భూ శా స్త్ర మంత్రిత్వ శాఖ
విశాఖపట్నంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయంలో తీరప్రాంత వాతావరణ
పరిశోధన ప్రయోగశాల (సీ - ఏఆర్టీ) బహిరంగ క్షేత్ర పరిశీలనా కేంద్రానికి ప్రారంభోత్సవం
నాడు పోస్టు చేయడమైనది:
01 MAY 2026 4:46PM by PIB Hyderabad
భారత ప్రభుత్వ భూ విజ్ఞాన మంత్రిత్వ శాఖ పరిధిలోని స్వయంప్రతిపత్తి సంస్థ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటియోరాలజీ (ఐఐటీఎం) విశాఖపట్నంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయంలో సముద్ర తీర వాతావరణ పరిశోధన ప్రయోగశాల (సీ- ఏఆర్టీ)ను ఏర్పాటు చేసింది. నిరంతర, సమగ్ర పరిశీలనలు, పరిశోధన భాగస్వామ్యాల కోసం ఆంధ్ర విశ్వవిద్యాలయం తన ప్రాంగణంలో బహిరంగ క్షేత్ర పరిశీలనా కేంద్రం స్థాపనకు భూమిని కేటాయించింది.
భూ విజ్ఞాన మంత్రిత్వ శాఖ కార్యదర్శి డాక్టర్ ఎం. రవిచంద్రన్ మే 1, 2026న విశ్వవిద్యాలయం వైస్-చాన్సలర్ ప్రొఫెసర్ జి.పి. రాజశేఖర్, ఐఐటిఎం డైరెక్టర్ డాక్టర్ సూర్యచంద్రరావు సమక్షంలో తీర ప్రాంత వాతావరణ పరిశోధన ప్రయోగశాల (సీ- ఏఆర్టీ) కు చెందిన బహిరంగ క్షేత్ర పరిశీలనా కేంద్రాన్ని ప్రారంభించారు. పరిశీలన వ్యవస్థను, నమూనా అంచనాలను మెరుగుపరిచే లక్ష్యంతో భూ విజ్ఞాన మంత్రిత్వ శాఖ చేపట్టిన 'మిషన్ మౌసమ్' లో ఇది ఒక ముఖ్యమైన మైలురాయి.
ముఖ్య అతిధి భూ విజ్ఞాన మంత్రిత్వ శాఖ కార్యదర్శి డాక్టర్ ఎం. రవిచంద్రన్, గౌరవ అతిధి ఆంధ్ర విశ్వవిద్యాలయం వైస్-చాన్సలర్ ప్రొఫెసర్ జి. పి. రాజశేఖర్, ఐఐటీఎం డైరెక్టర్ డాక్టర్ ఎ. సూర్యచంద్రరావు, ఆంధ్ర విశ్వవిద్యాలయం వాతావరణ, సముద్ర శాస్త్ర విభాగాల ఆధిపతి ప్రొఫెసర్ సి.వి. నాయుడు, ఆంధ్ర విశ్వవిద్యాలయం ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఎం వి.ఆర్ రాజు, ఐఐటీఎం ప్రాజెక్ట్ డైరెక్టర్ డాక్టర్ బి. పద్మ కుమారిలకు స్వాగతం పలకడంతో ఈ కార్యక్రమం మొదలైంది.
ఐఐటిఎం డైరెక్టర్ డాక్టర్ ఎ. సూర్యచంద్రరావు స్వాగత ఉపన్యాసం చేస్తూ ఐఐటిఎం పరిశోధనలు గురించి, తూర్పు తీరంలోని విశాఖపట్నంలో ఈ సముద్ర తీర వాతావరణ పరిశోధన ప్రయోగశాల ఏర్పాటు ప్రాముఖ్యతను గురించి వివరించారు. ఆంధ్ర విశ్వవిద్యాలయ వాతావరణ శాస్త్ర, సముద్ర శాస్త్ర విభాగంలో మొదటి దశలో అమర్చిన పరికరాలు, తీరప్రాంత వాతావరణ పరిశోధనలో భాగంగా రానున్న అత్యాధునిక రిమోట్ సెన్సింగ్, ప్రొఫైలింగ్, ఇన్-సిటు పరికరాల గురించి ఆయన తెలియజేశారు.
భూ విజ్ఞాన మంత్రిత్వ శాఖ కార్యదర్శి డాక్టర్ ఎం. రవిచంద్రన్, ఇతర ప్రముఖులు "సముద్ర తీర వాతావరణ పరిశోధన ప్రయోగశాల" సమాచార పత్రాన్ని విడుదల చేశారు. ఈ పత్రంలో పరిశోధన లక్ష్యాలు, అమలు వ్యూహం, సంస్థాగత భాగస్వామ్యం, అధునాతన వాతావరణ పరికరాలు, ప్రాంతీయ ప్రభావం వంటి అంశాలు ఉన్నాయి. విశాఖపట్నంలోని "సముద్ర తీర వాతావరణ పరిశోధన ప్రయోగశాల"పై రూపొందించిన ఒక లఘు చిత్రాన్ని కూడా ఆయన విడుదల చేశారు
ఆంధ్ర విశ్వవిద్యాలయ వైస్-చాన్సలర్ ప్రొఫెసర్ జి. పి. రాజశేఖర్ ప్రారంభోపన్యాసం చేశారు. విశాఖపట్నంలో ఈ పరిశోధన ప్రయోగశాల స్థాపనలో ఆంధ్ర విశ్వవిద్యాలయం, ఐఐటిఎం ఉమ్మడి కృషి ఎంతో కీలకమని ఆయన అన్నారు. ఐఐటిఎం, ఆంధ్ర విశ్వవిద్యాలయం మధ్య దీర్ఘకాలిక విజ్ఞాన భాగస్వామ్యాన్ని పెంపొందించడంలో ఈ సదుపాయం ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలుస్తుంది.
అన్ని వాతావరణ పరిస్థితులను, ముఖ్యంగా తీవ్రమైన వాతావరణ మార్పులను పర్యవేక్షించడానికి 'మిషన్ మౌసమ్' కింద ప్రస్తుత పరిశీలనా సామర్థ్యాన్ని (ప్రాంతీయ, కాలక్రమ పద్ధతులలో) మెరుగుపరచడానికి భూ విజ్ఞాన మంత్రిత్వ శాఖ ప్రణాళికలు, కార్యక్రమాలను కార్యదర్శి ఎం. రవిచంద్రన్ వివరించారు. దీనివల్ల వాతావరణ అంచనాలు మరింత కచ్చితంగా అందుతాయని ఆయన పేర్కొన్నారు. భూ విజ్ఞాన మంత్రిత్వ శాఖ సంస్థలు, రాష్ట్ర విశ్వవిద్యాలయాల మధ్య మరింత సహకారం అవసరాన్ని ఆయన ప్రముఖంగా తెలిపారు.
ఈ ప్రయోగశాల నుంచి మొదటి పరిశీలన ప్రారంభ సంకేతంగా భూ విజ్ఞాన మంత్రిత్వ శాఖ కార్యదర్శి, ఆంధ్ర విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్, ఐఐటిఎం డైరెక్టర్ కలిసి ఒక వాతావరణ బెలూన్ను ఆకాశంలోకి వదిలారు. ఈ ప్రాంగణంలో ఇంపాక్ట్ డిస్డ్రోమీటర్, 2-డైమెన్షనల్ వీడియో డిస్డ్రోమీటర్ (2డీవీడీ), 3డీ ప్రింటెడ్ ఆటోమేటిక్ వెదర్ స్టేషన్ (3 డీ- పీఏడబ్ల్యూఎస్), కన్వెన్షనల్ ఏడబ్ల్యూఎస్, ఎడ్డీ కోవేరియన్స్ టవర్ వంటి ఇతర పరికరాలను కూడా అమర్చారు. విశాఖపట్నంలో నేడు కురిసిన తొలి ఉరుములతో కూడిన జల్లుల వివరాలను ఈ పరికరాలు నమోదు చేశాయి. ఇలాంటి పరికరాలు వర్షపు బిందువుల పరిమాణాలు, ఆకారాలు సహా వాటి పంపిణీని అధిక రిజల్యూషన్లో పరిశీలించడానికి, వర్ష సూక్ష్మభౌతిక లక్షణాలు, టర్బ్యులెన్స్ ఫ్లక్స్లు, గాలి సమాచారాన్ని స్పష్టంగా సేకరించడానికి సహాయపడతాయి. ఇవి ప్రక్రియల అవగాహనను మెరుగుపరచడంలోనే కాకుండా, సంఖ్యాత్మక నమూనాల ద్వారా కచ్చితమైన అంచనాలు రూపొందించడానికి ఈ సమాచారం ఎంతో కీలకం.
ఈ ప్రయోగశాల కోసం భవిష్యత్తులో సమకూర్చబోయే స్కానింగ్ విండ్ లైడార్, పోలారిమెట్రిక్ క్లౌడ్ - ప్రెసిపిటేషన్ డాప్లర్ రాడార్లు, ఫేజ్ అరే రాడార్లు, ప్రోటాన్ ట్రాన్స్ఫర్ రియాక్షన్ మాస్ స్పెక్ట్రోమీటర్ వంటి పరికరాలు వాతావరణాన్ని మరింత మెరుగ్గా అర్థం చేసుకోవడానికే కాకుండా, ప్రకృతి వైపరీత్యాలను అత్యంత కచ్చితత్వంతో అంచనా వేయడానికి సహాయపడతాయి.
ఈ తీర ప్రాంత వాతావరణ పరిశోధన ప్రయోగశాల జాతీయ వినియోగదారుల సదుపాయంగా సేవలందిస్తుంది. ఇది వేడి గాలి మేఘంగా మారి వర్షం కురిసే ప్రక్రియ నిర్ధారణకు తోడ్పడే పరిశోధనా పరిశీలనను అందిస్తుంది. వాతావరణ అంచనా నమూనాలలో పారామీటరైజేషన్ విధానాలను మెరుగుపరుస్తుంది. ముందస్తు అంచనా సామర్థ్యాన్ని పెంచడానికి, నమూనా మూల్యాంకనం కోసం డేటా అసిమిలేషన్ ప్రయోగాలను సాధ్యం చేస్తుంది. తుపాన్లు, తీవ్రమైన వాతావరణ పరిస్థితులపై ముందస్తు హెచ్చరిక వ్యవస్థలను మెరుగుపరచడం ద్వారా విపత్తు నిర్వహణకు ఎంతగానో సహకరిస్తుంది.


***
(రిలీజ్ ఐడి: 2257414)
సందర్శకుల సూచీ సంఖ్య : : 16