ఉక్కు మంత్రిత్వ శాఖ
ఐఎన్ఎస్ దూనగిరి, అగ్రే, సంశోధక్ నౌకల కోసం రక్షణ రంగ స్థాయి ఉక్కు సరఫరా చేసిన సెయిల్
प्रविष्टि तिथि:
24 JUN 2026 7:02PM by PIB Hyderabad
దేశ నౌకాదళ సామర్థ్యాలను బలోపేతం చేయడంలో ఉక్కు మంత్రిత్వ శాఖ పరిధిలోని మహారత్న హోదా ఉన్న కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన 'సెయిల్ (స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్)' మరోసారి కీలక పాత్ర పోషించింది. భారత నౌకాదళంలోకి ఇటీవల చేరిన మూడు అత్యాధునిక నౌకలైన అడ్వాన్స్డ్ స్టెల్త్ ఫ్రిగేట్ 'ఐఎన్ఎస్ దూనగిరి', తక్కువ లోతు జలాల్లో పనిచేసే జలాంతర్గామి నిరోధక నౌక 'ఐఎన్ఎస్ అగ్రే', భారీ సర్వే నౌక 'ఐఎన్ఎస్ సంశోధక్'ల కోసం మొత్తంగా 5,700 టన్నుల ప్రత్యేక ఉక్కును సెయిల్ సరఫరా చేసింది. కోల్కతాలోని శ్యామా ప్రసాద్ ముఖర్జీ పోర్టులో జరిగిన చారిత్రాత్మక కార్యక్రమంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2026 జూన్ 21న ఈ మూడు అత్యాధునిక నౌకలను అధికారికంగా భారత నౌకాదళంలోకి ప్రవేశపెట్టారు.
సెయిల్ సరఫరా చేసిన ఉక్కులో ప్రత్యేక నాణ్యత కలిగిన 'డీఎంఆర్ 249ఏ' తరహా వేడితో తయారు చేసిన ఉక్కు రేకు, ప్లేట్లు ఉన్నాయి. రక్షణ రంగానికి ఉపయోగించే ఈ ప్రత్యేకమైన ఉక్కును సెయిల్ పరిధిలోని ప్రతిష్ఠాత్మక బొకారో, భిలాయ్, రూర్కెలా ఉక్కు కర్మాగారాలు అత్యంత నిశిత పర్యవేక్షణతో తయారు చేసి సరఫరా చేశాయి. ఇది భారత దేశ సముద్ర రక్షణ మౌలిక సదుపాయాలకు మద్దతుగా నిలవడంలో ఈ మహారత్న సంస్థకు ఉన్న పటిష్ఠమైన సాంకేతిక సామర్థ్యాన్ని తెలియజేస్తోంది.
దేశంలో ఆత్మనిర్భర్ భారత్, భారత్లో తయారీ ఉద్యమాలకు సెయిల్ నిరంతరం ఊతమిస్తోంది. కీలకమైన నౌకాదళ వేదికల కోసం ప్రత్యేకమైన ఉక్కును ఉత్పత్తి చేయడం ద్వారా భారత రక్షణ రంగ స్వదేశీకరణలో సెయిల్ ఒక అనివార్యమైన భాగస్వామిగా మారింది. రక్షణ రంగంలో పెరుగుతున్న అవసరాలను తీర్చడం కోసం సెయిల్ ముందస్తుగానే అదనపు చర్యలు చేపట్టింది. ముఖ్యంగా రూర్కెలా ఉక్కు కర్మాగారంలోని 'స్పెషల్ ప్లేట్ కేంద్రం'లో రక్షణ అవసరాలకు సరిపడే 'డీఎంఆర్ గ్రేడ్' ప్లేట్ల ఉత్పత్తిని గణనీయంగా పెంచింది. ఈ వ్యూహాత్మక చర్య.. రక్షణ రంగ ఉక్కు విభాగంలో భారత్ దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించుకుంటూ స్వయంసమృద్ధి సాధిస్తోందనడానికి స్పష్టమైన నిదర్శనంగా నిలిచింది. దేశ చరిత్రలో నిలిచిపోయే స్వదేశీ విమాన వాహక నౌక 'ఐఎన్ఎస్ విక్రాంత్'తో పాటు ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్ ‘17ఏ’కు చెందిన స్టెల్త్ నౌకలైన ‘ఎన్ఎస్ నీలగిరి, ఐఎన్ఎస్ హిమగిరి, ఐఎన్ఎస్ ఉదయగిరి’లకు ఉక్కును అందించిన అద్భుతమైన చరిత్ర సెయిల్కు ఉంది. ఐఎన్ఎస్ అజయ్, ఐఎన్ఎస్ నిస్తార్, ఐఎన్ఎస్ అంజదీప్ వంటి మరెన్నో శక్తిమంతమైన నౌకల నిర్మాణానికి సెయిల్ అందించిన ప్రత్యేక ఉక్కు ఒక బలమైన వెన్నెముకగా నిలిచింది. ఈ అత్యాధునిక యుద్ధనౌకలను విజయవంతంగా నావికాదళంలోకి ప్రవేశపెట్టడం.. భారత సముద్ర రక్షణ సామర్థ్యం, సార్వభౌమాధికారంలో ఒక చారిత్రాత్మక మైలురాయిగా నిలుస్తుంది.
సెయిల్ చైర్మన్ - కార్యనిర్వాహక డైరెక్టర్ (సీఎండీ) డాక్టర్ అశోక్ కుమార్ పాండా మాట్లాడుతూ.. “భారత రక్షణ రంగంలో ఒక కీలక భాగస్వామిగా జాతీయ స్వయంసమృద్ధికి సెయిల్ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుంది. రక్షణ రంగంలో పెరుగుతున్న అవసరాల కంటే ఒక అడుగు ముందే ఉండటానికి సంస్థ తన 'డీఎంఆర్ గ్రేడ్' ప్లేట్ల ఉత్పాదక సామర్థ్యాన్ని పెంచింది. ముఖ్యంగా రూర్కెలా ఉక్కు కర్మాగారంలోని 'స్పెషల్ ప్లేట్ ప్లాంట్'పై ప్రత్యేక దృష్టి సారించింది. అత్యంత పటిష్ఠమైన ఈ 'డీఎంఆర్ 249ఏ' ఉక్కు ప్లేట్లను సరఫరా చేయడం భారత వ్యూహాత్మక స్వతంత్రతను కాపాడటంతో పాటు సెయిల్ అత్యాధునిక సాంకేతిక నైపుణ్యాన్ని స్పష్టంగా చాటిచెబుతోంది” అని పేర్కొన్నారు.
***
(रिलीज़ आईडी: 2277674)
आगंतुक पटल : 2