శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
పునర్వినియోగ ఆర్థిక వ్యవస్థ దిశగా సమూల మార్పులను చూస్తున్న ప్రపంచం.. కనుమరుగవుతోన్న వ్యర్థాలు: డాక్టర్ జితేంద్ర సింగ్
స్వచ్ఛతా ప్రచార కార్యక్రమంలో భాగంగా ఈ-వ్యర్థాలతో పాటు పాత సామాను అమ్మటం ద్వారా ప్రభుత్వానికి రూ.4,000 కోట్లకు పైగా ఆదాయం వచ్చిందన్న మంత్రి
రీసైక్లింగ్, బయో టెక్నాలజీ ఆధారిత ఆవిష్కరణల మద్దతుతో అభివృద్ధి చెందుతున్న పునర్వినియోగ ఆర్థిక వ్యవస్థ నమూనా.. వివిధ రంగాల్లో పారిశ్రామిక వృద్ధి, స్థిరత్వానికి కొత్త అర్థాన్నిస్తుందన్న మంత్రి
భారత పునర్వినియోగ ఆర్థిక వ్యవస్థ మార్పును వేగవంతం చేస్తున్న విధానపరమైన మద్దతు, అంకుర సంస్థలు, పరిశ్రమల భాగస్వామ్యం
నాడు పోస్టు చేయడమైనది:
20 APR 2026 6:11PM by PIB Hyderabad
కేంద్ర శాస్త్ర, సాంకేతిక, భూవిజ్ఞాన శాఖ (స్వతంత్ర బాధ్యత) సహాయమంత్రి, ఎంఓఎస్ పీఎంఓ, సిబ్బంది, ప్రజా ఫిర్యాదుల శాఖ, పెన్షన్లు, అణుశక్తి , అంతరిక్షయాన శాఖల సహాయమంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూ.. ప్రస్తుతం ప్రపంచం పునర్వినియోగ ఆర్థిక వ్యవస్థ దిశగా సమూల మార్పును చూస్తోందన్నారు. ఆర్థిక పరంగా ఆలోచనా దృక్పథంలో నిర్ణయాత్మక మార్పు వచ్చిందని, దీనిద్వారా వ్యర్థాలు కనుమరుగవుతాయని పేర్కొన్నారు. ప్రతి నిరుపయోగ వస్తువును ఆర్థిక విలువ సృష్టించే వనరుగా చూడటం పెరుగుతోందని తెలిపారు. స్వచ్ఛతా ప్రచారంలో భాగంగా సేకరించిన ఈ-వ్యర్థాలు, పాత సామాగ్రిని విక్రయించటం ద్వారా ప్రభుత్వానికి రూ.4,000 కోట్ల ఆదాయం సమకూరినట్లు ఆయన ఉదహరించారు.
రీసైక్లింగ్, బయో టెక్నాలజీ ఆధారిత ఆవిష్కరణ తోడ్పాటుతో రూపుదిద్దుకుంటున్న ఈ పునర్వినియోగ ఆర్థిక వ్యవస్థ నమూనా వివిధ రంగాల్లో పారిశ్రామిక వృద్ధి, సుస్థిరతకు కొత్త రూపమివ్వనుందని మంత్రి తెలిపారు.
వనరుల సామర్థ్యం, పునర్వినియోగ ఆర్థిక వ్యవస్థ అంశంపై న్యూఢిల్లీలో నిర్వహించిన రెండో అంతర్జాతీయ సదస్సు, అవార్డుల కార్యక్రమంలో డాక్టర్ జితేంద్ర సింగ్ ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వం, పరిశ్రమలు, పరిశోధనా సంస్థలు, అంతర్జాతీయ ప్రతినిధులతో పాటు యూరోపియన్, జర్మనీ రాయబార కార్యాలయ ప్రతినిధులు, రిసోర్స్ ఎఫిషియన్సీ అండ్ సర్క్యులర్ ఎకానమీ ఇండస్ట్రీ అలయన్స్కు చెందిన కీలక భాగస్వాములు పాల్గొన్నారు.
కొన్నేళ్లుగా పర్యావరణ సంబంధిత చర్చల్లో గణనీయమైన మార్పులు వచ్చాయని, పర్యావరణ పరిరక్షణ దృక్పథం నుంచి దాన్ని బలమైన ఆర్థిక కోణంతో చూసే స్థాయికి మారిందని డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. సుస్థిరత ద్వారా ఆదాయాన్ని ఆర్జించవచ్చనే అవగాహన పెరగటం వల్ల, ఈ ఉద్యమం పట్ల మరింత శ్రద్ధ పెరగటమే కాక ప్రజల భాగస్వామ్యం కూడా విస్తృతమైందన్నారు.
పారిశ్రామిక అభివృద్ధి తదుపరి దశ ఎక్కువగా పునర్వినియోగం, బయో-టెక్నాలజీ, జన్యు ఆధారిత ప్రక్రియల ద్వారా సాగుతుందని మంత్రి అన్నారు. ఈ మార్పును ప్రపంచవ్యాప్త నిపుణులు తదుపరి పారిశ్రామిక విప్లవానికి నాందిగా పరిగణిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.
ప్రయోగాత్మక ఉదాహరణలను వివరిస్తూ.. ఒకప్పుడు వ్యర్థాలుగా భావించిన ప్లాస్టిక్, వాడిన వంట నూనె, ఉక్కు వ్యర్థాల వంటి పారిశ్రామిక ఉప-ఉత్పత్తులను ఇప్పుడు విలువైన వనరులుగా మారుస్తున్నారు. వీటిని రోడ్ల నిర్మాణం, జీవ ఇంధనాలు, వాణిజ్యపరంగా లాభదాయకమైన పారిశ్రామిక ఉత్పత్తులుగా మారుస్తున్నారు. గతంలో ఇటువంటి వ్యర్థాల నిర్వహణకు ఖర్చులు భరించిన పరిశ్రమలు.. ఇప్పుడు వాటి నుంచే ఆర్థిక లాభాలను పొందుతున్నాయని వెల్లడించారు.
నిరంతర స్వచ్ఛత, పునర్వినియోగ ప్రక్రియలు ఇప్పటికే ఎన్నో ఆర్థిక ప్రయోజనాలను చేకూరుస్తున్నాయని డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. ప్రత్యేక దేశవ్యాప్త ప్రచారాన్ని ప్రస్తావిస్తూ.. కేవలం ఎలక్ట్రానిక్ వ్యర్థాల సేకరణ ద్వారానే ప్రభుత్వానికి రూ.4,000 కోట్ల ఆదాయం సమకూరిందని తెలిపారు. ఇది వనరుల పునర్వినియోగంలోని అవకాశాలకు నిదర్శనమన్నారు.
పునర్వినియోగ ఆర్థిక వ్యవస్థ ప్రయోజనాలు కేవలం పెద్ద పరిశ్రమలకే కాక.. గృహాలు, అసంఘటిత రంగాలు, అంకుర సంస్థలు, ఎంఎస్ఎంఈల వంటి ఆర్థిక వ్యవస్థలకు విస్తరిస్తాయని తెలిపారు. దీనివల్ల వివిధ స్థాయుల్లో జీవనోపాధి, వ్యాపార అవకాశాలు కలుగుతాయన్నారు.
విస్తృత స్థాయిలో మార్పునకు ప్రభుత్వ కార్యక్రమాలతో పాటు ఉమ్మడి భాగస్వామ్యం, ప్రవర్తనలో మార్పులు అవసరమని మంత్రి అన్నారు. వివిధ రంగాలను ప్రోత్సహిస్తూ, సహకారానికి ప్రభుత్వం మద్దతిస్తున్న తరుణంలో పెట్టుబడి, ఆవిష్కరణలు, భాగస్వామ్యం కోసం పరిశ్రమలు, అంకుర సంస్థలు, పౌరులు క్రియాశీలకంగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు.
మారుతున్న ఆర్థిక విధానాల గురించి ప్రస్తావిస్తూ.. కీలక మార్పును భారత్ చూస్తోందన్నారు. ఇందులో భాగంగా విలువ వ్యవస్థలు కొత్తరూపుని సంతరించుకుంటున్నాయని.. వ్యర్థాల నిర్వహణ, గ్రీన్ టెక్నాలజీస్, పునర్వినియోగ ఉత్పాదక వ్యవస్థల్లో నూతన అవకాశాలు పుట్టుకొస్తాయని అన్నారు. 2070 నాటికి కర్బన రహితంగా మారాలన్న భారత నిబద్ధతకు ఈ మార్పు దోహదపడుతుందని తెలిపారు.
భారత సంస్కృతి, వ్యవసాయ రంగాల్లో సంప్రదాయ పునర్వినియోగ ఆర్థిక వ్యవస్థ గురించి బీఐఆర్ఏసీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ జితేంద్ర కుమార్ ప్రస్తావించారు. ఈ వారసత్వాన్ని ఆధునిక శాస్త్రీయ ఆవిష్కరణలతో అనుసంధానించాల్సిన అవసరాన్ని స్పష్టం చేశారు. గ్రీన్ టెక్నాలజీస్, సుస్థిర పరిష్కారాలపై పనిచేసేందుకు అంకుర సంస్థలకు బీఐఆర్ఏసీ నిరంతరం మద్దతిస్తుందని తెలిపారు. కార్బన్ క్రెడిట్స్ వంటి జీవనాధారిత విధానాలు, చర్యలను ప్రోత్సహిస్తుందన్నారు.
వనరుల సామర్థ్యం, భారత పునర్వినియోగ ఆర్థిక వ్యవస్థ దిశగా భారతదేశ పరివర్తనను వేగవంతం చేయటానికి విధానపరమైన వ్యవస్థలు, భాగస్వామ్యాలు, అమలు వ్యూహాలపై చర్చలకు వేదికగా ఈ సదస్సు నిలిచింది.




***
(రిలీజ్ ఐడి: 2254110)
సందర్శకుల సూచీ సంఖ్య : : 7