జల శక్తి మంత్రిత్వ శాఖ
ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లాలో ప్రజా భాగస్వామ్యంతో చేపట్టిన వర్షపు నీటి సంరక్షణ ద్వారా గ్రామాల్లో విప్లవాత్మక మార్పులు
నాడు పోస్టు చేయడమైనది:
09 APR 2026 3:06PM by PIB Hyderabad
జల్ సంచయ్ జన్ భాగీదారీ ప్రచారంలో భాగంగా భారత ప్రభుత్వ జలశక్తి మంత్రిత్వ శాఖ చేపట్టిన ప్రజా భాగస్వామ్యంతో వర్షపు నీటి సంరక్షణ కార్యక్రమం ద్వారా ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లాలో మురుగుమ్మి, మారెళ్ల, తంగెళ్ల గ్రామాలు ఆదర్శంగా నిలిచాయి. నీటి సంరక్షణ వల్ల ఆ ప్రాంతంలో భూగర్భ జలాలు పెరగటమే కాక, జీవనోపాధి మెరుగుపడి, వలసలు తగ్గిపోయాయి.
గతంలో ఈ గ్రామాల్లో తగినంత వర్షపాతం లేకపోవటం వల్ల భూగర్భ జలాలు తగ్గిపోవటంతో బోరుబావులు ఎండిపోయి నీటి ఎద్దడి ఏర్పడింది. దీనివల్ల వ్యవసాయం, ప్రజల జీవనోపాధికి ఇబ్బందులు తలెత్తాయి. గ్రామసభలు, ఇంటింటికీ అవగాహనా కార్యక్రమాలు, కళాజాతాలు, కార్యశాలలు, క్షేత్రస్థాయి ప్రదర్శనల ద్వారా ప్రజలను చైతన్యపరచటంతో పరిస్థితుల్లో మార్పు వచ్చింది. పొదుపుగా నీటి వినియోగం, పంటల ప్రణాళిక, భూగర్భ జలాలను ఉమ్మడిగా వినియోగించుకోవటం వంటి పద్ధతులను రైతులు, మహిళలు, యువత, స్థానిక సంస్థలు సమష్టిగా అవలంబించటం ద్వారా నీటి సంరక్షణ బాధ్యతను పెంపొందించుకున్నారు.
కొండ ప్రాంతం నుంచి లోయ వరకు అనే విధానాన్ని అనుసరిస్తూ.. వర్షపు నీటిని సేకరించి, నిల్వ చేసి, భూగర్భ జలాలను పెంచేందుకు ఈ గ్రామాలు పలు సంరక్షణ పద్ధతులను అవలంబించాయి. ఇంకుడు గుంతలు, వ్యవసాయ చెరువులు, విడతల వారీగా కందకాల ఏర్పాటు, ఇంటి పైకప్పులపై వర్షపు నీటి సేకరణ వ్యవస్థలు, చెరువుల పునరుద్ధరణ వంటి కీలక చర్యలు చేపట్టారు.
కీలక విజయాలు
మురుగుమ్మి: దాదాపు 8.11 లక్షల క్యూబిక్ మీటర్ల సామర్థ్యంతో నీటి సంరక్షణ కోసం 71 నిర్మాణాలను చేపట్టటం ద్వారా 264.5 హెక్టార్ల వ్యవసాయ భూమికి సాగునీరు అందుతుంది.
మారెళ్ల: సుమారు 10.04 లక్షల క్యూబిక్ మీటర్ల నిల్వ సామర్థ్యంతో నీటి సంరక్షణకు 53 నిర్మాణాలను చేపట్టారు. వీటి ద్వారా 220.5 హెకార్టల సాగు భూమికి నీరందటమే కాక, సుస్థిర వ్యవసాయానికి దోహదపడ్డాయి. చెరువులు, కుంటల పునరుద్ధరణ ద్వారా అదనంగా దాదాపు 5.95 లక్షల క్యూబిక్ మీటర్ల నీటి నిల్వ సామర్థ్యం పెరిగింది.
తంగెళ్ల: సుమారు 5.89 లక్షల క్యూబిక్ మీటర్ల నిల్వ సామర్థ్యంతో నీటి సంరక్షణకు 71 నిర్మాణాలను చేపట్టారు. తద్వారా 185.3 హెకార్ల సాగు భూమికి నీరందుతోంది. సంప్రదాయ జల వనరుల పునరుద్ధరణ ద్వారా మరో 3.98 లక్షల క్యూబిక్ మీటర్ల నిల్వ సామర్థ్యం పెరిగింది.
ప్రభావం
మెరుగైన భూగర్భ జలమట్టాలు: గృహ, వ్యవసాయ అవసరాలకు నీటి లభ్యతను మెరుగుపరచటం ద్వారా సుమారు 5,900 మందికి ప్రయోజనం చేకూరుతోంది.
వ్యవసాయ ఉత్పాదకత పెంపు: రక్షిత నీటి పారుదల సౌకర్యాల విస్తరణ ద్వారా అధిక సంఖ్యలో రైతు కుటుంబాల జీవనోపాధి మెరుగుపడింది.
పెరిగిన పాల ఉత్పత్తి: మెరుగైన నీటి లభ్యత పాడి పరిశ్రమకు ఊతమిచ్చింది. తద్వారా గ్రామీణ కుటుంబాలకు అదనపు ఆదాయం సమకూరుతోంది.
నేలలో తేమ పునరుద్ధరణ: భూసారం పెరగటం వల్ల స్థిరమైన, ప్రతికూల పరిస్థితులను తట్టుకోగల పంట సాగు పద్ధతులకు అవకాశం ఏర్పడింది.
ఉపాధి వలసల తగ్గుదల: జీవనోపాధి అవకాశాలు మెరుగుపడటంతో చాలా కుటుంబాలు స్థానికంగానే జీవనం సాగించగలుగుతున్నాయి.
గుర్తింపు
6వ జాతీయ జల అవార్డులు-2024లో దేశంలోనే రెండో ఉత్తమ గ్రామ పంచాయతీ అవార్డును మురుగుమ్మి గ్రామం గెలుచుకుంది. టాప్-30 గ్రామాల్లో ఒకటిగా మారెళ్ల గ్రామం ఎంపికైంది. జాతీయ స్థాయి గుర్తింపు కోసం తంగెళ్ల గ్రామం నామినేట్ అయింది. ప్రజా భాగస్వామ్యంతో చేపట్టిన నీటి సంరక్షణ పద్ధతుల ప్రభావాన్ని ఈ విజయాలు తెలియజేస్తాయి.
ముగింపు
జల వనరుల పట్ల సామాజిక బాధ్యతను పెంపొందించటంలో జల్ సంచయ్ జన్ భాగీదారీ విధానం ఎంత ప్రభావవంతమైనదో ఈ గ్రామాల్లోని మార్పు ద్వారా స్పష్టమవుతోంది. సుస్థిర జల నిర్వహణకు ఇతర ప్రాంతాల్లోనూ అనుసరించదగిన అద్భుతమైన నమూనాను ఈ కార్యక్రమం చాటిచెబుతోంది. దీర్ఘకాలిక నీటి భద్రతను సాధించటంలో ప్రజా భాగస్వామ్యం కీలకమని ఈ విజయం స్పష్టం చేస్తోంది.
(రిలీజ్ ఐడి: 2250482)
సందర్శకుల సూచీ సంఖ్య : : 48