అంతరిక్ష విభాగం
యువికాతో యువతకు సాధికారత, అంతరిక్ష రంగంలో ఉజ్వల భవిష్యత్తు: లోక్సభలో డాక్టర్ జితేంద్ర సింగ్ లిఖితపూర్వక సమాధానం
యువకా ద్వారా అంతరిక్ష రంగంలో ప్రతిభను ముందుగానే గుర్తించడంపై ప్రభుత్వం దృష్టి
1,320 మంది విద్యార్థులకు లబ్ధి.. అంతరిక్ష శాస్త్రంపై పెరుగుతున్న ఆసక్తికి ఇది నిదర్శనం: డాక్టర్ జితేంద్ర సింగ్
యువికా వంటి ప్రత్యేక కార్యక్రమాలతో యువతలో పెంపొందుతున్న శాస్త్రీయ దృక్పథం.. ప్రతిభ ఆధారిత ఎంపికతో ఈ కార్యక్రమంలో పారదర్శకతకు ప్రాధాన్యత: డా. జితేంద్ర సింగ్
నాడు పోస్టు చేయడమైనది:
01 APR 2026 5:34PM by PIB Hyderabad
దేశంలోని యువతలో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించేందుకు ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని కేంద్ర శాస్త్ర, సాంకేతిక, భూ విజ్ఞాన శాఖ, పీఎంఓ, సిబ్బంది వ్యవహారాలు, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్లు, అణుశక్తి. అంతరిక్ష శాఖల సహాయ మంత్రి (స్వతంత్ర) డాక్టర్ జితేంద్ర సింగ్ స్పష్టం చేశారు. పాఠశాల విద్యార్థులు అంతరిక్ష విజ్ఞాన రంగంలో వృత్తిని చేపట్టేలా ప్రోత్సహించడంలో ‘యువ విజ్ఞాని కార్యక్రమం’ (యువికా) కీలక పాత్ర పోషిస్తోందని ఆయన పేర్కొన్నారు.
పార్లమెంటు బడ్జెట్ సమావేశాల సందర్భంగా లోక్సభలో ఎంపీ శ్రీమతి అనితా నగర్సింగ్ చౌహాన్ అడిగిన ప్రశ్నకు మంత్రి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. విద్యార్థుల్లో చిన్న వయసులోనే అంతరిక్ష శాస్త్రంపై ఆసక్తిని పెంపొందించేలా ‘యువికా’ను రూపొందించినట్లు మంత్రి తెలిపారు.
దేశవ్యాప్తంగా 9వ తరగతి చదువుతున్న విద్యార్థులే లక్ష్యంగా ఈ కార్యక్రమం సాగుతోందని కేంద్రమంత్రి వివరించారు. అంతరిక్ష శాస్త్రం, సాంకేతికత, వాటి అన్వయాలపై విద్యార్థులకు ప్రాథమిక అవగాహన కల్పించడం ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశమని చెప్పారు. కేవలం నేర్చుకోవడమే కాకుండా, భవిష్యత్తులో అంతరిక్ష శాస్త్రాన్ని ఒక వృత్తిగా ఎంచుకునేలా విద్యార్థులను ప్రోత్సహించడంపై ప్రభుత్వం దృష్టి సారించిందని ఆయన తెలిపారు.
విద్యార్థుల ఎంపిక ప్రక్రియ గురించి మంత్రి వివరిస్తూ.. విద్యా అర్హతలను ఆన్లైన్లో పరిశీలించి, ఆ తరువాత ఆన్లైన్ క్విజ్ పోటీలో వారి ప్రతిభ ఆధారంగా విద్యార్థులను ఎంపిక చేస్తామని తెలిపారు. దరఖాస్తులను సరిగా ధ్రువీకరించిన తర్వాతే తుది ఎంపిక జరుగుతుందని, దీనివల్ల ఎంపిక ప్రక్రియ అత్యంత పారదర్శకగా, ప్రతిభ ప్రాతిపదికన సాగుతుందని స్పష్టం చేశారు.
ఇప్పటి వరకు మొత్తం 1,320 మంది విద్యార్థులు ‘యువికా’ ద్వారా ప్రయోజనం పొందారని మంత్రి వెల్లడించారు. అంతరిక్ష విజ్ఞాన రంగాలపై యువతలో రోజు రోజుకూ పెరుగుతున్న ఆసకక్తికి గణాంకాలే నిదర్శనమని ఆయన పేర్కొన్నారు.
సమ్మిళిత భాగస్వామ్యానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. ఈ కార్యక్రమం అందరికీ అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో ప్రత్యేక నిబంధనలను చేర్చినట్లు పేర్కొన్నారు. ముఖ్యంగా గ్రామీణ, మారుమూల ప్రాంతాల విద్యార్థుల కోసం 15 శాతం రిజర్వేషన్ కేటాయించినట్లు ఆయన తెలిపారు. దీనివల్ల దేశంలోని అన్ని ప్రాంతాల ప్రతిభావంతులకు సమాన అవకాశాలు లభిస్తాయని, సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు.
శాస్త్రీయంగా సాధికారత కలిగిన దేశాన్ని నిర్మించాలనే విస్తృత లక్ష్యానికి అనుగుణంగా యువికా వంటి కార్యక్రమాలను చేపట్టినట్లు మంత్రి తెలిపారు. చిన్న వయసులోనే ప్రతిభావంతులను గుర్తించి, వారిని తీర్చిదిద్దడం ద్వారా అంతరిక్ష రంగంలో దేశ సామర్థ్యాలను మరింత బలోపేతం చేయడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని ఆయన స్పష్టం చేశారు.
***
(రిలీజ్ ఐడి: 2247988)
సందర్శకుల సూచీ సంఖ్య : : 15