బొగ్గు మంత్రిత్వ శాఖ
భారత ఇంధన భద్రత బలోపేతం: చారిత్రాత్మక తొలి అడుగు - అండర్గ్రౌండ్ కోల్ గ్యాసిఫికేషన్ నిబంధనలతో బొగ్గు గని అభివృద్ధి ఒప్పందాలపై సంతకాలు
నాడు పోస్టు చేయడమైనది:
28 APR 2026 6:20PM by PIB Hyderabad
భారతదేశ ఇంధన మార్పు, స్వయం సమృద్ధి దిశలో ఒక మైలురాయిగా, బొగ్గు మంత్రిత్వ శాఖ ఈరోజు నాలుగు బొగ్గు గనులకు ఎంపికైన బిడ్డర్లతో బొగ్గు గని/బ్లాక్ ఉత్పత్తి అభివృద్ధి ఒప్పందాల (సీఎండీపీఏ) పై సంతకాలు చేసింది. ఇది భారతదేశంలో అండర్గ్రౌండ్ కోల్ గ్యాసిఫికేషన్ (యూసీజీ) నిబంధనలను అంతర్గతంగా కలిగి ఉన్న వాణిజ్య బొగ్గు గనుల మొదటి విడతగా చరిత్ర సృష్టించింది. ఈ చారిత్రాత్మక అడుగు, భారతదేశం తన విస్తారమైన బొగ్గు నిల్వల పూర్తి విలువను ఎలా ఆవిష్కరించుకోవాలనే దృష్టిలో ఒక మార్పుదాయక ముందడుగును సూచిస్తోంది.
పద్నాలుగో విడత వాణిజ్య బొగ్గు గనుల వేలం ప్రక్రియలో భాగంగా ఈ ఒప్పందాలను కుదుర్చుకున్నారు. రెచర్ల, చింతలపూడి సెక్టార్ ఏ-వన్ గనులను రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ దక్కించుకోగా, బెల్పహార్ డిప్ ఎక్స్టెన్షన్, తంగర్దిహి ఈస్ట్ బొగ్గు గనులను యాక్సిస్ ఎనర్జీ వెంచర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ చేజిక్కించుకుంది. ఈ గనులు ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల్లో ఉన్నాయి. వీటిలో రెండు గనులు పాక్షికంగా, రెండు గనులు పూర్తిగా అన్వేషణ జరిపినవి.
యూసీజీ బొగ్గు వినియోగంలో విప్లవాత్మక పద్ధతి. సాంప్రదాయ గనుల తవ్వకం అవసరం లేకుండా, బొగ్గు పొరలలోనే బొగ్గును కృత్రిమ వాయువుగా మారుస్తుంది. సాంప్రదాయ వెలికితీత పద్ధతులతో ఆర్థికంగా సాధ్యపడని లోతైన, పలుచని, పనికిరాని బొగ్గు పొరల నుంచి ఈ సాంకేతికత ఇంధనాన్ని వెలికితీస్తుంది. ఇది భారత ఇంధన వనరుల సామర్థ్యాన్ని గణనీయంగా పెంచుతుంది.
బొగ్గు గని ఉత్పత్తి, అభివృద్ధి ఒప్పందాలలో మొదటిసారిగా యూసీజీ నిబంధనలను చేర్చడం ద్వారా, బొగ్గు మంత్రిత్వ శాఖ ఈ గనులను భవిష్యత్తు అవసరాలకు సిద్ధం చేసింది. తద్వారా నిర్వాహకులు సాంప్రదాయ వెలికితీతతో పాటు, స్వచ్ఛమైన, మరింత సమర్థవంతమైన ఇంధన ఉత్పత్తి కోసం ఈ అత్యాధునిక మార్గాన్ని అనుసరించడానికి వీలు కలుగుతుంది.
యూసీజీ నిబంధనలను ప్రవేశపెట్టడం , దేశీయ బొగ్గు ఉత్పత్తిని గరిష్ఠం చేయటమే కాకుండా, బొగ్గులో ఉండే ఉత్పన్న పదార్థాల సామర్థ్యాలకు ప్రత్యామ్నాయం చూపడం ద్వారా బొగ్గు ఆర్థిక వ్యవస్థకు విలువను పెంచాలనే భారత నిబద్ధతను ప్రతిబింబిస్తుంది. యూసీజీ ద్వారా తయారయ్యే వాయువు, యూరియా అమ్మోనియా తయారీకి దేశీయ ముడి సరుకుగా ఉపయోగపడుతుంది. ఇది ఎరువుల దిగుమతిపై భారత్ ఆధారపడటాన్ని గణనీయంగా తగ్గించి ఆహార భద్రతను బలోపేతం చేస్తుంది.
రసాయన, పెట్రోరసాయన రంగాలలో యూసీజీ సింథసిస్ గ్యాస్ (సింగ్యాస్) దిగుమతి చేసుకునే సహజ వాయువు, నాఫ్తా స్థానంలో ప్రాథమిక ముడి పదార్థంగా దేశంలోనే మెథనాల్, డైమిథైల్ ఈథర్ సింథటిక్ ఇంధనాల ఉత్పత్తిని సాధ్యమయ్యేలా చేస్తుంది.
ఈ నాలుగు బొగ్గు గని/బ్లాక్ ఉత్పత్తి అభివృద్ధి ఒప్పందాలతో వాణిజ్య బొగ్గు వేలం కింద సంతకం చేసిన మొత్తం ఒప్పందాల సంఖ్య 138 గనులకు చేరుకుంది. ఇవి 331.544 ఎంపీటీఏ గరిష్ట రేటెడ్ సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. ఈ 138 గనులు సుమారు రూ. 42,980 కోట్ల వార్షిక రాబడిని ఆర్జిస్తాయని, రూ. 48,231 కోట్ల మూలధన పెట్టుబడులను ఆకర్షిస్తాయని, సుమారు 4,34,175 మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉపాధిని కల్పిస్తాయని అంచనా.
దేశీయ బొగ్గు ఉత్పత్తిని పెంపొందించడానికి, దీర్ఘకాలిక ఇంధన భద్రత కల్పించడానికి పారదర్శకమైన, పెట్టుబడిదారులకు అనుకూలమైన వేలం ప్రక్రియల ద్వారా సామాజిక, ఆర్థిక అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లడానికి బొగ్గు మంత్రిత్వ శాఖ దృఢ నిశ్చయంతో ఉంది. ఇందుకోసం ప్రపంచ ఇంధన రంగంలో భారతదేశాన్ని అగ్రస్థానంలో నిలబెట్టేందుకు యూసీజీ వంటి అధునాతన సాంకేతికతలను కూడా స్వీకరిస్తోంది.
***
(రిలీజ్ ఐడి: 2256397)
సందర్శకుల సూచీ సంఖ్య : : 11