బొగ్గు మంత్రిత్వ శాఖ
భారతదేశ ఇంధన భద్రతకు, పారిశ్రామిక అభివృద్ధికి కోల్ గ్యాసిఫికేషన్ కీలకం: కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి
నాడు పోస్టు చేయడమైనది:
22 MAR 2026 8:29PM by PIB Hyderabad
భారత్ ఎలక్ట్రిసిటీ సమ్మిట్-2026 సందర్భంగా కేంద్ర బొగ్గు, గనుల మంత్రి జి. కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. భారతదేశ ఇంధన భద్రతను బలోపేతం చేయటానికి, దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించటానికి, పారిశ్రామిక వృద్ధికి మద్దతిచ్చేందుకు కోల్ గ్యాసిఫికేషన్ కీలకమని స్పష్టం చేశారు.
పారిశ్రామిక నేతలు, నిపుణులు, అంకుర సంస్థలు, పరిశోధకులు, విద్యార్థులు, విధాన రూపకర్తలను ఉద్దేశించి ప్రసంగిస్తూ.. శరవేగంగా విస్తరిస్తున్న భారత ఆర్థిక వ్యవస్థకు అభివృద్ధి, సుస్థిరతను సమన్వయం చేసే సమతుల్య ఇంధన విధానం అవసరమని కేంద్రమంత్రి అన్నారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేతృత్వంలో తయారీ రంగం, మౌలిక సదుపాయాల కల్పన, డిజిటల్ అనుసంధానత, ఆవిష్కరణల రంగాల్లో దేశం బలమైన వృద్ధిని కనబరుస్తోందని తెలిపారు.
భారతదేశంలో దాదాపు 400 బిలియన్ టన్నుల బొగ్గు నిల్వలున్నాయని, ప్రపంచంలోనే ఇవి అత్యధికమని కేంద్రమంత్రి వెల్లడించారు. దేశ ఇంధన అవసరాల్లో 55%, విద్యుత్ ఉత్పత్తిలో 74% వాటా బొగ్గుదని పేర్కొన్నారు. ఏటా బొగ్గు డిమాండ్ ఒక బిలియన్ టన్నుగా ఉందని, 2047 నాటికి ఇది పెరుగుతుందని అంచనా వేస్తున్నట్లు చెప్పారు. పెరుగుతున్న బొగ్గు ప్రాముఖ్యతను ఇది తెలియజేస్తుందన్నారు. 2070 నాటికి కర్బన ఉద్గార రహిత దేశంగా మారాలన్న లక్ష్యానికి భారత్ కట్టుబడి ఉందని తెలిపారు.
విప్లవాత్మక సాంకేతిక మార్పునకు కోల్ గ్యాసిఫికేషన్ కీలకమని, దీనిద్వారా బొగ్గును సిన్గ్యాస్గా మార్చవచ్చని వివరించారు. సిన్గ్యాస్ను స్వచ్ఛ ఇంధనం, ఎరువులు, హైడ్రోజన్ ఉత్పత్తికి ఉపయోగించవచ్చని తెలిపారు. ఈ విధానంతో స్వదేశీ వనరులను మరింత సమర్థవంతంగా, పర్యావరణహితంగా వినియోగించుకోవటమే కాక, దేశ ఆర్థిక సుస్థిరతను బలోపేతం చేయవచ్చన్నారు. ముడి చమురు దాదాపు 83%, సహజ వాయువు 50%, మెథనాల్, ఎరువులు 90% కిపైగా దిగుమతులపై భారత్ ఆధారపడుతున్న నేపథ్యంలో ఇంధన భద్రత దేశానికి వ్యూహాత్మక ప్రాధాన్యతగా మారిందని పేర్కొన్నారు.
కోల్ గ్యాసిఫికేషన్ను ప్రోత్సహించాలనే లక్ష్యంతో భారత ప్రభుత్వం.. నేషనల్ కోల్ గ్యాసిఫికేషన్ మిషన్ను ప్రారంభించింది. ఇందులో భాగంగా 2030 నాటికి 100 మిలియన్ టన్నుల బొగ్గును గ్యాసిఫికేషన్ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రభుత్వ, ప్రైవేట్ రంగ ప్రాజెక్టులకు చేయూతనిచ్చేందుకు రూ.8,500 కోట్ల ప్రోత్సాహక నిధిని కేటాయించింది. ఇప్పటికే ఈ రంగంలో భారీ ప్రాజెక్టులు ప్రారంభమవగా, రూ.64,000 కోట్లకు పైగా పెట్టుబడులు సిద్ధంగా ఉన్నాయి. గతంలో అందుబాటులోకి రాని బొగ్గు నిల్వలను వెలికితీయటం, పర్యావరణంపై ప్రభావాన్ని తగ్గించగల భూగర్భ కోల్ గ్యాసిఫికేషన్ (యూసీజీ) వంటి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాల ప్రాముఖ్యతను స్పష్టం చేశారు.
పరిశ్రమలు, విద్యా సంస్థలు, అంకుర సంస్థలు, పరిశోధనా సంస్థలు.. సమన్వయంతో పనిచేసే వ్యవస్థ కోసం కేంద్ర మంత్రి పిలుపునిచ్చారు. విద్యుత్, చమురు, గ్యాస్, ఎరువుల వంటి రంగాలకు కోల్ గ్యాసిఫికేషన్ విస్తరించిందని తెలిపారు. ఈ రంగంలో ముందస్తు భాగస్వామ్యం, పెట్టుబడుల ప్రోత్సాహానికి సరళమైన ఆమోద ప్రక్రియలు, సహాయక విధానాలు, ప్రోత్సాహకాలను అందించేందుకు భారత ప్రభుత్వం నిబద్ధతతో ఉందని ఆయన స్పష్టం చేశారు.
ఆవిష్కరణలు, స్వదేశీ సాంకేతికత అభివృద్ధి, సమన్వయ ప్రయత్నాలతో ఇంధన భద్రత, సుస్థిరత, స్వావలంబన దిశగా అడుగులు వేస్తూ క్లీన్ కోల్ సాంకేతికతలో ప్రపంచ నాయకుడిగా భారత్ ఎదుగుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
***
(రిలీజ్ ఐడి: 2243877)
సందర్శకుల సూచీ సంఖ్య : : 9