై ఆధారపడటాన్ని తగ్గిస్తుందని ఆయన స్పష్టం చేశారు.
విధానపరమైన మద్దతు, ఆర్థిక ప్రోత్సాహకాలు, ఖచ్చితమైన బొగ్గు సరఫరా వ్యవస్థలు, వివిధ మంత్రిత్వ శాఖల సమన్వయ ప్రయత్నాల ద్వారా 2030 నాటికి 100 మిలియన్ టన్నుల బొగ్గు గ్యాసిఫికేషన్ చేపట్టటమే భారత ప్రభుత్వ లక్ష్యమని శ్రీ సనోజ్ కుమార్ ఝా వెల్లడించారు. ప్రస్తుతం కొనసాగుతున్న వివిధ కోల్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్టుల పురోగతిని వివరించారు. స్వచ్ఛ బొగ్గు సాంకేతికతలను మరింత ముందుకు తీసుకెళ్లటంలో బ్రిక్స్ దేశాల మధ్య సహకారం అవసరమని స్పష్టం చేశారు.
ఈ కార్యశాల సందర్భంగా కోల్ గ్యాసిఫికేషన్ సాంకేతికతపై బీహెచ్ఈఎల్.. కోల్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్టులు, ఈ సాంకేతికత బ్రిక్స్ దేశాలకు ఎంత ముఖ్యమో తెలిపేలా జిందాల్ స్టీల్ (జేఎస్ఎల్), గ్రేటా ఎనర్జీ సంస్థలు ప్రజెంటేషన్ ఇచ్చాయి. కస్తా అండర్గ్రౌండ్ కోల్ గ్యాసిఫికేషన్ (యూసీజీ) ప్రాజెక్టు గురించి ఈస్టర్న్ కోల్ఫీల్డ్స్ లిమిటెడ్ (ఈసీఎల్) వివరించింది. యూసీజీకి సంబంధించి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, బొగ్గు గనుల కేటాయింపుల గురించి నామినేటెడ్ అథారిటీ తెలిపింది. కోల్ ఇండియా లిమిటెడ్ (సీఐఎల్) అందిస్తున్న బొగ్గు సరఫరా సదుపాయాలను, ఆ సంస్థ చేపట్టనున్న నూతన ప్రాజెక్టుల వివరాలను తెలియజేసింది.
కోల్ గ్యాసిఫికేషన్కు సంబంధించి వివిధ అంశాలపై చర్చా కార్యక్రమం జరిగింది. ఇందులో భాగంగా సాంకేతికత, ప్రాజెక్టుల ఆర్థిక వివరాలు, భౌగోళికంగానే కాక, గ్యాసిఫికేషన్ ప్రక్రియలోని సవాళ్లు, భారతదేశంలోని బొగ్గులో ఉండే అధిక శాతం ఫ్లైయాష్ను వినియోగించుకోవటం, సాంకేతికతను విస్తృతంగా అందుబాటులోకి తీసుకువచ్చేందుకు అవసరమైన ప్రభుత్వ విధానాలు, ఆర్థిక సహాయం వంటి పలు కీలక అంశాలపై చర్చించారు.
***