గనుల మంత్రిత్వ శాఖ
రెండో విడత అన్వేషణ లైసెన్స్ బ్లాకులను ప్రారంభించిన కేంద్ర మంత్రి శ్రీ జీ. కిషన్ రెడ్డి
వికసిత్ భారత్ 2047 లక్ష్య సాధనలో పారదర్శకమైన అన్వేషణ నమూనానే కీలకం: శ్రీ జీ. కిషన్ రెడ్డి
నాడు పోస్టు చేయడమైనది:
12 FEB 2026 5:21PM by PIB Hyderabad
ఖనిజ అన్వేషణ వ్యవస్థను బలోపేతం చేసే దిశగా మరో కీలక అడుగు వేస్తూ కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి శ్రీ జీ. కిషన్ రెడ్డి ఈ రోజు ఢిల్లీలో రెండో విడత అన్వేషణ లైసెన్స్ (ఈఎల్) బ్లాకుల వేలాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ దేశీయంగా అన్వేషణ ప్రక్రియను వేగవంతం చేయాలని అన్నారు. ప్రభుత్వ సంస్థలతో పాటు ప్రైవేట్ రంగం కూడా ఇందులో పెద్ద ఎత్తున భాగస్వామ్యం కావాలని ఆయన పిలుపునిచ్చారు. తద్వారా ఇతర దేశాల నుంచి ఖనిజాల దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించాల్సిన అవసరం ఉందని ఆయన ప్రధానంగా చెప్పారు. దేశంలోని అన్వేషించని ఖనిజ నిక్షేపాలను వెలికితీసేందుకు ఒక వ్యవస్థీకృత, పారదర్శక, సాంకేతికతతో కూడిన అన్వేషణ విధానాన్ని రూపొందించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన పునరుద్ఘాటించారు.
కీలక ఖనిజాల వ్యూహాత్మక ప్రాముఖ్యతను ప్రధానంగా ప్రస్తావించిన కేంద్ర మంత్రి.. 'వికసిత్ భారత్ 2047' దార్శనికతను సాధించడం, ఖనిజ రంగంలో స్వయం సమృద్ధిని పెంపొందించడంలో పటిష్ఠమైన, సమర్థవంతమైన అన్వేషణ విధానం కీలక పాత్ర పోషిస్తుందన్నారు. వికసిత్ భారత్ లక్ష్య సాధనలో భాగంగా కేంద్ర ప్రభుత్వం అన్ని రంగాలలో సంస్కరణలు చేపడుతోందని వ్యాఖ్యానించారు. “ఇవి కేవలం సాధారణ సంస్కరణలు మాత్రమే కాదు. ఇదొక సంస్కరణల ఎక్స్ప్రెస్” అని ఆయన వ్యాఖ్యానించారు. గనుల రంగం కూడా పారదర్శకత, సామర్థ్యం, పెట్టుబడులను పెంచే లక్ష్యంతో పరివర్తనాత్మక మార్పులకు సాక్ష్యంగా నిలుస్తోందని ఆయన పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో భాగంగా జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాకు (జీఎస్ఐ) చెందిన నెక్స్ట్-జనరేషన్ (ఎన్జీ) పోర్టల్ను కూడా కేంద్ర మంత్రి శ్రీ జీ. కిషన్ రెడ్డి ప్రారంభించారు. ఇది డేటా సేకరణ, విశ్లేషణ, విజువలైజేషన్, సమాచార వ్యాప్తిని ఏకీకృతం చేసే ఒక క్లౌడ్ ఆధారిత ప్లాట్ఫారమ్. ఏఐ, ఎంఎల్ ఆధారిత సాధనాలతో రూపొందించిన ఈ పోర్టల్ నేషనల్ జియోసైన్స్ డేటా రిపోజిటరీతో (ఎన్జీడీఆర్) అనుసంధానమై ఉంటుంది. ఇది ఖనిజ అన్వేషణలో పారదర్శకతను, సామర్థ్యాన్ని.. డేటా ఆధారిత నిర్ణయాలను తీసుకోవడాన్ని గణనీయంగా మెరుగుపరుస్తుందని భావిస్తున్నారు. ఈ రెండో విడత వేలం, రోడ్షో కార్యక్రమంలో గనుల మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ పీయూష్ గోయల్, అదనపు కార్యదర్శి శ్రీ సంజయ్ లోహియా ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.
గనుల మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ పీయూష్ గోయల్ మాట్లాడుతూ.. ఖనిజ రంగంలో వృద్ధిని వేగవంతం చేయడంలో ఈ రెండో విడత ఒక ముఖ్యమైన అడుగు అని పేర్కొన్నారు. మొదటి విడతకు వచ్చిన అద్భుతమైన స్పందన తర్వాత ఈ కొత్త విడతలో ఎనిమిది రాష్ట్రాలలో ఉన్న 11 కీలక, భూ పొరల లోతుల్లో ఉన్న ఖనిజ బ్లాకులను చేర్చినట్లు ఆయన తెలిపారు. ఎంఎండీఆర్ సవరణ చట్టం-2023, ఖనిజాల (వేలం) సవరణ నిబంధనలు-2023 కింద ప్రవేశపెట్టిన 'అన్వేషణ లైసెన్స్' విధానం పారదర్శకతను పెంచిందని, వ్యాపార నిర్వహణను సులభతరం చేసిందని ఆయన అన్నారు. దీనివల్ల అటు ప్రభుత్వ, ఇటు ప్రైవేట్ రంగ సంస్థలకు సమాన అవకాశాలు లభిస్తున్నాయని ఆయన వివరించారు.
ఈ కార్యక్రమంలో భాగంగా వివిధ విభాగాల ప్రతినిధులు పలు అంశాలపై ప్రజెంటేషన్లు ఇచ్చారు. 'రెండో విడత కింద అందుబాటులో ఉన్న అన్వేషణ లైసెన్స్ బ్లాకులు' అంశంపై జీఎస్ఐ.. 'అన్వేషణ లైసెన్స్ విధానం- నిబంధనలు'తో పాటు 'ఖనిజాల వేలం ప్రక్రియ, టెండర్ పత్రాల' గురించి ఎస్బీసీఏపీఎస్.. 'ఎంఎస్టీసీ పోర్టల్లో ఖనిజాల ఈ-వేలం ప్రక్రియ' అంశంపై ఎంఎస్టీసీ.. 'అన్వేషణ లైసెన్సులు కలిగి ఉన్నవారికి అన్వేషణ ఖర్చులలో కొంత భాగాన్ని తిరిగి చెల్లించే పథకం' గురించి ఎన్ఎంఈటీలు ప్రజెంటేషన్ ఇచ్చాయి.
బ్లాకుల జాబితా:
(రిలీజ్ ఐడి: 2227195)
సందర్శకుల సూచీ సంఖ్య : : 6