వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
2025-26 సంవత్సరానికి స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల్లో భారత్ విజయాలు
నాడు పోస్టు చేయడమైనది:
06 MAR 2026 8:00PM by PIB Hyderabad
అంతర్జాతీయ వాణిజ్య యవనికపై కొత్త వర్ణాలను ఆవిష్కరిస్తూ, ఈ రంగానికి సరికొత్తగా దిశానిర్దేశం చేస్తూ, ఆధునిక - భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా నవతరం స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలకు రూపకల్పన చేస్తూ... గడిచిన దశాబ్ద కాలంలో అత్యంత నిశ్చయాత్మక, ఆత్మవిశ్వాసం కలిగిన శక్తిగా భారత్ అవతరించింది.
గడిచిన కొన్ని సంవత్సరాలుగా భారత్ తన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పంద వ్యవస్థను స్థిరంగా విస్తరిస్తూ.. ప్రస్తుతం 38 దేశాలతో 9 కీలక ఒప్పందాల స్థాయికి చేరింది. 2021లో భారత్ - మారిషస్ ఒప్పందంతో ప్రారంభమైన ఈ ప్రయాణం.. 2022 మే నెలలో భారత్ -యూఏఈ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందంతో ముందుకు సాగింది. 2022 డిసెంబరులో భారత్ - ఆస్ట్రేలియా ఆర్థిక, వాణిజ్య ఒప్పందం అమల్లోకి వచ్చింది. 2024 మార్చి 10న భారత్ సంతకం చేసిన ఈఎఫ్టీఏ వాణిజ్య ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం.. 2025 అక్టోబరు 1న అమల్లోకి వచ్చింది. అనంతరం 2025 జూలైలో భారత్ - యూకే సమగ్ర ఆర్థిక, వాణిజ్య ఒప్పందంపైనా, అలాగే 2025 డిసెంబరులో భారత్ - ఒమన్ సమగ్ర ఆర్థిక, వాణిజ్య ఒప్పందంపైనా సంతకాలు జరిగాయి. ఈ క్రమంలో 2025 డిసెంబరు22న భారత్ – న్యూజిలాండ్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్నీ, అనంతరం 2026 జనవరి 27న భారత్ - ఐరోపా యూనియన్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్నీ ప్రకటించారు. 2026 ఫిబ్రవరి 7న అమెరికాతో మధ్యంతర ఒప్పందానికి సంబంధించిన ముసాయిదాను ఖరారు చేసి.. అంతర్జాతీయ వాణిజ్య రంగంలో భారత్ తన ఉనికిని మరింత సుస్థిరం చేసుకుంది.
భారత్ కుదుర్చుకున్న ఈ ఒప్పందాలన్నీ ఎంతో విశిష్టమైనవి. మన దేశ మార్కెట్ పరిమాణాన్నీ, మన ఆర్థిక సామర్థ్యాన్నీ, 140 కోట్ల భారతీయుల సామర్థ్యంపై ప్రపంచానికి ఉన్న నమ్మకానికీ లభించిన గుర్తింపు ఇది.
ఈ వాణిజ్య ఒప్పందాలు మన దేశ రైతుల ఉత్పత్తులకు అభివృద్ధి చెందిన దేశాల మార్కెట్లలో ప్రవేశం కల్పిస్తాయి. వస్త్రాలు, తోలు వస్తువులు, హస్తకళలను ఎగుమతి చేసే మహిళా పారిశ్రామికవేత్తలకు, ఎంఎస్ఎంలకు వెన్నుదన్నుగా నిలుస్తూ సరికొత్త పోటీతత్వాన్ని వారిలో నింపుతాయి. అలాగే భారతీయ యువతకు, విద్యార్థులకు, ఐటీ నిపుణులూ, షెఫ్లూ, యోగా శిక్షకుల వంటి నిపుణులకు విదేశాల్లో చదువుకోవడానికి, ఉపాధి పొందడానికి, భవిష్యత్తును నిర్మించుకోవడానికి ఈ ఒప్పందాలు సుగమం చేస్తున్నాయి. ఈ దిశగా విద్యానంతర ఉద్యోగ వీసా, సామాజిక భద్రతపరంగా ఉపశమనం కల్పించడం వంటి స్పష్టమైన మార్గాలున్నాయి. దీనితోపాటు సేంద్రియ ఉత్పత్తులకూ, ఆయుష్ వంటి సంప్రదాయ ఆరోగ్య వ్యవస్థలకూ ఇవి ఊతమిస్తున్నాయి. ప్రపంచ ఏఐ రంగానికి దన్నుగా నిలుస్తున్న డిజిటల్ సేవలకూ ఇవి ఎంతగానో ఉపయోగపడుతాయి. ఈ ఒప్పందాలు పెట్టుబడులను ఆకర్షించడమే కాకుండా.. మన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పంద భాగస్వాములను దేశాభివృద్ధిలో భాగస్వాములుగా చేస్తున్నాయి.
భారత్ తన జాతీయ ప్రాధాన్యమైన ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యానికి కట్టుబడి.. పారదర్శకత, సమతౌల్యంతో ఈ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలపై చర్చలు జరిపింది. పాడి పరిశ్రమ, వ్యవసాయం, రైతులు, దేశీయ పరిశ్రమల వంటి సున్నితమైన రంగాల ప్రయోజనాలను కాపాడడమే కాకుండా.. వాటి మార్కెట్ లభ్యతకు భంగం కలగకుండా జాగ్రత్తలు తీసుకుంది. వాణిజ్య రంగంలో ఒక నూతన విప్లవాత్మక యుగానికి నాంది పలికేలా.. పూర్తి సామర్థ్యంతో, ఆత్మవిశ్వాసంతో చర్చలు జరుపుతూ.. మన ప్రజల ఆకాంక్షలను భారత్ నెరవేరుస్తోంది. వికసిత భారత్ @2047 దిశగా భారత్ వేగంగా పురోగమిస్తోంది.
2025-26లో సంతకం చేసిన లేదా ప్రకటించిన ఒప్పందాల ముఖ్యాంశాలను కింది లింక్లో చూడొచ్చు: https://www.commerce.gov.in/wp-content/uploads/2026/03/FTAsachievement.pdf
***
(రిలీజ్ ఐడి: 2236238)
సందర్శకుల సూచీ సంఖ్య : : 19