శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
భారత ఆర్థిక వ్యవస్థ పునరుజ్జీవానికి సాంకేతిక ఆధారిత ఆవిష్కరణలే కీలకం: కేంద్రమంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్
దశాబ్ద కాలంగా దేశ శాస్త్ర వ్యవస్థలో విప్లవాత్మక మార్పులొచ్చాయన్న డాక్టర్ జితేంద్ర సింగ్
శాస్త్ర, సాంకేతిక వ్యవస్థలో నూతన అవకాశాలను కల్పిస్తున్న ప్రైవేటు భాగస్వామ్యం: డాక్టర్ జితేంద్ర సింగ్
శాస్త్రీయ పురోగతికి ప్రభుత్వం, విద్యా సంస్థలు, పరిశ్రమల సహకారం కీలకం: డాక్టర్ జితేంద్ర సింగ్
నాడు పోస్టు చేయడమైనది:
04 MAY 2026 5:00PM by PIB Hyderabad
దశాబ్ద కాలంగా శాస్త్ర, సాంకేతిక విభాగం (డీఎస్ టీ) ప్రోత్సహించిన సాంకేతిక ఆధారిత ఆవిష్కరణలే భారతదేశ ఆర్థిక పునరుజ్జీవనానికి కీలకమని... పరిశోధనల నుంచి పరిశ్రమలు, అంకుర సంస్థలు, జాతీయ వృద్ధి వరకు వీటి సహకారం విస్తరిస్తోందని కేంద్ర శాస్త్ర, సాంకేతిక, భూ విజ్ఞాన శాస్త్ర శాఖ సహాయమంత్రి (స్వతంత్ర బాధ్యత), పీఎంఓ, సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్లు, అణుశక్తి, అంతరిక్ష శాఖల సహాయమంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు.
పరిశోధనలు కేవలం ప్రయోగశాలలకే పరిమితం కాకుండా ఆర్థిక వృద్ధికి తోడ్పడాలన్న నూతన విధానాన్ని ప్రస్తావిస్తూ... సైన్స్ ఇకపై "ప్రయోగశాల నుంచి మార్కెట్ వరకు, ఆలోచన నుంచి ఆచరణాత్మక స్థాయి వరకు" సాగాలని మంత్రి పిలుపునిచ్చారు.
న్యూఢిల్లీలోని ఇండియన్ నేషనల్ సైన్స్ అకాడమీ (ఐఎన్ఎస్ఏ) ఆడిటోరియంలో జరిగిన శాస్త్ర, సాంకేతిక విభాగం (డీఎస్ టీ) 56వ వ్యవస్థాపక దినోత్సవంలో డాక్టర్ జితేంద్ర సింగ్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి భారత ప్రభుత్వ ప్రధాన శాస్త్రీయ సలహాదారు ప్రొఫెసర్ అజయ్ కుమార్ సూద్, డీఎస్ టీ కార్యదర్శి ప్రొఫెసర్ అభయ్ కరాండికర్ తో పాటు ప్రముఖ శాస్త్రవేత్తలు, విద్యావేత్తలు, శాస్త్రీయ రంగ ప్రముఖులు హాజరయ్యారు.
దశాబ్ద కాలంలో భారత శాస్త్ర, సాంకేతిక రంగంలో విప్లవాత్మక మార్పులొచ్చాయని... అంతరిక్షం, అణుశక్తి వంటి కీలక రంగాల్లో ప్రైవేట్ భాగస్వామ్యాన్ని ప్రోత్సహిస్తూ ప్రభుత్వం తీసుకున్న విధానపరమైన నిర్ణయాలే ఇందుకు ప్రధాన కారణమని కేంద్రమంత్రి తెలిపారు. ఈ చర్యల ద్వారా అంకుర సంస్థలకు, పరిశ్రమలకు సరికొత్త అవకాశాలు లభించటం ద్వారా అపారమైన మానవ వనరులను భారత్ సమర్థవంతంగా వినియోగించుకుంటూ ప్రపంచ ఆవిష్కరణల వ్యవస్థలో స్థానాన్ని మరింత బలోపేతం చేసుకుంటోందని పేర్కొన్నారు.
అంతరిక్ష రంగంలో వేగవంతమైన విస్తృతిని డాక్టర్ జితేంద్ర సింగ్ ప్రస్తావించారు. ఈ రంగంలో ప్రైవేటు భాగస్వామ్యానికి అవకాశమిచ్చిన కొద్ది సంవత్సరాల్లోనే అంకుర సంస్థల ఆధారిత ఆవిష్కరణల్లో భారత్ వృద్ధిని సాధించిందని, ఉపగ్రహ సాంకేతికత వంటి రంగాల్లో నూతన సామర్థ్యాలు పుట్టుకొస్తున్నాయని చెబుతూ, ఇవి ఆర్థిక వృద్ధికి, జాతీయ సంసిద్ధతకు దోహదపడుతున్నాయని అన్నారు. అభివృద్ధి చెందుతున్న సాంకేతిక రంగాల్లోనూ ఈ వేగం కొనసాగుతోందని ఆయన తెలిపారు.
పరిశ్రమలు, ప్రైవేట్ రంగంతో సంబంధం లేకుండా ఏ దేశమూ సైన్స్ రంగంలో పురోగతి సాధించలేదని... ప్రభుత్వం, విద్యా సంస్థలు, పరిశ్రమల మధ్య లోతైన సహకారం అవసరమని కేంద్రమంత్రి అన్నారు. స్వదేశీ పరిశోధనల ప్రాముఖ్యతను స్పష్టం చేస్తూ ఫార్మాస్యూటికల్స్ వంటి కీలక రంగాలతో సహా వివిధ విభాగాల్లో భారత్ సొంత సాంకేతిక పరిజ్ఞానాన్ని మరింతగా అభివృద్ధి చేసుకుంటోందన్నారు.
అంతర్జాతీయంగా భారతదేశ శాస్త్రీయ స్థాయి గణనీయంగా బలపడిందని డాక్టర్ జితేంద్ర సింగ్ పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రాచుర్యం గల పరిశోధనా పత్రాలు పెరగటం భారత పరిశోధనల నాణ్యతను, ప్రభావాన్ని ప్రతిబింబిస్తోందన్నారు. పదేళ్ల కిందట కేవలం కొన్ని వందల సంఖ్యలో మాత్రమే ఉన్న అంకుర సంస్థలు.. నేడు రెండు లక్షలకు పైగా పెరిగాయి. ఇది మన దేశంలో వేగంగా వృద్ధి చెందుతున్న ఆవిష్కరణల రంగానికి నిదర్శనమని స్పష్టం చేశారు.
శాస్త్రీయ సంస్థలు విజయాలను క్రియాశీలంగా ప్రచారం చేయాలని, భాగస్వాములతో నిరంతరం సంప్రదింపులు జరపాలని మంత్రి స్పష్టం చేశరు. భాగస్వాములను ఆకర్షించేందుకు, సమాజంపై విస్తృత ప్రభావాన్ని చూపేందుకు ప్రాచుర్యం, ప్రచారం ఎంతో అవసరమన్నారు. ఆవిష్కర్తలను ప్రోత్సహించటంతో పాటు, యువ ప్రతిభావంతులకు స్పష్టత, వాస్తవికతతో దిశానిర్దేశం చేసే పారదర్శకమైన, ప్రతిభావంతమైన వ్యవస్థను ఏర్పాటు చేయటం ముఖ్యమని చెప్పారు.
ప్రస్తుత సాంకేతిక అవసరాలకనుగుణంగా సంస్థలను తీర్చిదిద్దటం, పనితీరును మెరుగుపరచటం లక్ష్యంగా సాగుతున్న పరిపాలనా సంస్కరణల గురించి ఆయన ప్రస్తావించారు. ఇందులో భాగంగా పాత వ్యవస్థల పునర్నిర్మాణం, నిర్ణయాధికారంలో మరింత వికేంద్రీకరణ వంటి అంశాలున్నాయన్నారు.
పరిశోధనలను సాంకేతిక అభివృద్ధి, వాణిజ్యీకరణతో అనుసంధానించాల్సిన అవసరముందని ప్రధాన శాస్త్రీయ సలహాదారు ప్రొఫెసర్ అజయ్ కుమార్ సూద్ అన్నారు. భారతదేశ శాస్త్ర, ఆవిష్కరణల వ్యవస్థను బలోపేతం చేయటానికి ప్రభుత్వం చేపట్టిన అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ (ఏఎన్ఆర్ఎఫ్), ఆర్ డీఐ ఫండ్, నేషనల్ క్వాంటం మిషన్ వంటి కీలక కార్యక్రమాలను కేంద్ర శాస్త్ర, సాంకేతిక విభాగం (డీఎస్ టీ) కార్యదర్శి ప్రొఫెసర్ అభయ్ కరాందీకర్ వివరించారు.
కొనసాగుతున్న సంస్కరణలు, పటిష్ఠమైన వ్యవస్థాగత నిర్మాణాలు, అన్ని వర్గాల భాగస్వామ్యంతో రాబోయే కాలంలో భారతదేశ ఆర్థిక వృద్ధిని, ప్రపంచ నాయకత్వాన్ని నిర్దేశించటంలో దేశీయ శాస్త్ర, సాంకేతిక రంగం నిర్ణయాత్మక పాత్ర పోషిస్తుందని డాక్టర్ జితేంద్ర సింగ్ ధీమా వ్యక్తం చేశారు.
***
(రిలీజ్ ఐడి: 2257934)
సందర్శకుల సూచీ సంఖ్య : : 5