శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
కార్ నికోబార్లో మత్స్యకారుల జీవితాలను మారుస్తున్న జీపీఎస్
నాడు పోస్టు చేయడమైనది:
03 MAR 2026 2:27PM by PIB Hyderabad
కార్ నికోబార్లోని మత్స్యకారులకు పరిచయం చేసిన గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ (జీపీఎస్) పరికరాలు, చేపల వేటను మరింత సమర్థవంతంగా, లక్ష్యబద్ధంగా మార్చాయి. దీనివల్ల స్థానిక ప్రజలకు చేపల సరఫరా స్థిరంగా అందుతోంది.
ఫలితంగా తాజా ప్రోటీన్, ముఖ్యమైన పోషకాల వినియోగం పెరిగింది. టీటాప్ గ్రామానికి చెందిన శ్రీ జునైద్, చుచుచా గ్రామానికి చెందిన శ్రీ అబ్దుల్ సత్తార్ వంటి వారు తాము పట్టిన చేపలను మార్కెట్లలో విక్రయించడం ప్రారంభించి, తమ ఆదాయాన్ని పెంచుకున్నారు.
నికోబారీ సమాజాల జీవితం, జీవనోపాధి పూర్తిగా సాంప్రదాయ చేపల వేటపైనే ఆధారపడి ఉంటుంది. వారి వేట పద్దతులు అనుభవంతో మెరుగుపడినప్పటికీ.. సముద్రపు అనూహ్య వాతావరణం, సరైన నావిగేషన్ పరికరాలు లేకపోవడం వల్ల గతంలో ఇబ్బందులు ఎదురయ్యేవి. వాతావరణ మార్పుల వల్ల తరచుగా పడవలు దారి తప్పిపోవడం, ఉత్పాదకత తగ్గడం, కొన్నిసార్లు ప్రాణాపాయం కూడా సంభవించేది. ఇప్పుడు జీపీఎస్ సహాయంతో ఈ ఇబ్బందులు తగ్గాయి.
ఈ సమస్యలను అధిగమించడానికి కేంద్ర ప్రభుత్వ శాస్త్ర, సాంకేతిక విభాగం పరిధిలోని సీడ్ డివిజన్ కార్యక్రమం కింద సెంట్రల్ ఐలాండ్ టెక్నలాజికల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ జీపీఎస్ పరికరాలను ప్రవేశపెట్టింది. స్థానిక సముద్ర వాతావరణానికి, చేపల వేట పద్ధతులకు అనుగుణంగా ఈ పరికరాలను రూపొందించారు.
మత్స్యకారులు జీపీఎస్ నావిగేషన్, ఆధునిక చేపల వేట పద్ధతులను సమర్థవంతంగా ఉపయోగించేలా వారికి ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. మత్స్యకారుల అవసరాలను, వారు ఎదుర్కొంటున్న సవాళ్లను అంచనా వేయడానికి సర్వేలు నిర్వహించి, ఈ సాంకేతికతను వారు సులభంగా స్వీకరించేలా చేశారు. గిరిజన మండలి ద్వారా ఈ సాంకేతిక వినియోగాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించారు.
జీపీఎస్ సాంకేతికత ప్రవేశ పెట్టడం ద్వారా మత్స్యకారులు చేపలు ఎక్కువగా ఉండే ప్రాంతాలను గుర్తించే విధానంలో విప్లవాత్మక మార్పు వచ్చింది. దీనివల్ల వారు తక్కువ సమయంలోనే సరైన ప్రాంతాలకు చేరుకోగలుగుతున్నారు. ఈ పరికరాల సహాయంతో చేపలు పట్టే సామర్థ్యం గణనీయంగా పెరిగింది. ఇది వారి కుటుంబాలకు, స్థానిక సమాజానికి మరింత పోషకవిలువలు కలిగిన ఆహారం, అధిక ఆదాయం అందుబాటులోకి రావడానికి దోహదపడింది.
మత్స్యకారులకు అండగా ఉండేందుకు కార్ నికోబార్ దీవిలో తీరప్రాంత మత్స్య సమాచార కేంద్రాన్ని స్థాపించారు. దీని ద్వారా మత్స్యకారులకు అవసరమైన సమాచారం అందుతుంది. కార్ నికోబార్లోని గిరిజన మత్స్యకారులకు మొత్తం 5 జీపీఎస్ పరికరాలను అందించారు. మరో 5 పరికరాలను మత్స్యకారుల సాధారణ వినియోగం కోసం కేటాయించారు.
ఈ ప్రయత్నాల ఫలితంగా రోజువారీ చేపల వేట పరిమాణంలో గణనీయమైన పెరుగుదల నమోదైంది. సరైన నావిగేషన్, చేపలు ఎక్కువగా ఉండే ప్రాంతాలను ఖచ్చితంగా గుర్తించడం వల్ల చేపల వేటలో అద్భుతమైన ఫలితాలు వచ్చాయి. మత్స్యకారులు సముద్రంలో గడిపే సమయం తగ్గినా వారి రోజువారీ దిగుబడి సగటున సుమారు 168 శాతం పెరిగింది.
చేపల లభ్యత పెరగడం వల్ల కుటుంబాలు, సమాజంలో పోషకాహార వినియోగం మెరుగుపడింది. ఆదాయం పెరగడంతో వివిధ రకాల ఆహార పదార్థాలను సులభంగా పొందగలుగుతున్నారు, తద్వారా ఆరోగ్యం, పోషకాహారం రెండూ మెరుగవుతున్నాయి.
మరిన్ని వివరాలకు డాక్టర్ ఆర్ కిరుబా శంకర్ను rkirubasankar[at]gmail[dot]com ద్వారా సంప్రదించవచ్చు.

***
(రిలీజ్ ఐడి: 2235033)
సందర్శకుల సూచీ సంఖ్య : : 78