అంతరిక్ష విభాగం
అంతరిక్ష అంకుర సంస్థల కోసం సిద్ధమైన భారత తొలి ప్రత్యేక వెంచర్ క్యాపిటల్ ఫండ్
రూ.1,005 కోట్ల మూలధనంతో అంతరిక్ష వెంచర్ ఫండ్ ప్రారంభం... 2027 ఆర్థిక సంవత్సరం నుంచి పెట్టుబడులు ప్రారంభం: డాక్టర్ జితేంద్ర సింగ్
అంతరిక్ష స్టార్టప్ ఫండ్ కోసం సెబీ అనుమతి అనంతర లాంఛనాలు పూర్తి... పెట్టుబడి ప్రక్రియ త్వరలోనే ప్రారంభం: లోక్సభలో డాక్టర్ జితేంద్ర సింగ్ లిఖితపూర్వక సమాధానం
నాడు పోస్టు చేయడమైనది:
01 APR 2026 5:32PM by PIB Hyderabad
అంతరిక్ష రంగం కోసం కేటాయించిన భారత ప్రత్యేక వెంచర్ క్యాపిటల్ ఫండ్ స్థిరంగా పురోగమిస్తోందని, ఎంపిక చేసిన స్టార్టప్లలో 2026-27 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికం నుంచి పెట్టుబడులు ప్రారంభమవుతాయని భావిస్తున్నట్లు కేంద్ర శాస్త్ర సాంకేతిక, భూ విజ్ఞాన శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర హోదా), ప్రధానమంత్రి కార్యాలయం, సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్లు, అణు ఇంధనం, అంతరిక్ష విభాగాల సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు.
లోక్సభలో ఈ రోజు ఒక ప్రశ్నకు డాక్టర్ జితేంద్ర సింగ్ లిఖితపూర్వక సమాధానం ఇస్తూ, అభివృద్ధి చెందుతున్న భారత స్పేస్టెక్ వ్యవస్థను ప్రోత్సహించడానికి ఏర్పాటు చేసిన "అంతరిక్ష వెంచర్ క్యాపిటల్ ఫండ్" కీలకమైన సంస్థాగత యంత్రాంగాలతో ఇప్పుడు అందుబాటులోకి వచ్చిందని తెలిపారు.
అంతరిక్ష రంగం కోసం కేటాయించిన వెంచర్ క్యాపిటల్ ఫండ్ స్థితిగతులు, పెట్టుబడులు, లబ్ధిదారులు, రాబడి, ఉపాధి కల్పన గురించి శ్రీ బస్తిపాటి నాగరాజు ఈ ప్రశ్న అడిగారు.
సిడ్బీ వెంచర్ క్యాపిటల్ లిమిటెడ్ (ఎస్వీసీఎల్)ను ఇన్వెస్ట్మెంట్ మేనేజర్గా నియమిస్తూ ఈ నిధిని ఏర్పాటు చేసినట్లు డాక్టర్ జితేంద్ర సింగ్ పేర్కొన్నారు. ఈ ఫండ్ అక్టోబర్ 31, 2025న సెబీ వద్ద నమోదై, నవంబర్ 10, 2025 నాటికి రూ.1,005 కోట్ల మూలధనంతో ప్రాథమిక ప్రక్రియను పూర్తి చేసుకుందని వివరించారు.
రిజిస్ట్రేషన్ అనంతర పురోగతిని వివరిస్తూ, కస్టోడియన్ నియామకం, ప్రత్యామ్నాయ పెట్టుబడి నిధి (ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ - ఏఎల్ఎఫ్) యూనిట్ల జారీ కోసం డిపాజిటరీలతో రిజిస్ట్రేషన్, స్క్రీనింగ్, ఇన్వెస్ట్మెంట్ కమిటీల ఏర్పాటు వంటి అవసరమైన లాంఛనాలు పూర్తయ్యాయని మంత్రి పేర్కొన్నారు.
ప్రస్తుతం స్పేస్టెక్ స్టార్టప్ల మూల్యాంకనం జరుగుతోందని, ముందస్తు పెట్టుబడి కమిటీ ఆమోదం పొందిన తర్వాత ఇప్పటికే నాలుగు ప్రతిపాదనలు పురోగతిలో ఉన్నాయని డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. భారత స్పేస్టెక్ స్టార్టప్ వ్యవస్థ ఇంకా ప్రాథమిక దశలోనే ఉన్నందున చాలా స్టార్టప్లు సంస్థాగత పెట్టుబడి ప్రక్రియలకు అనుగుణంగా మారడానికి వ్యవస్థీకృత మార్గదర్శకత్వం అవసరమని ఆయన స్పష్టం చేశారు.
స్టార్టప్లు తమ డేటాను క్రమబద్ధీకరించుకోవడానికి, డాక్యుమెంటేషన్ను మెరుగుపరుచుకోవడానికి, కచ్చితత్వ పరిశీలన (డ్యూ డెలిజెన్స్) అవసరాలను తీర్చడానికి వారికి చేయూతను అందిస్తున్నట్లు మంత్రి తెలిపారు. స్టార్టప్లు సమర్థవంతంగా నిధులను పొందేలా, వారి ఆవిష్కరణలను విస్తరింపజేసేలా చేయడమే ఈ సులభతర విధానం ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు.
సమగ్ర మదింపు, థర్డ్-పార్టీ డ్యూ డెలిజెన్స్, డాక్యుమెంటేషన్ పూర్తి చేసిన తర్వాత మొదటి విడత నిధుల ఆమోదం, విడుదల 2027 ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచి మొదలు కావచ్చని డాక్టర్ జితేంద్ర సింగ్ విశ్వాసం వ్యక్తం చేశారు.
ప్రపంచవ్యాప్తంగా పోటీ పడగలిగే అంతరిక్ష వ్యవస్థను పెంపొందించడంలో ప్రభుత్వ నిబద్ధతను డాక్టర్ జితేంద్ర సింగ్ పునరుద్ఘాటించారు. ప్రైవేట్ రంగ భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి, ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి, ప్రపంచ అంతరిక్ష ఆర్థిక వ్యవస్థలో భారత్ ను అగ్రగామిగా నిలబెట్టడానికి ఇది ముఖ్యమైన కార్యక్రమమని ఆయన అన్నారు.
***
(రిలీజ్ ఐడి: 2247986)
సందర్శకుల సూచీ సంఖ్య : : 24