మత్స్య పరిశ్రమ, పశు పోషణ మరియు పాడి పరిశ్రమ మంత్రిత్వ శాఖ
ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన కింద ఏర్పాటు చేసిన ఉప్పునీటి ఆక్వాకల్చర్ క్లస్టర్ పురోగతిని సమీక్షించేందుకు ఆంధ్రప్రదేశ్లోని భీమవరాన్ని సందర్శించిన కేంద్ర మత్స్యశాఖ కేంద్ర కార్యదర్శి
నాడు పోస్టు చేయడమైనది:
16 APR 2026 3:54PM by PIB Hyderabad
ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన (పీఎంఎంఎస్వై) కింద ఏర్పాటు చేసిన ఉప్పునీటి ఆక్వాకల్చర్ క్లస్టర్ పురోగతిని పర్యవేక్షించేందుకు ఏప్రిల్ 16న కేంద్ర మత్స్య, పశుసంవర్ధక, పాడిపరిశ్రమ మంత్రిత్వ శాఖ కార్యదర్శి డాక్టర్ అభిలక్ష్ లిఖి ఆంధ్రప్రదేశ్లోని భీమవరంలో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన స్థానిక రొయ్యల, చేపల రైతులను స్వయంగా కలిసి మాట్లాడారు. క్షేత్రస్థాయిలో వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, సవాళ్లు, వసతుల కొరతను అడిగి తెలుసుకున్నారు. ఈ సమీక్షా సమావేశం హైబ్రిడ్ విధానంలో జరిగింది. ఇందులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ మత్స్యశాఖ అధికారులు, వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల మత్స్య క్లస్టర్ ప్రతినిధులు, ఐసీఏఆర్ శాస్త్రవేత్తలు పాల్గొన్నారు. వీరితోపాటు ఎన్ఎఫ్డీబీ, సీఏఏ, ఎంపీఈడీఏ, నాబార్డ్ వంటి సంస్థల ప్రతినిధులు, చేపల, రొయ్యల రైతులు, మత్స్య సహకార సంఘాలు, సముద్ర ఆహార ఎగుమతిదారులు, మత్స్య విశ్వవిద్యాలయాలు, కళాశాలల ప్రతినిధులు ఈ చర్చా వేదికలో భాగస్వాములయ్యారు.

చేపల పెంపకందారులతో కేంద్ర మత్స్యశాఖ కార్యదర్శి డాక్టర్ అభిలక్ష్ లిఖి మాట్లాడారు. ఈ సందర్భంగా సమావేశంలో పాల్గొన్న వారందరినీ ఆయన అభినందించారు. రైతులు ఇచ్చిన విలువైన అభిప్రాయాలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధాన రూపకల్పనకు ఎంతో కీలకమని పేర్కొన్నారు. సుమారు 64 లక్షల టన్నుల చేపల ఉత్పత్తిని సాధించి, ఆక్వా రంగంలో అగ్రగామిగా నిలిచిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆయన ప్రత్యేకంగా అభినందించారు. భీమవరం క్లస్టర్కు కేంద్రం నుంచి నిరంతర మద్దతు ఉంటుందని తెలిపారు. ఉత్పత్తికి ముందు, ఉత్పత్తి సమయంలో, ఉత్పత్తి తర్వాత ఎదురయ్యే అన్ని రకాల సమస్యలను పరిష్కరిస్తామని చెప్పారు. చేపల వినియోగాన్ని పెంచేందుకు రక్షణ శాఖ, ఇతర ప్రభుత్వ సంస్థలతో ఒప్పందాలు చేసుకోవాలని సూచించారు. మన రైతులు కొత్త విషయాలు నేర్చుకోవడానికి దేశ విదేశాల్లో పర్యటించేలా ప్రోత్సహిస్తామని తెలిపారు. చేపల్లో ఏ భాగాన్ని వృధా చేయకుండా సంపూర్ణ వినియోగ విధానాన్ని అవలబించాలని, చేపల వ్యర్థాల నిర్వహణతో సహా ఐస్లాండ్ దేశంతో కుదుర్చుకోబోయే త్రైపాక్షిక ఒప్పందం గురించి వివరించారు. అత్యాధునిక సాంకేతికత, ఉత్తమ సాగు పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించేందుకు భీమవరంలో సీఐబీఏ ఆధ్వర్యంలో ఒక అవగాహన సదస్సును ఏర్పాటు చేయాలని సూచించారు. రొయ్యలు, చేపల ఎగుమతులను పెంచడానికి మార్కెట్ సంబంధాలను బలోపేతం చేయాలని.. ధ్రువీకరణ, ట్రేసబిలిటీపై రైతులకు అవగాహన కల్పించాలని ఎంపీఈడీఏ ను కోరారు. భీమవరం క్లస్టర్ అభివృద్ధి కోసం ఈ రంగంలోని అందరూ కలిసికట్టుగా పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీ బి. రాజశేఖర్ మాట్లాడుతూ.. దేశ సముద్ర ఆర్థిక వ్యవస్థకు మత్స్య రంగం కేంద్ర బిందువు అని, స్థిరమైన వృద్ధిని సాధించడంలో, ఎగుమతి ఆదాయాన్ని పెంచడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుందని చెప్పారు. అంతర్జాతీయ మార్కెట్లో నిలబడాలంటే ట్రేసబిలిటీ, ప్రపంచ ప్రమాణాలను పాటించడం ఇప్పుడు పాటించడం ఐచ్ఛికం కాదని, అవి తప్పనిసరి అని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్కు ఉన్న విస్తారమైన తీరప్రాంతం, సముద్ర వనరులను దృష్టిలో ఉంచుకుని, సముద్రపు నాచు సాగు, కృత్రిమ సముద్ర దిబ్బల ఏర్పాటులో పెట్టుబడులు పెంచాలని పిలుపునిచ్చారు. ఇవి ఎగుమతుల అభివృద్ధికి, వనరుల సుస్థిరతకు ఎంతో దోహదపడతాయని పేర్కొన్నారు.

కేంద్ర మత్స్య, పశుసంవర్ధక, పాడి పరిశ్రమల మంత్రిత్వ శాఖ (అంతర్గత మత్స్యశాఖ) సంయుక్త కార్యదర్శి శ్రీ సాగర్ మెహ్రా మాట్లాడుతూ.. ఉత్పత్తి, ప్రాసెసింగ్, మార్కెట్ సంబంధాలు, ఎగుమతుల వరకు అన్నింటినీ అనుసంధానిస్తూ.. దేశవ్యాప్తంగా 34 మత్స్య క్లస్టర్లను అభివృద్ధికి ప్రధాన కేంద్రాలుగా తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. క్షేత్రస్థాయిలో మౌలిక సదుపాయాలను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని, ఇందుకోసం ఐఓటీ, బయోఫ్లాక్, ఆర్ఏఎస్ వంటి ఆధునిక సాంకేతికతలను అందిపుచ్చుకోవాలని సూచించారు. శీతలీకరణ సౌకర్యాలను మెరుగుపరచడంతో పాటు, మత్స్య మౌలిక సదుపాయాల అభివృద్ధి నిధి, కిసాన్ క్రెడిట్ కార్డువంటి పథకాలను మార్కెట్ వ్యవస్థతో అనుసంధానించి, రైతులకు రుణ సదుపాయం అందడంలో ఉన్న అడ్డంకులను తొలగించాలని తెలిపారు.
ప్రపంచంలోనే చేపల ఉత్పత్తిలో భారత్ రెండో స్థానంలో ఉందని ఐసీఏఆర్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ (మత్స్య శాస్త్రం) డాక్టర్ జేకే జెనా తెలిపారు. జాతీయ ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ అందిస్తున్న సహకారాన్ని ఆమె అభినందించారు. సీఐబీఏతో సహా ఐసీఏఆర్ సంస్థలు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించడం, వ్యాధి నిర్ధారణ పరీక్షలు, పర్యవేక్షణ కార్యక్రమాల ద్వారా పూర్తి మద్దతు ఇవ్వడం ద్వారా భీమవరం క్లస్టర్ దేశంలోనే అగ్రగామి ఆక్వాకల్చర్ జోన్గా ఎదిగే అవకాశం ఉందని తెలిపారు. భవిష్యత్తులో ఈ రంగం సుస్థిరంగా ఎదగాలంటే రైతులు, పరిశోధనా సంస్థలు, ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వాముల మధ్య బలమైన సమన్వయం అవసరమని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్ మత్స్యశాఖ కమిషనర్ శ్రీ రామశంకర్ నాయక్ మాట్లాడుతూ... అంతర్జాతీయ నాణ్యతా ప్రమాణాలను పాటిస్తూ, విలువ ఆధారిత సముద్రపు ఉత్పత్తులను ప్రోత్సహించడం ద్వారానే రైతుల ఆదాయం పెరుగుతుందని పేర్కొన్నారు. సాగు నీటి నాణ్యతను కాపాడటానికి, వ్యాధుల ప్రభావాన్ని తగ్గించి ఉత్పాదకతను పెంచడానికి ఉప్పునీటి కాలువలు, డ్రైనేజీ వ్యవస్థల్లో పూడికతీత, శుభ్రపరచడం వంటి పనులు అత్యంత కీలకమని తెలిపారు. ఉత్తమ ఆక్వా సాగు పద్ధతులను పాటించాలని, మత్స్య రైతు ఉత్పత్తిదారుల సంఘాల ఏర్పాటు, ప్రయోగశాల సౌకర్యాల కల్పన అవసరమని తెలుపుతూ.. రైతులకు పెట్టుబడి ఖర్చు తగ్గించేందుకు ఏరేటర్లపై జీఎస్టీని తగ్గించాలని ఆయన కోరారు.
భీమవరం క్లస్టర్ కోసం రాబోయే పంచవర్ష ప్రణాళికపై జాతీయ మత్స్య అభివృద్ధి బోర్డు ముఖ్య కార్యనిర్వహణాధికారి డాక్టర్ బిజయ్ కుమార్ బెహెరా ప్రజెంటేషన్ ఇచ్చారు. విలువ ఆధారిత వ్యవస్థలోని భాగస్వాములందరి నుంచి ఆశిస్తున్న అంశాలను ఆయన ప్రస్తావించారు.
సాంకేతికత, మౌలిక సదుపాయాలు, మార్కెట్ ఆధారిత చర్యల ద్వారా భీమవరం మత్స్య క్లస్టర్ను బలోపేతం చేయడంపై కీలక భాగస్వాములు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. హేచరీ (చేప పిల్లల ఉత్పత్తి కేంద్రం), జన్యు మెరుగుదల సాంకేతికతలలో పురోగతి, సమీకృత రొయ్యలు-సముద్రపు నాచు సాగు నమూనాలు, మెరుగైన జీవ-భద్రతతో కూడిన అత్యధిక సాంద్రత గల రొయ్యల పెంపకం, వ్యాధి నిఘా, ట్రేసబిలిటీ వ్యవస్థలు, చేపల వ్యర్థాల వినియోగంలో సాధించిన పురోగతిని సీఐబీఏ వివరించింది. ఎగుమతులకు మద్దతుగా భీమవరంలో ఒక ప్రాంతీయ కార్యాలయం, రెండు పరీక్షా ప్రయోగశాలల ఏర్పాటుతో పాటు, ధ్రువీకరణ, ట్రేసబిలిటీపై క్రమం తప్పకుండా రైతులకు అవగాహన కల్పించే కార్యక్రమాల గురించి ఎంపీఈడీఏ పేర్కొంది. క్లస్టర్లలో మత్స్య రైతు ఉత్పత్తిదారుల సంఘాల ఏర్పాటులో సాధించిన పురోగతిని, ఆర్థిక సమ్మిళితాన్ని మెరుగుపరచడానికి ప్రాంతీయ బ్యాంకులతో రుణ సంబంధాలను బలోపేతం చేయడం వంటి అంశాలను నాబార్డ్ వివరించింది. కీలకమైన ఉప్పునీటి జాతుల కోసం హేచరీ సాంకేతికతల అభివృద్ధి, సముద్రపు నాచు విలువ ఆధారిత ఉత్పత్తులపై చేపట్టిన కార్యక్రమాలు, కృత్రిమ దిబ్బల ఏర్పాటు, బహుళ జాతుల ఆక్వాకల్చర్, నర్సరీలు, బతికున్న చేపల రవాణాను ప్రోత్సహించడానికి అవసరమైన మౌలిక సదుపాయాల మద్దతు వంటి అంశాలను సీఎంఎఫ్ఆర్ఐ తెలిపింది.
ఈ సమావేశంలో ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన కింద అందుతున్న ప్రత్యక్ష మద్దతును చేపల రైతులు అభినందించారు. అయితే ప్రత్యేక దృష్టి సారించాల్సిన పలు సవాళ్లను వారు ప్రస్తావించారు. బలహీనమైన మార్కెట్ అనుసంధానం, దేశీయ వినియోగాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం వంటి కీలక ఆందోళనలను వ్యక్తం చేశారు. ప్రభుత్వ క్యాంటీన్లు, ఆసుపత్రులు, మధ్యాహ్న భోజన పథకాల్లో చేపలు, సముద్రపు ఆహారాన్ని చేర్చాలని సూచించారు. వ్యాధులు, వైరస్ ల వ్యాప్తిని నిరోధించడానికి బ్రూడ్స్టాక్, విత్తన నాణ్యతపై కఠినమైన నియంత్రణ, పర్యవేక్షణ ఉండాలని రైతులు చెప్పారు. వ్యాధిని తట్టుకోగల బ్రూడ్స్టాక్ను ప్రవేశపెట్టాలని సిఫార్సు చేశారు. సంస్థాగత రుణాల అందుబాటు పరిమితంగా ఉండటం ఒక ప్రధాన అడ్డంకిగా పేర్కొన్నారు. ఆక్వాకల్చర్ కార్యకలాపాలకు కూడా వ్యవసాయం తరహాలోనే ఆదాయపు పన్ను మినహాయింపులు ఇవ్వాలని కోరారు. ఉత్పాదకత, లాభదాయకతను పెంచడానికి మెరుగైన శాస్త్రీయ నిర్వహణ పద్ధతులు, సామర్థ్య పెంపు అవసరమని రైతులు చెప్పారు. ఉత్పత్తి వ్యయంలో దాదాపు 70 శాతం చేపల ఆహారానికే ఖర్చవుతుందని, వీటి నాణ్యతను మెరుగుపరచాలని కోరారు. ఐఓటీ ఆధారిత సాంకేతికతలను అవలంబించడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ, ఆ సాంకేతిక పరికరాల వినియోగం సాధ్యపడాలంటే రాయితీలు అందించాలని కోరారు.
‘ఉత్తమ ఎగుమతుల నగరం’గా భీమవరం గుర్తింపు పొందినప్పటికీ, వ్యవసాయ క్షేత్రాల నుంచి ప్రాసెసింగ్ కేంద్రాల వరకు అనుసంధానం వంటి మౌలిక సదుపాయాలు మెరుగుపరచాల్సిన అవసరం ఉందని సముద్రపు ఆహార ఎగుమతిదారులు సూచించారు. పెరుగుతున్న రవాణా సుంకాలు, అధిక విలువ జోడింపు కోసం ఉప-ఉత్పత్తుల వినియోగాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం, పోటీ ప్రపంచ మార్కెట్లలో యూనిట్ ధరలను పెంచడానికి పరిమిత అవకాశాలు ఉండటంపై ఆందోళన వ్యక్తం చేశారు.
సమీక్షా సమావేశం అనంతరం పశ్చిమ గోదావరి జిల్లా కల్లా గ్రామంలోని శ్రీ అల్లూరి మహేష్ రాజుకు చెందిన 40 ఎకరాల రొయ్యల చెరువును కేంద్ర మత్స్యశాఖ కార్యదర్శి సందర్శించారు. పీఎంఎంఎస్వై కింద అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఇక్కడ లిటోపెనియస్ వన్నమేయి రొయ్యల సాగు జరుగుతోంది. 2026 జనవరిలో ఎకరాకు 50,000 విత్తనాల సాంద్రతతో ప్రారంభించిన ఈ క్షేత్రంలో.. ఐఓటీ సెన్సార్లు, నానో-బబుల్ ఆక్సిజనేషన్, విద్యుత్ పర్యవేక్షణ వ్యవస్థలను ఉపయోగిస్తున్నారు. దీని ద్వారా స్థానిక ఉపాధిని కల్పిస్తూనే, 50 టన్నుల ఉత్పత్తి వస్తుందని అంచనా వేస్తున్నారు.

దేశ సముద్ర ఆహార ఎగుమతులు బలమైన వృద్ధిని కనబరుస్తున్నాయి. 2024–25 ఆర్థిక సంవత్సరంలో రూ. 62,408 కోట్లుగా ఉన్న ఎగుమతులు.. 2025–26 నాటికి సుమారు రూ..68,000 కోట్లకు చేరుకుంటాయని అంచనా. ఈ వృద్ధిని ప్రోత్సహించడానికి, కొత్త ఎగుమతి అవకాశాలను అందిపుచ్చుకోవడానికి ప్రభుత్వం ప్రత్యేక ఆర్థిక మండలిలో మత్స్య సంపద స్థిరమైన వినియోగం నిబంధనలు 2025ను ప్రకటించింది. అలాగే భారతీయ నౌకలు అంతర్జాతీయ జలాల్లో చేపల వేట సాగించేందుకు మార్గదర్శకాలను విడుదల చేసింది. దీనితో ప్రత్యేక ఆర్థిక మండలం, అంతర్జాతీయ జలాల నుంచి సేకరించిన చేపలకు సుంకం లేని వెసులుబాటు కల్పించడం, విదేశీ రేవుల్లో దిగుమతి చేసుకునే సరుకును కూడా ఎగుమతులుగా గుర్తించడం, ప్రాసెసింగ్ కోసం అవసరమైన ముడి పదార్థాలపై సుంకం లేని దిగుమతి పరిమితిని 1 శాతం నుంచి 3 శాతానికి పెంచడం వంటి చర్యలు భారత సముద్ర ఆహార రంగాన్ని ప్రపంచవ్యాప్తంగా మరింత బలోపేతం చేస్తున్నాయి.

దేశీయ మత్స్య రంగంలో ఉప్పునీటి ఆక్వాకల్చర్ కీలక పాత్ర పోషిస్తోంది. ఇది దేశంలోని మొత్తం చేపల ఉత్పత్తిలో సుమారు 15 శాతం వాటాను కలిగి ఉంటూ.. రొయ్యల వంటి ఖరీదైన జాతుల సాగుపై దృష్టి సారించడం వల్ల ఎగుమతి ఆదాయంలో సింహభాగాన్ని అందిస్తోంది. తీరప్రాంతాలు, నదీముఖ ప్రాంతాల్లో కేంద్రీకృతమైన ఈ సాగు ఆధునిక సాంకేతికత, శాస్త్రీయ నిర్వహణ పద్ధతులు, బలమైన మార్కెట్ అనుసంధానాల మద్దతుతో ఉత్పాదకతను పెంచడమే కాకుండా వేలాది మందికి ఉపాధిని కల్పిస్తోంది.
ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న భీమవరం ఉప్పునీటి క్లస్టర్ దేశంలోనే అతిపెద్ద, అత్యంత కీలకమైన సాగు ప్రాంతంగా నిలుస్తోంది. 2025 మార్చి 11న పీఎంఎంఎస్వై కింద గుర్తించిన ఈ క్లస్టర్.. సుమారు 53,861 హెక్టార్లలో 42,000కు పైగా చెరువులతో విస్తరించి ఉంది. అనుకూలమైన వాతావరణం, ఆధునిక మౌలిక సదుపాయాల కారణంగా ఇక్కడ ఎగుమతి ఆధారిత రొయ్యల జాతులైన తెల్ల రొయ్య, టైగర్ రొయ్యల సాగు ముమ్మరంగా సాగుతోంది. హెక్టారుకు సగటున 8 టన్నుల దిగుబడితో, జాతీయ సగటు కంటే ఎక్కువ ఉత్పాదకతను సాధిస్తున్న ఈ క్లస్టర్ భారత సముద్ర ఆహార ఎగుమతుల్లో కీలక పాత్ర పోషిస్తోంది.
నేపథ్యం
ఇది దేశంలోని మొత్తం చేపల ఉత్పత్తిలో దాదాపు 30 శాతం వాటాను కలిగి ఉండటమే కాకుండా, చేపల ఉత్పత్తిలో జాతీయ స్థాయిలో మొదటి స్థానంలో నిలుస్తోంది. ఈ రంగం సుమారు 16.5 లక్షల మందికి జీవనోపాధిని కల్పిస్తోంది. భారతదేశ సముద్ర ఆహార ఎగుమతుల్లో ఏపీ వాటా దాదాపు 34 శాతం కాగా, వీటి వార్షిక విలువ రూ. 21,000 కోట్లకు పైమాటే. ఆంధ్రప్రదేశ్లో సుమారు 7.6 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో సాగవుతున్న ఆక్వాకల్చర్.. 2.75 లక్షల మందికి పైగా రైతులకు ఉపాధి కల్పిస్తుంది. ఎగుమతి ఆధారిత రొయ్యల సాగుకు, ఆక్వాకల్చర్ వ్యవస్థకు భీమవరం వంటి క్లస్టర్లు వెన్నెముకగా నిలుస్తున్నాయి. మత్స్య రంగ బలోపేతానికి పీఎంఎంఎస్వై కింద రూ. 2405 కోట్లు, మత్స్య మౌలిక సదుపాయాల అభివృద్ధి నిధి కింద రూ. 450 కోట్ల నిధులు కేటాయించారు. అదేవిధంగా పీఎంఎంకేఎస్ఎస్వైలో భాగంగా ఎన్ఎఫ్డీపీలో 2.83 లక్షల రిజిస్ట్రేషన్లు జరిగాయి. ఆంధ్రప్రదేశ్ సుస్థిరతను, జీవనోపాధిని బలోపేతం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అనేక ప్రత్యేక చర్యలను కూడా అమలు చేస్తోంది. వాతావరణ మార్పులను తట్టుకోగల తీరప్రాంత మత్స్యకారుల గ్రామాల కార్యక్రమం కింద రూ,30 కోట్ల ప్రాజెక్టు వ్యయంతో 15 తీరప్రాంత గ్రామాలను అభివృద్ధి చేస్తున్నారు. అందులో ఇప్పటికే రూ. 7.5 కోట్లు విడుదలవ్వడమే కాకుండా పనులు కూడా ప్రారంభమయ్యాయి. సముద్ర వనరుల పరిరక్షణ కోసం రూ.50.22 కోట్ల వ్యయంతో 162 కృత్రిమ పగడపు దిబ్బల యూనిట్లకు ఆమోదం లభించగా, ఇప్పటివరకు 22 యూనిట్లను ఏర్పాటు చేశారు. గిరిజన ప్రాంతాల కోసం ధర్తీ ఆబా జనజాతీయ గ్రామ ఉత్కర్ష్ అభియాన్ కింద రూ. 4.73 కోట్ల విలువైన ప్రాజెక్టులకు ఆమోదం లభించింది. సాంప్రదాయ మత్స్యకారులకు రుణ సదుపాయం, బీమా సౌకర్యం, జీవనోపాధి మద్దతును మెరుగుపరిచేందుకు ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోంది. వీటితోపాటు సముద్రపు నాచు సాగు, జల్లల్లో పెంపకం, మత్స్య సహకార సంఘాలు, మత్స్య రైతు ఉత్పత్తిదారుల సంఘాల ఏర్పాటును ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది.
***
(రిలీజ్ ఐడి: 2252782)
సందర్శకుల సూచీ సంఖ్య : : 32