బొగ్గు మంత్రిత్వ శాఖ
దేశీయ బొగ్గు ఉత్పత్తిని వేగవంతం చేసేందుకు వాటాదారులతో బొగ్గు మంత్రిత్వ శాఖ సమావేశం
నాడు పోస్టు చేయడమైనది:
17 MAR 2026 6:04PM by PIB Hyderabad
భారత ఇంధన భద్రతను బలోపేతం చేయడానికి దేశీయంగా బొగ్గు ఉత్పత్తిని పెంచడం, వేగంగా కొత్త గనులను అభివృద్ధి చేయడం, వాటిని కార్యాచరణలోకి తీసుకురావడం వంటి వ్యూహాలపై చర్చించడానికి బొగ్గు మంత్రిత్వ శాఖ నేడు కీలక సమావేశం నిర్వహించింది.‘‘విధాన సంస్కరణల దృష్ట్యా దేశీయ బొగ్గు ఉత్పత్తిని వేగవంతం చేయడం’’ అనే అంశంపై జరిగిన ఈ ఉన్నత స్థాయి సమావేశంలో కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు, బొగ్గు రంగానికి చెందిన కీలక భాగస్వాములు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమానికి కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి శ్రీ జీ కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బొగ్గు మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ విక్రమ్ దేవ్ దత్ స్పష్టతతో, లక్ష్యంతో చర్చలను నిర్వహిస్తూ వ్యూహాత్మక మార్గదర్శకత్వం అందించారు. ఇది మంత్రిత్వ శాఖ సంస్కరణాధారిత, భాగస్వాముల కేంద్రీకృత విధానాన్ని ప్రతిబింబించింది. ఈ చర్చల్లో బొగ్గు మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారులు, ప్రైవేటు రంగ ప్రతినిధులు, పారిశ్రామిక వేత్తలు, బొగ్గు వ్యవస్థకు చెందిన ఇతర భాగస్వాములు పాల్గొన్నారు.
ఈ సమావేశంలో కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి శ్రీ జీ కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. ఆత్మనిర్భర్ భారత్ దార్శనికతను సాధించడానికి భారత్ కేవలం చిన్న మార్పులకే పరిమితం కాకుండా భారీ సంస్కరణల దిశగా వెళ్లాలని పేర్కొన్నారు. “సంస్కరణ, పనితీరు, పరివర్తన, సమాచారం” మార్గదర్శక మంత్రాన్ని ప్రస్తావిస్తూ.. శాస్త్రీయ పద్ధతిలో గనులను మూసివేయడంపై ప్రత్యేక దృష్టి సారించి, అన్వేషణ, వేలం, అనుమతులు, కార్యకలాపాలు, ఫైనాన్సింగ్తో సహా మొత్తం బొగ్గు రంగంలో నిరంతర, సమగ్ర సంస్కరణల అవసరం ఉందని తెలిపారు. ఉత్పత్తిని పెంచడానికి, సరఫరా సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి, గనుల అభివృద్ధి నుంచి మూసివేత వరకు ఎటువంటి ఆటంకాలు లేకుండా పనులు సాగేలా చూడటానికి, అడ్డంకులను క్రమపద్ధతిలో తొలగించాలని కేంద్రమంత్రి స్పష్టం చేశారు.
వాటాదారులతో క్రమం తప్పకుండా జరిపే సంప్రదింపులు.. అభిప్రాయాలు, సూచనలను స్వీకరించడానికి కీలకమని కేంద్రమంత్రి తెలిపారు. భాగస్వాములతో బాధ్యతాయుతంగా, అందరినీ కలుపుకొని ముందుకు సాగడానికి ప్రభుత్వం ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు. దేశంలో పుష్కలంగా ఉన్న బొగ్గు నిల్వలను ఉపయోగించుకుంటూ బొగ్గు గాసిఫికేషన్ ను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని అన్నారు. రాబోయే ఏళ్లలో బొగ్గు ఉత్పత్తిలో ప్రైవేటు రంగ భాగస్వామ్యం గణనీయంగా పెరుగుతుందని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. ఇంధన భద్రత పట్ల ప్రభుత్వ నిబద్ధతను పునరుద్ఘాటిస్తూ..సమన్వయ ప్రయత్నాలు, నిరంతర విధానపరమైన మద్దతు ద్వారా బొగ్గు ఉత్పత్తిని వేగవంతం చేయాలని పిలుపునిచ్చారు.
కేంద్ర బొగ్గు శాఖ కార్యదర్శి శ్రీ విక్రమ్ దేవ్ మాట్లాడుతూ.. దేశం ‘వికసిత్ భారత్ 2047’ దార్శనికత వైపు పయనిస్తున్న తరుణంలో నిరంతర విధానపరమైన సంస్కరణలు బొగ్గు రంగాన్ని మరింత పారదర్శకమైన, పోటీతత్వంతో కూడిన, సమర్థవంతమైన వ్యవస్థగా మార్చాయని తెలిపారు. ఈ సంస్కరణలు వ్యాపార సౌలభ్యాన్ని బలోపేతం చేశాయని, నియంత్రణ స్పష్టతను పెంచాయని, మొత్తం బొగ్గు రంగంలో వేగవంతమైన వృద్ధి, అభివృద్ధికి అనుకూలమైన వాతావరణాన్ని ఏర్పరిచాయని పేర్కొన్నారు.
వాణిజ్య బొగ్గు తవ్వకం, సింగిల్ విండో క్లియరెన్స్ వ్యవస్థ, డిజిటల్ సంస్కరణలు వంటి చారిత్రాత్మక కార్యక్రమాలు జాతీయ లక్ష్యాలను ముందుకు తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషించాయని ఆయన చెప్పారు. ఈ చర్యలు సంస్థాగత వ్యవస్థను బలోపేతం చేశాయని, ప్రైవేటు రంగ భాగస్వామ్యాన్ని ప్రోత్సహించాయని, గనుల కార్యకలాపాలను వేగవంతం చేశాయని, వనరులను వెలికితీతను సులభతరం చేశాయని అన్నారు. ఈ ప్రయత్నాలు దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడానికి, పరిశ్రమల సహకారాన్ని పెంపొందించడానికి, ఆత్మనిర్భర్ భారత్ దార్శనికతను ముందుకు తీసుకెళ్లడానికి దోహదపడుతున్నాయని అన్నారు.
‘విధాన సంస్కరణలు, దేశీయ బొగ్గు ఉత్పత్తిని వేగవంతం చేయడం’ అనే అంశంపై బొగ్గు మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి శ్రీమతి రూపిందర్ బ్రార్ వివరణాత్మక ప్రదర్శన ఇచ్చారు. ఈ ఆర్థిక సంవత్సరంలో క్యాప్టివ్, వాణిజ్య గనుల నుంచి బొగ్గు ఉత్పత్తి మొదటిసారిగా 200 మిలియన్ టన్నులను దాటిందని శ్రీమతి బ్రార్ పేర్కొన్నారు. 2021 నుంచి 2025 వరకు క్యాప్టివ్, వాణిజ్య గనుల నుంచి బొగ్గు ఉత్పత్తి దాదాపు 30 శాతం వార్షిక వృద్ధి రేటుతో పెరిగిందని ఆమె వివరించారు.
గనుల కార్యకలాపాలను త్వరగా కార్యాచరణలోకి తీసుకురావడం కోసం బొగ్గు మంత్రిత్వ శాఖ చేపట్టిన విధానపరమైన సంస్కరణల గురించి ఆమె భాగస్వాములకు వివరించారు. అన్వేషణ, జీఆర్ తయారీని సులభతరం చేయడం, గనుల తవ్వకాల ప్రణాళిక ఆమోదాన్ని వేగవంతం చేయడం, పర్యావరణ, అటవీ అనుమతుల ప్రక్రియను సరళీకరించడం, గనుల ప్రారంభ అనుమతుల కోసం అనేక సంస్కరణలు ప్రవేశపెట్టినట్లు ఆమె పేర్కొన్నారు. ప్రతి సంస్కరణ గురించి వివరణాత్మక గణాంకాలను అందించారు. బొగ్గు వనరుల స్థిరమైన, సమర్థవంతమైన వినియోగాన్ని నిర్ధారించే ఉద్దేశంతో.. ప్రోత్సాహకాలు, సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడం, నిర్వహణ సామర్థ్యాన్ని పెంచడంపై దృష్టి సారిస్తూ భూగర్భ బొగ్గు తవ్వకాలను ప్రోత్సహించే చర్యలను కూడా వివరించారు.
అనంతరం జరిగిన ముఖాముఖి చర్చలో భాగస్వాములు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. అభివృద్ధి చెందుతున్న విధానపరమైన నిబంధనలు, నిర్వహణ సవాళ్లు, బొగ్గు ఉత్పత్తిని వేగవంతం చేసే అవకాశాల గురించి విధానకర్తలు, పరిశ్రమ ప్రతినిధులు, నిపుణుల మధ్య నిర్మాణాత్మక చర్చకు ఈ సంప్రదింపులు ఒక వేదికగా నిలిచాయి. ప్రభుత్వం, పరిశ్రమల మధ్య సహకారాన్ని బలోపేతం చేయడం, గనుల తవ్వక పద్ధతుల్లో ఆవిష్కరణలను ప్రోత్సహించడం, దేశ బొగ్గు రంగంలో దీర్ఘకాలిక వృద్ధి, స్థిరత్వానికి మద్దతుగా విధాన సంస్కరణలను సమర్థవంతంగా అమలు చేయడం వంటి అంశాలపై సమష్టి అభిప్రాయంతో ఈ చర్చలు ముగిశాయి.
దేశీయ బొగ్గు ఉత్పత్తిని వేగవంతం చేయడం, దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడం, ఇంధన రంగంలో ఆత్మనిర్భర్ భారత్ దార్శనికతను బలోపేతం చేయడం వంటి ఉమ్మడి లక్ష్యం దిశగా భాగస్వాములు తమ అభిప్రాయాలను పంచుకోవడానికి, తమ ప్రయత్నాలను సమన్వయం చేసుకోవడానికి ఈ సమావేశం ఒక గొప్ప వేదికగా మారింది. స్థిరమైన, బాధ్యతాయుతమైన గనుల తవ్వక పద్ధతులను అనుసరిస్తూనే దేశంలో పెరుగుతున్న ఇంధన అవసరాలను తీర్చగల ఆధునిక, సమర్థవంతమైన, భవిష్యత్తుకు సిద్ధంగా ఉన్న బొగ్గు రంగాన్ని నిర్మించడంలో ప్రభుత్వ నిబద్ధతను ఈ చర్చలు తెలియజేశాయి.
***
(రిలీజ్ ఐడి: 2241499)
సందర్శకుల సూచీ సంఖ్య : : 10