గృహ నిర్మాణం మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ
ట్రెండ్ సృష్టికర్తగా తిరుపతి వ్యర్థాలు
నాడు పోస్టు చేయడమైనది:
20 FEB 2026 4:51PM by PIB Hyderabad
స్వచ్ఛ భారత్ మిషన్- అర్బన్ 2.0 కింద, తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ తన సమగ్ర అప్సైక్లింగ్ కార్యక్రమం ద్వారా వర్తుల ఆర్థిక వ్యవస్థలో స్ఫూర్తిదాయకంగా నిలిచింది. ఇక్కడి వ్యర్థాలు తిరిగి కొత్త ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నాయి. స్వచ్ఛ్ ఆదత్ సే స్వచ్ఛ్ భారత్ అనే విశ్వాసం మార్గనిర్దేశంలో ఈ కార్యక్రమం స్వచ్ఛత, కరుణ, సృజనాత్మకతలను మిళితం చేసి పరిశుభ్రమైన, హరిత నగరాన్ని నిర్మించింది.
అప్సైక్లింగ్ భావన... అంటే వ్యర్థాలను పల్లపు ప్రాంతాలను నింపేందుకు ఉపయోగించడానికి బదులుగా అధిక విలువ కలిగిన ఉత్పత్తులుగా మార్చడం ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశం. ఈ దార్శనికతను ఆచరణీయంగా, అందరి భాగస్వామ్యం పొందేలా చేయడం కోసం తిరుపతి నగరం ప్రత్యేకంగా రూపొందించిన అప్సైక్లింగ్ డ్రాప్ బాక్స్లను ప్రవేశపెట్టింది. ఇవి శాశ్వత ఆర్ఆర్ఆర్ కేంద్రాలతో సజావుగా అనుసంధానమై ఉంటాయి.
ఈ డ్రాప్ బాక్స్లు పాత పుస్తకాలు, బట్టలు, పాదరక్షల కోసం ప్రత్యేక అరలను కలిగి ఉంటాయి. తొలి స్థాయిలోనే ఇవి 100 శాతం వేర్వేరుగా అవుతాయి. ఇది మలి అంచెల్లో వేరు చేయాల్సిన అవసరాన్ని తొలగించి, వస్తువుల నాణ్యతను కాపాడుతుంది. పౌరులు వ్యర్థాల విషయంలో బాధ్యతాయుతంగా వ్యవహరించడాన్ని సులభతరం చేస్తుంది. ఆర్డబ్ల్యూఏలు, అపార్ట్మెంట్ కాంప్లెక్సులు, గేటెడ్ కమ్యూనిటీల్లో వ్యూహాత్మకంగా ఏర్పాటు చేసిన ఈ డ్రాప్ బాక్స్లు క్రమంగా పునర్వినియోగ వస్తువులు అధికంగా పొందే అవకాశమున్న ప్రాంతాల్లోకి విస్తరిస్తాయి. సేకరణ పరిమాణం, నాణ్యత రెండింటినీ పెంచుతాయి. ప్రత్యేక వాహనాల ద్వారా వారానికి ఒకసారి చొప్పున సేకరణ వ్యవస్థ ఆర్ఆర్ఆర్ కేంద్రాలకు ఆ వ్యర్థాలను సజావుగా రవాణా చేస్తుంది.
ఆర్ఆర్ఆర్ కేంద్రాల్లో ఈ వ్యర్థాలను ఉపయోగించదగినవి, ఉపయోగించలేనివిగా వర్గీకరిస్తారు. మంచి స్థితిలో ఉన్న వ్యర్థాలు అర్థవంతమైన ఉత్పత్తులుగా రూపొందుతాయి. బట్టలు, పాదరక్షలను వృద్ధాశ్రమాలు, అనాథాశ్రమాలు, నిరాశ్రయులు, ఆర్థికంగా వెనకబడిన వర్గాలకు పంపిణీ చేస్తారు. ప్రభుత్వ, మున్సిపల్ పాఠశాలల్లో లైబ్రరీలను ఏర్పాటు చేయడం ద్వారా విద్యార్థుల్లో పఠన అలవాట్లను, అభ్యాసాన్ని పెంపొందించడానికి ఈ పుస్తకాలు సహాయపడతాయి.
పాక్షికంగా పాడయిన వస్తువులనూ పారవేయరు. దుస్తులను స్వయం సహాయక బృందాల సభ్యులకు అందజేస్తారు. వారు జౌళి మంత్రిత్వ శాఖ, ముంబయిలోని జౌళి కమిటీల మద్దతుతో నైపుణ్య శిక్షణ పొంది... వాటిని సంచులు, డోర్మ్యాట్ల వంటి పర్యావరణ అనుకూల ఉత్పత్తులుగా మారుస్తారు. స్థిరమైన జీవనోపాధినీ పొందుతారు. పాదరక్షలను స్థానికంగా మరమ్మతులు చేసి తిరిగి పంపిణీ చేస్తారు, అలాగే రీసైక్లింగ్ కోసం బెంగళూరులోని అప్సైక్లింగ్ యూనిట్కూ పంపుతారు.
ఉపయోగించిన దుస్తులను స్వయం సహాయక సంఘాల ద్వారా విలువ ఆధారిత ఉత్పత్తులుగా మారుస్తున్నారు. వీటిలో 275 డోర్మ్యాట్లు, 1,025 ఫుట్ మ్యాట్లు, 2,500 క్లాత్ బ్యాగులు, 0.5 టన్నుల ఆటోమొబైల్ క్లీనింగ్ క్లాత్లు ఉన్నాయి. ఈ ఉత్పత్తులు బహిరంగ మార్కెట్లో విజయవంతంగా అమ్ముడవుతున్నాయి. జీవనోపాధికి మద్దతునిస్తున్నాయి. నిరంతర వ్యర్థాల నిర్వహణనూ ప్రోత్సహిస్తున్నాయి. తిరుపతి నగరం ఈ వర్తుల ఆర్థిక విధానం ద్వారా నగరంలోని మున్సిపల్ పాఠశాలల్లో లైబ్రరీలను బలోపేతం చేస్తూ, యువ మనస్సులలో అభ్యసన సంస్కృతిని పెంపొందిస్తోంది. పాత పుస్తకాలకు మరో జీవితాన్ని ఇస్తున్నారు. అదే సమయంలో నిరుపయోగంగా ఉన్న పాదరక్షలను పునర్వినియోగం కోసం అధీకృత పాదరక్షల కర్మాగారాలకు పంపుతారు. సుస్థిరతను, వనరుల సామర్థ్యాన్ని ప్రోత్సహిస్తూ వ్యర్థాలను ఆర్థిక విలువగా మారుస్తున్నారు.
ఉత్సాహభరితమైన ప్రజా భాగస్వామ్యంతో ఈ కార్యక్రమం పల్లపు ప్రాంతాలను నింపే వ్యర్థాలను తగ్గించింది. సామాజిక సంక్షేమాన్ని బలోపేతం చేసింది. స్వయం సహాయక సంఘాలకు సాధికారితనిచ్చింది. పౌరుల్లో పర్యావరణం పట్ల బాధ్యతను పెంపొందించింది. ఈ ఆలోచనాత్మక, సమగ్ర విధానం ద్వారా తిరుపతి నగరం చెత్త రహితంగా మారే దిశగా క్రమంగా పురోగమిస్తోంది. పరిశుభ్రమైన అలవాట్లు జీవన విధానంగా మారినప్పుడు నగరాలు వ్యర్థాలను నిర్వహించడం మాత్రమే కాదు... వాటిని పూర్తిగా మార్చేస్తాయని ఈ కార్యక్రమం నిరూపిస్తోంది.
***
(రిలీజ్ ఐడి: 2231069)
సందర్శకుల సూచీ సంఖ్య : : 5