శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
కీలక ఖనిజ రంగంలో భారత్-కెనడా సహకారం దిశగా సీఎస్ఐఆర్-ఐఎమ్ఎమ్టీని సందర్శించిన కెనడా హై కమిషనరు
నాడు పోస్టు చేయడమైనది:
07 MAY 2026 6:05PM by PIB Hyderabad
భారతదేశంలోని సీఎస్ఐఆర్-మినరల్స్, మెటల్స్ టెక్నాలజీ ఇనిస్టిట్యూట్ (సీఎస్ఐఆర్-ఐఎమ్ఎమ్టీ)ని కెనడా హై కమిషనరు శ్రీ క్రిస్ కూటర్ సందర్శించారు. ఈ పర్యటనలో ఆయన వెంట ఆయన భార్య కరేన్ జోన్ బ్లుమెన్శైన్, కెనడా హై కమిషన్కు చెందిన వాణిజ్య కమిషనరు శ్రీ అర్జున్ కుమార్ దత్తా, రాజకీయ, ఆర్థిక, ప్రజా వ్యవహారాల అధికారి శ్రీ రోహిత్ శుక్లా ఉన్నారు.
కీలక ఖనిజాలు, వనరుల ప్రాసెసింగ్, ఆధునిక లోహ శోధన శాస్త్ర సాంకేతికతల రంగంలో శాస్త్ర సాంకేతిక సహకారానికి గల అవకాశాలపై సీఎస్ఐఆర్-ఐఎమ్ఎమ్టీ డైరెక్టరు డాక్టర్ రామానుజ్ నారాయణ్తోనూ, సీనియర్ శాస్త్రవేత్తలు, పరిశోధకులతోనూ కెనడా ప్రతినిధివర్గం చర్చించింది. సీఎస్ఐఆర్-ఐఎమ్ఎమ్టీ అమలుచేస్తున్న అంతర్జాతీయ కార్యక్రమాలను క్రమంగా విస్తరిస్తున్నట్లు డాక్టర్ నారాయణ్ వివరించారు. ఈ కార్యక్రమాల్లో సహకారపూర్వక పరిశోధన, విద్యాసంబంధ ఆదాన ప్రదానాల కోసం సస్కెచెవాన్ విశ్వవిద్యాలయంతో సంయుక్త ఆసక్తి ప్రకటన పత్రాన్ని (జేడీఐ) కుదుర్చుకోవడం కూడా ఒకటని ఆయన తెలిపారు. కీలక ఖనిజాలకు సంబంధించి ప్రస్తుతం జరుగుతున్న పరిశోధన, సాంకేతిక అభివృద్ధి, మానవ సామర్థ్యాల పెంపుదల వంటి కార్యకలాపాలను సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ క్రిటికల్ మినరల్స్ ప్రధానాధికారి డాక్టర్ కాళీ సంజయ్ ప్రతినిధి వర్గం దృష్టికి తీసుకువచ్చారు. సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ క్రిటికల్ మినరల్స్ను కేంద్ర ప్రభుత్వ గనుల శాఖ ఆధ్వర్యంలో సీఎస్ఐఆర్-ఐఎమ్ఎమ్టీలో ఏర్పాటు చేశారు.
స్వచ్ఛ ఇంధన సాంకేతికతలు, విద్యుత్తుతో నడిచే వాహనాలు, రైళ్లు, అడ్వాన్స్డ్ మాన్యుఫాక్చరింగ్, వ్యూహాత్మక పరిశ్రమలకు ఎంతో అవసరమైన ఖనిజాలకు ప్రపంచవ్యాప్తంగా గిరాకీ పెరుగుతున్న కారణంగా కీలక ఖనిజాల రంగంలో భారత్, కెనడా వ్యూహాత్మక భాగస్వామ్య దేశాలుగా ఎదుగుతున్నాయి. కెనడా దగ్గర కీలక ఖనిజాల నిక్షేపాలు తగినంత స్థాయిలో ఉన్నాయి. గనుల తవ్వకం రంగంలో ఆధునిక పద్ధతుల్ని కెనడా అనుసరిస్తోంది. భారత్ ఖనిజాల ప్రాసెసింగ్, డౌన్స్ట్రీమ్ టెక్నాలజీలతో పాటు తయారీ రంగాల్లో సామర్థ్యాన్ని పెంచుకొనేందుకు తగిన మెలకువలను అందించగల స్థితిలో ఉంది. భారత్, కెనడా మధ్య పటిష్ఠ సహకారం వివిధ కీలక ఖనిజాల సరఫరా వ్యవస్థలకు సుదృఢ సహకారాన్ని అందించడం, సాంకేతికపరమైన నూతన ఆవిష్కరణల్ని ప్రోత్సహించడం, పరిశోధన భాగస్వామ్యాల్ని బలోపేతం చేయడంతో పాటు, ఇంధన పరివర్తన దిశగా ప్రయత్నాలు చేస్తున్న ప్రపంచ దేశాలకు ప్రధాన తోడ్పాటునూ అందించగలదని భావిస్తున్నారు.
కెనడా ప్రతినిధివర్గం పర్యటనలో భాగంగా సీఎస్ఐఆర్-ఐఎమ్ఎమ్టీలో అనేక ఉన్నత స్థాయి పరిశోధన కేంద్రాల్ని పరిశీలించింది. ప్రతినిధి వర్గం పరిశీలించిన కేంద్రాల్లో ప్లాటినమ్ గ్రూప్ ఎలిమెంట్స్ (పీజీఈ) పైలట్ ప్లాంటు, రీసైక్లింగ్ పైలట్ ప్లాంటు, సీబెడ్ మినరల్స్ పైలట్ ప్లాంటుతో పాటు మోల్టెన్ సాల్ట్ ఎలక్ట్రోలైసిస్ పైలట్ ప్లాంటు కూడా ఉంది.
ఈ ముఖాముఖి చర్చల్లో నూతన ఆవిష్కరణ, స్థిరత్వం, జ్ఞానాన్ని ఇచ్చి పుచ్చుకోవడం వంటి పద్ధతుల్లో ఖనిజాల రంగంలో ఎదురుకాగల సవాళ్లను పరిష్కరించడానికి భారత్, కెనడా మధ్య లోతైన శాస్త్రీయ, సాంకేతిక సహకారానికి ఉన్న ప్రాధాన్యాన్ని గుర్తించారు. పరిశోధన కార్యక్రమాల సంయుక్త నిర్వహణ, సామర్థ్యాల పెంపుదల, సాంకేతిక శిక్షణ, సాంకేతికత బదలాయింపులకు సంబంధించిన అవకాశాలపై కూడా చర్చించారు.
సుస్థిర ప్రాతిపదిక కలిగిన అభివృద్ధి, దీర్ఘకాల శాస్త్రీయ సహకారం అంశాల్లో ఇరు దేశాల ఉమ్మడి నిబద్ధతకు ఈ పర్యటన ఒక ప్రతీకగా నిలిచింది. సీఎస్ఐఆర్-ఐఎమ్ఎమ్టీ పరిసరాల్లో మొక్కలను నాటే కార్యక్రమంతో ప్రస్తుత కార్యక్రమం ముగిసింది.
***
(రిలీజ్ ఐడి: 2258962)
సందర్శకుల సూచీ సంఖ్య : : 9