పౌర విమానయాన మంత్రిత్వ శాఖ
ఢిల్లీ విమానాశ్రయంలో మంత్రి శ్రీ రామ్మోహన్ నాయుడు అధ్యక్షతన ఆసక్తిదారులతో ఉన్నత స్థాయి సమావేశం
హబ్ అండ్ స్పోక్ కార్యకలాపాల సన్నద్ధతను సమీక్షించిన పౌర విమానాయాన శాఖ మంత్రి
నాడు పోస్టు చేయడమైనది:
23 APR 2026 10:04PM by PIB Hyderabad
ఢిల్లీ విమానాశ్రయంలో హబ్ అండ్ స్పోక్ కార్యకలాపాల అమలుపై పౌర విమానయాన శాఖ మంత్రి శ్రీ రామ్మోహన్ నాయుడు ఈ రోజు సమీక్షించారు. ఆయన అధ్యక్షతన విమానయాన రంగానికి చెందిన వివిధ సంస్థలతో విమానాశ్రయంలో నిర్వహించిన ఉన్నత స్థాయి సమావేశంలో.. పౌర విమానయాన శాఖ కార్యదర్శితోపాటు హోం శాఖ, పౌర విమానయాన శాఖ, ఇమ్మిగ్రేషన్ బ్యూరో (బీవోఐ), పౌర విమానయాన భద్రతా బ్యూరో (బీసీఏఎస్), కస్టమ్స్, భారత విమానాశ్రయాల ప్రాధికార సంస్థ (ఏఏఐ), పౌర విమానయాన డైరెక్టొరేట్ జనరల్ (డీజీసీఏ), సీఐఎస్ఎఫ్, డిజియాత్ర, ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయ లిమిటెడ్
(డీఐఏఎల్), ప్రముఖ విమానయాన సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.

ప్రతినిధులతో కలిసి క్షేత్రస్థాయిలో ప్రయాణికుల రాకపోకల స్థితిగతులను మంత్రి పరిశీలించారు. ఢిల్లీ విమానాశ్రయం టెర్మినల్-3లోని సెక్యూరిటీ హోల్డ్ ఏరియాను కూడా తనిఖీ చేసి, అక్కడి కార్యకలాపాల సన్నద్ధతను సమీక్షించారు.

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దార్శనిక నేతృత్వంలో జాతీయ పౌర విమానయాన విధానం (ఎన్సీఏపీ)-2016ను ప్రభుత్వం రూపొందించింది. 2030 నాటికి భారతీయ ప్రయాణికులకు, అలాగే 2047 నాటికి ప్రపంచానికి భారత్ను ఒక అగ్రశ్రేణి వైమానిక కేంద్రంగా నిలపడం లక్ష్యంగా స్పష్టమైన ప్రణాళికను ఈ విధానం సిద్ధం చేసింది. ఈ లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్లే క్రమంలో.. అంతర్జాతీయ విమానయాన కేంద్ర వ్యూహాన్ని ప్రభుత్వం రూపొందించింది. దీని కింద పలు కీలక చర్యలు చేపట్టింది. విదేశీ విమానయాన సంస్థలకు పాయింట్స్ ఆఫ్ కాల్ల మంజూరులో (ముఖ్యంగా మెట్రోయేతర నగరాల్లో) క్రమబద్ధమైన విధానాన్ని అనుసరించడం, భారతీయ విమానయాన సంస్థలను బలోపేతం చేస్తూ.. దేశీయ వైమానిక కేంద్రాలను ప్రోత్సహించేలా ద్వైపాక్షిక ఒప్పందాలను పునఃసమీక్షించడం, భారతీయ విమానాయాన సంస్థలు తమ అంతర్జాతీయ పరిధిని విస్తరించుకునేందుకు వీలుగా దేశీయ కోడ్-షేర్ ఒప్పందాలను సరళీకరించడం వంటివి ఇందులో ఉన్నాయి.

చర్చల సందర్భంగా మంత్రి శ్రీ రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ.. ‘‘తూర్పు, పశ్చిమార్థ గోళాల నడుమ విశిష్టమైన భౌగోళిక స్థానంలో భారత్ ఉంది. అంతర్జాతీయ రవాణా కేంద్రంగా ఎదగడానికి మనకిది సహజసిద్ధమైన సానుకూలతను అందిస్తోంది. భాగస్వామ్య పక్షాలన్నింటితో విస్తృతంగా చర్చించి ఈ వ్యూహాన్ని రూపొందించాం. ఈ ప్రతిపాదనను ముందుకు తీసుకెళ్లడంలో క్రియాశీలకమైన మద్దతును అందించిన గౌరవ కేంద్ర హోం మంత్రి శ్రీ అమిత్ షా గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు’’ అని అన్నారు.

హబ్ అండ్ స్పోక్ నమూనా ప్రాధాన్యాన్ని మంత్రి వివరించారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దూరదృష్టితో రూపొందించిన ‘ఉడాన్’ పథకం ద్వారా ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లో అభివృద్ధి చేసిన విమానాశ్రయాలను.. అంతర్జాతీయ గమ్యస్థానాలతో అనుసంధానించడానికి ఈ విధానం వీలు కల్పిస్తుందన్నారు. దీనివల్ల ప్రయాణ సమయం తగ్గడమే కాకుండా, దేశవ్యాప్తంగా ఇప్పటికే అభివృద్ధి చేసిన మౌలిక సదుపాయాలను గరిష్ట స్థాయిలో వినియోగించుకోవడానికి ప్రయాణికులకు అవకాశం ఉంటుందని ఆయన పేర్కొన్నారు.
తుది గమ్యస్థానంగా కాకుండా అంతర్జాతీయ రవాణా కేంద్రంగా ఎదిగే దిశగా భారత వైమానిక రంగంలో వస్తున్న మార్పును ఈ హబ్ అండ్ స్పోక్ వ్యూహం స్పష్టం చేస్తోంది. తద్వారా ప్రస్తుతం విదేశీ కేంద్రాల ద్వారా జరుగుతున్న ప్రయాణికుల రాకపోకల్లో గణనీయమైన వాటాను భారతీయ విమానాశ్రయాలు పొందేందుకు అవకాశం లభిస్తుంది.
హబ్గా ఎదగాలన్న ప్రభుత్వ లక్ష్యాన్ని స్పష్టం చేస్తూ.. మంత్రి రామ్మోహన్ నాయుడు ఇలా పేర్కొన్నారు: ‘‘ప్రస్తుతం భారత్ నుంచి అంతర్జాతీయ ప్రయాణాలు చేసే వారిలో దాదాపు 35 శాతం మంది దుబాయ్, లండన్, సింగపూర్ వంటి విదేశీ విమానయాన కేంద్రాల మీదుగా ప్రయాణిస్తున్నారు. ఢిల్లీ, ముంబయి, బెంగళూరు, హైదరాబాద్, కలకత్తా, చెన్నై వంటి భారతీయ ప్రధాన కేంద్రాలను ప్రపంచస్థాయిలో పోటీ పడే విమానయాన కేంద్రాలుగా అభివృద్ధి చేయడం ద్వారా ఈ ధోరణిలో పూర్తిగా మార్పును తీసుకురావడమే మా లక్ష్యం”
ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఉదాహరణగా పేర్కొంటూ... ‘‘ఏడాదికి 100 మిలియన్లకు పైగా ప్రయాణికుల సామర్థ్యంతో ఢిల్లీ విమానాశ్రయం ప్రత్యేకతను చాటుకుంటోంది. ఉత్తర ప్రాంతంలోని మొత్తం ప్రయాణికుల రాకపోకల్లో దాదాపు 50 శాతం వాటా, అలాగే రోజూ దాదాపు 50,000 ప్రయాణికులతో సహజంగానే అది ఒక ‘కేంద్రీయ (హబ్) విమానాశ్రయం’గా నిలుస్తోంది’’ అని మంత్రి చెప్పారు.
ప్రయాణికుల సౌకర్యాలతోపాటు.. విమానాల్లో సరుకు రవాణాకు అంతర్జాతీయ కేంద్రంగా భారత్ను బలోపేతం చేయడంపై ఈ వ్యూహం ప్రధానంగా దృష్టి సారిస్తుంది. ఒక విమానం నుంచి మరో విమానానికి మార్చే చేసే సరుకును మళ్లీ మళ్లీ తనిఖీలు చేయాల్సిన అవసరం లేకుండా నిబంధనలను తొలగించడం, కార్గో సంబంధిత అనుమతులు - పత్రాల ప్రక్రియను డిజిటలీకరించడం వంటి చర్యలు.. సామర్థ్యాన్ని గణనీయంగా పెంచడమే కాకుండా, సరుకు నిర్వహణ సమయాన్నీ తగ్గిస్తాయని భావిస్తున్నారు.
‘‘హబ్ అండ్ స్పోక్ నమూనా ద్వారా ప్రాంతాల మధ్య అనుసంధానం పెరగడమే కాకుండా, దీర్ఘకాలిక ఆర్థిక ప్రయోజనాలనూ కలిగిస్తుంది. దీనివల్ల 2047 నాటికి ప్రత్యక్షంగా, పరోక్షంగా దాదాపు 1.6 ఉద్యోగాలు లభిస్తాయనీ, భారత ఆర్థిక వ్యవస్థకు దాదాపు 1.4 ట్రిలియన్ డాలర్ల మేర ఇది దోహదపడుతుందనీ అంచనా వేస్తున్నాం’’ అంటూ ఈ నమూనా ప్రాధాన్యాన్ని మంత్రి శ్రీ రామ్మోహన్ నాయుడు వివరించారు.
హబ్ అండ్ స్పోక్ నమూనా అమలు ద్వారా విమానయాన సంస్థలు తమ విమానాలను అంతర్జాతీయ కార్యకలాపాల కోసం మరింత సమర్థంగా వినియోగించుకోవడానికి వీలవుతుంది. అలాగే కస్టమ్స్, ఇమ్మిగ్రేషన్ ప్రక్రియలను ప్రాంతీయ కేంద్రాలకు వికేంద్రీకరించడం ద్వారా.. ప్రధాన విమానాశ్రయాల్లో రద్దీని తగ్గించడానికి కూడా ఈ విధానం దోహదపడుతుంది.
సంబంధిత విభాగాల క్రియాశీల భాగస్వామ్యాన్ని మంత్రి రామ్మోహన్ నాయుడు అభినందించారు. భారతీయ విమానయాన సంస్థలు భారీ (వైడ్ బాడీ) విమానాల కోసం గణనీయంగా ఆర్డర్లు ఇవ్వడాన్ని స్వాగతించారు. ఇవి సుదూర ప్రయాణ అనుసంధానాన్ని మెరుగుపరచడంతోపాటు హబ్ కార్యకలాపాలకూ తోడ్పడతాయన్నారు. అదే సమయంలో ప్రయాణికులు వేగంగా, సమర్థంగా విమానాలు మారేందుకు వీలుగా.. స్లాట్ బ్యాంకుల ఏర్పాటు ప్రక్రియను ఢిల్లీ విమానాశ్రయం ప్రారంభించిందని తెలిపారు. డిజియాత్ర వంటి సాంకేతిక మార్గాలను వినియోగించడం ద్వారా.. ముఖ్యంగా దేశీయ, అంతర్జాతీయ విభాగాల మధ్య మారే ప్రయాణికుల రాకపోకలను మరింత క్రమబద్ధీకరించవచ్చని మంత్రి పేర్కొన్నారు.
హబ్ అండ్ స్పోక్ నమూనాలో భాగంగా.. వివిధ చిన్న నగరాల నుంచి వచ్చే ప్రయాణికులను ఒక క్రమబద్ధమైన పద్ధతిలో సమీకరించి, ఢిల్లీ వంటి ప్రధాన హబ్ విమానాశ్రయాల ద్వారా అంతర్జాతీయ ప్రయాణాల కోసం పంపిస్తారు. ఇక్కడి నుంచి బయల్దేరే విమానాల్లో దేశీయ ప్రయాణికులతోపాటు అంతర్జాతీయ ప్రయాణాలు చేసే వారు కూడా ఉంటారు.
ప్రయాణం ప్రారంభించే విమానాశ్రయంలోనే వారికి రెండు వేర్వేరు బోర్డింగ్ పాస్లను జారీ చేస్తారు. వీటిపై ‘డీ’ (దేశీయ), ‘ఐ’ (అంతర్జాతీయ) అని స్పష్టంగా పేర్కొంటారు. విదేశాలకు వెళ్లే ప్రయాణికులకు కస్టమ్స్, ఇమ్మిగ్రేషన్ ప్రక్రియలు.. వారు దేశం నుంచి బయటకు వెళ్లే మొదటి పాయింట్ వద్ద, అంటే పరిధీయ (స్పోక్) విమానాశ్రయంలో పూర్తవుతాయి. ఆ ప్రయాణికులకు ప్రయాణ సమయంలో కస్టమ్స్ డిక్లరేషన్ సౌకర్యాలు అందుబాటులో ఉండవు.
దేశంలోకి తిరిగి వచ్చే ప్రయాణికుల విషయానికి వస్తే.. కస్టమ్స్, ఇమ్మిగ్రేషన్ ప్రక్రియలు వారు దేశంలోకి వచ్చిన తుది పాయింట్ వద్ద, అంటే స్పోక్ విమానాశ్రయంలో జరుగుతాయి. ఈ నమూనా ప్రకారం.. లోనికి వచ్చే, బయటికి వెళ్లే అంతర్జాతీయ ప్రయాణికుల లగేజీని కేంద్రీయ (హబ్) విమానాశ్రయంలోని అంతర్గత కార్యకలాపాల (ఎయిర్సైడ్ ఆపరేషన్స్) ద్వారా సజావుగా బదిలీ చేస్తారు. దీంతో ప్రయాణికుల ప్రమేయం అవసరముండదు. కార్యకలాపాల సమర్థత, నిబంధనల్లో స్పష్టత కోసం.. కాంబినేషన్ విమానాలను అనుమతించబోరు. హబ్ అండ్ స్పోక్ కార్యకలాపాల్లో దేశీయ, అంతర్జాతీయ విభాగాల కోసం వేర్వేరు విమానాలను కేటాయిస్తారు.
భారతదేశ వ్యూహాత్మక భౌగోళిక ప్రాధాన్యాన్ని, వేగంగా పెరుగుతున్న విమానయాన సామర్థ్యాన్ని గుర్తించిన పౌర విమానయాన మంత్రిత్వ శాఖ.. 2047 నాటికి దేశాన్ని ప్రపంచంలో అగ్రగామి విమానయాన కేంద్రంగా తీర్చిదిద్దేందుకు కట్టుబడి ఉంది.
***
(రిలీజ్ ఐడి: 2255218)
సందర్శకుల సూచీ సంఖ్య : : 3