గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ
వీబీ జీ రామ్ జీ అమలు
నాడు పోస్టు చేయడమైనది:
10 FEB 2026 5:51PM by PIB Hyderabad
నైపుణ్యం అవసరం లేని శారీరక శ్రమ చేసేందుకు సిద్ధంగా ఉన్న ప్రతి గ్రామీణ కుటుంబానికి, ఒక ఆర్థిక సంవత్సరంలో కనీసం 125 రోజుల పని దినాలను కల్పిస్తూ వికసిత భారత్ - రోజ్గార్, ఆజీవికా హామీ మిషన్ (గ్రామీణ్): వీబీ- జీ రామ్ జీ చట్టం - 2025, ఉపాధికి భరోసా ఇస్తోంది.
మహాత్మాగాంధీ ఎన్ఆర్ఈజీఎస్ పరిధిలో 100 పని దినాల ఉపాధి హామీ కల్పించాలనే నిబంధన ఉంటే.. కొత్త చట్టంలో 125 రోజులకు పెంచారు. రైతులతో పాటు శారీరక శ్రమ చేయడానికి సిద్ధంగా ఉన్న ప్రతి గ్రామీణ కుటుంబానికి ఈ ఉపాధి హామీ లభిస్తుంది. నిర్ణీత సమయంలోగా ఉపాధి కల్పించలేని పక్షంలో శ్రామికుడు నిరుద్యోగ భృతిని పొందే హక్కును ఈ చట్టం కల్పిస్తుంది. తద్వారా ఉపాధికి, జీవనోపాధి భద్రతకు చట్టపరమైన హక్కులుగా రక్షణ లభిస్తుంది.
వికసిత భారత్ - రోజ్గార్, ఆజీవికా హామీ మిషన్ (గ్రామీణ్) (వీబీ- జీ రామ్ జీ) చట్టం కేవలం ఉపాధి కల్పన కార్యక్రమంగానే తన పరిధిని పరిమితం చేసుకోలేదు. ఇది నాలుగు ప్రధాన విభాగాలైన జల భద్రత, ప్రధాన గ్రామీణ మౌలిక వసతులు, జీవనోపాధి సంబంధిత కార్యకలాపాలు, విపరీత వాతావరణ పరిస్థితులను తగ్గించేందుకు చేపట్టే పనులతో గ్రామీణాభివృద్ధిని వేగవంతం చేసేందుకు రూపొందించిన సమగ్ర కార్యాచరణ ప్రణాళిక. ఈ విభాగాల్లో చేపట్టే అనేక పనులు వ్యవసాయాన్ని బలోపేతం చేసి, రైతులకు తోడ్పాటు అందిస్తాయి. వ్యవసాయ పనుల సమయంలో శ్రామికులు అందుబాటులో ఉండేలా చేసి రైతులకు ఈ చట్టం అండగా నిలుస్తుంది. నాట్లు, కోతల సమయంలో శ్రామికుల కొరతను రైతులు ఎదుర్కొంటున్నారని, ఇది పంట నష్టానికి దారి తీస్తోందని గుర్తించారు. దీనిని పరిష్కరించడానికి రైతులకు కూలీల అవసరం ఎక్కువగా ఉండే సాగు పనుల సీజన్లో ఏడాదిలో మొత్తంగా 60 రోజుల పాటు పనులను నిలిపివేసే అధికారాన్ని రాష్ట్రాలకు కల్పించారు. ఇది వ్యవసాయ కార్యకలాపాలు సజావుగా సాగేలా, రైతులకు అవసరమైన సమయంలో శ్రామికుల సహకారం లభించేలా భరోసాను ఇస్తుంది. ఈ నిబంధన కర్షక వర్గానికి పెద్ద ఉపశమనం అందిస్తుంది.
వ్యవసాయానికి ప్రాథమిక అవసరమైన జల భద్రతపై కొత్త చట్టం ప్రధాన దృష్టి సారిస్తుంది. చెరువులు, చెక్ డ్యాములు, నీటి కుంటలు, కాలువలు, భూగర్భ జలాలను పెంచే నిర్మాణాలు, సూక్ష్మ నీటి పారుదల వ్యవస్థలు తదితరమైన వాటికి ప్రాధాన్యమిస్తారు. ఇవి సాగు విస్తృతిని పెంచుతాయి. అనిశ్చితమైన వర్షపాతంపై ఆధారపడటాన్ని తగ్గిస్తాయి. తద్వారా పంట నిలబడే సామర్థ్యాన్ని పెంపొందిస్తాయి. ఈ విధానం ప్రస్తుత అవసరాల కోసం మాత్రమే కాకుండా, దీర్ఘకాలంలో సుస్థిరత సాధించడానికి, భవిష్యత్తు తరాల కోసం రూపుదిద్దుకుంది.
పంట దిగుబడితోనే రైతుల సమస్యలు తీరిపోవని ఈ చట్టం గుర్తించింది. దిగుబడి అనంతర నిర్వహణ కూడా అత్యంత కీలకమైనది. అందుకే, వ్యవసాయ క్షేత్ర స్థాయి నిల్వ, గోదాములు, గ్రామీణ సంతలు, శీతల గిడ్డంగులు తదితర మౌలికవసతుల కల్పన పనులను అనుమతించిన జాబితాలో చేర్చారు. ఇవి రైతులు తమ పంట దిగుబడిని నిల్వ చేసుకోవడానికి, తక్కువ ధరకే అమ్మాల్సిన పరిస్థితిని తొలగించడానికి, మెరుగైన మార్కెట్ ధరలను పొందడానికి రైతులకు వీలు కల్పిస్తాయి. తద్వారా సాగు ఆదాయాన్ని మెరుగుపరుస్తాయి.
వీటికి అదనంగా మారుతున్న వాతావరణ పరిస్థితులు, ప్రకృతి వైపరీత్యాల కారణంగా పెరుగుతున్న ముప్పుల విషయంలోనూ ఈ చట్టం ప్రతిస్పందిస్తుంది. వరద నియంత్రణ, కట్టలు, నీటి పరిరక్షణ, విపత్తు ఆశ్రయ భవనాలు, విపత్తు అనంతర పునర్నిర్మాణం కూడా దీనిలో చేర్చారు. ఇది గ్రామాలు, వ్యవసాయ క్షేత్రాల స్థిరత్వాన్ని బలోపేతం చేస్తుంది. అలాగే సంక్షోభ సమయాల్లో ఉపాధి కల్పిస్తుంది.
వ్యవసాయానికి అనుబంధంగా ఉండే పశువుల పెంపకం, మత్స్య సాగు, వర్మీ కంపోస్టు, నర్సరీలు, ఉద్యాన పంటలు, విలువ జోడింపు కార్యకలాపాల్లో వైవిధ్యమైన జీవనోపాధిని ఈ చట్టం ప్రోత్సహిస్తుంది. ఇది వివిధ వనరుల నుంచి రైతులు తమ ఆదాయాన్ని పెంపొందించుకోవడానికి, స్థానికంగా అవకాశాలను కల్పించడానికి, వలసలను తగ్గించడానికి, సుభిక్షమైన గ్రామీణ ఆర్థిక వ్యవస్థలను నిర్మించడానికి తోడ్పడుతుంది.
వికసిత భారత్ రోజ్గార్, ఆజీవికా హామీ మిషన్ (గ్రామీణ్) (వీబీ- జీ రామ్ జీ)ను కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన తర్వాత రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాలు సంబంధిత పథకాలను అధికారికంగా ప్రకటించి, వాటిని అమలు చేయాల్సి ఉంటుంది.
ఓ ప్రశ్నకు సమాధానంగా ఈ సమాచారాన్ని గ్రామీణాభివృద్ధి సహాయ మంత్రి శ్రీ కమలేష్ పాశ్వాన్ ఈ రోజు లోక్సభలో లిఖితపూర్వకంగా అందించారు.
***
(రిలీజ్ ఐడి: 2226531)
సందర్శకుల సూచీ సంఖ్య : : 12