ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ ఫర్మేశన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ
కౌశల్ రథ్ ప్రారంభం.. ‘‘ యువ ఏఐ ఫర్ ఆల్’’ కార్యక్రమం ద్వారా ఏఐ వినియోగాన్ని భారతదేశం మొత్తానికీ చేర్చడం దీని లక్ష్యం
నాడు పోస్టు చేయడమైనది:
10 FEB 2026 9:54PM by PIB Hyderabad
అఖిల భారత ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సాంకేతికత (ఏఐఎస్ఈసీటీ) సహకారంతో కేంద్ర ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతికత శాఖ (ఎంఈఐటీవై) పరిధిలోని ‘ఇండియాఏఐ’ (IndiaAI) కౌశల్ రథ్ను ఈ రోజు ప్రారంభించింది. ఇది జాతీయ ఏఐ వినియోగ కార్యక్రమం ‘‘యువ ఏఐ ఫర్ ఆల్’’లో భాగంగా అమలుచేస్తున్న సంచార కృత్రిమ మేధస్సు (ఏఐ) చైతన్య కార్యక్రమం. సెమీ-అర్బన్ ప్రాంతాల, ఆదరణకు నోచుకోని ప్రాంతాల విద్యార్థులు, యువత, గురువులు, శిక్షణార్థుల చెంతకు చేరుకొని మౌలిక ఏఐ శిక్షణను ఇవ్వడమే కాకుండా, డిజిటల్ సేవల అలభ్యతను తగ్గించడం కూడా ఈ కార్యక్రమం లక్ష్యాలే.
కౌశల్ రథ్లో పూర్తి స్థాయి సంచార కంప్యూటర్ ప్రయోగశాలను ఏర్పాటు చేశారు. దీనిలో ఇంటర్నెట్ సాయంతో పనిచేసే వ్యవస్థలు, దృశ్య, శ్రవణ పరికరాలు, తీర్చిదిద్దిన శిక్షణ పద్థతులు భాగంగా ఉన్నాయి. ఇది పాఠశాలలకీ, కళాశాలలకీ, ఐటీఐలతో పాటు సాముదాయిక కేంద్రాలకీ చేరుకొని సుశిక్షణ పొందిన వారి సహాయంతో భారత్ అవసరాలకు అనుగుణంగా కృత్రిమ మేధనీ, జనరేటివ్ ఏఐ సేవల్నీ ఎలా ఉపయోగించుకోవచ్చో తెలియజెబుతుంది.
కేంద్ర వాణిజ్య, పరిశ్రమ శాఖ సహాయ మంత్రి, ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతికత శాఖ మంత్రి శ్రీ జితిన్ ప్రసాద న్యూఢిల్లీ లోని ఇండియా గేట్ వద్ద ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమం విస్తృతమైన డిజిటల్ సామర్థ్యాల్ని నిర్మించడంతో పాటు బాధ్యత కలిగి ఉండే సాంకేతికతను అనుసరించడం ద్వారా ఏఐ-సన్నద్ధ భారత్ను తీర్చిదిద్దడానికి ప్రభుత్వం ఎంతటి నిబద్ధతతో ఉందో చాటిచెబుతోంది.
ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన సందర్భంగా సహాయ మంత్రి శ్రీ జితిన్ ప్రసాద మాట్లాడుతూ ‘‘ ‘యువ ఏఐ ఫర్ ఆల్’ కార్యక్రమాన్నీ, కౌశల్ రథ్నీ ప్రవేశపెట్టి మేం కృత్రిమ మేధ పట్ల చైతన్యాన్ని నేరుగా పూర్తి దేశానికి, ప్రత్యేకించి యువతకు అందజేస్తున్నాం. ఈ బస్సు వివిధ ప్రాంతాలకు వెళ్లి విద్యార్థులకీ, యువతీయువకులకీ కృత్రిమ మేధను ఉపయోగించడమెలా, కృత్రిమ మేధ ప్రయోజనాలు అందుకోవడమెలా అనే అంశాలపై శిక్షణను ఇవ్వడంతో పాటు, ‘చైతన్యం, అవకాశాల లభ్యతలు.. భౌగోళిక పరిమితులకూ, జనసంఖ్య సంబంధిత పరిమితులకూ అతీతంగా ఉండాలి’ అని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ చెప్పిన మాటలను కూడా సాకారం చేస్తుంది. వచ్చే వారంలో న్యూఢిల్లీలో జరగనున్న ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్-2026కు ముందుగా చేపట్టిన సన్నాహక కార్యక్రమాలే ఈ ‘యువా ఏఐ ఫర్ ఆల్’, ‘కౌశల్ రథ్’. అభివృద్ధి చెందుతున్న దేశాలలో తొలిసారి ఏర్పాటు చేస్తున్న ఈ శిఖరాగ్ర సదస్సుకు మొదటిసారి ఆతిథ్యాన్ని ఇస్తుండడం భారత్కెంతో గర్వకారణం’’ అన్నారు.
కార్యక్రమ ప్రారంభోత్సవంలో ఇండియాఏఐ మిషన్ సీఓఓ, ఎంఈఐటీవైకి చెందిన జి సైంటిస్టు శ్రీమతి కవితా భాటియా మాట్లాడుతూ, ‘‘ఇండియాఏఐ మిషన్లో భాగంగా, నైపుణ్యాలను అందించడం ఏడు కీలకమైన అంశాల్లో ఒక అంశంగా ఉంది. అంతేకాదు, ఈ కార్యక్రమం విస్తృత స్థాయిలో ఏఐ విద్యను అందరికీ అందుబాటులోకి తీసుకుపోవాలన్న మన లక్ష్యాన్ని కూడా ముందుకు తీసుకుపోతోంది. కౌశల్ రథ్ ద్వారా, మనం ఏకీకృత ప్రణాళికలు, ఏఐ ఉపకరణాలు, ముందుగా సిద్ధం చేసిన పాఠ్యక్రమాలను ఉపయోగించి వేర్వేరు సంస్థల విద్యార్థులకు ఏఐ బోధనావకాశాన్ని కల్పిస్తున్నాం. దీన్లో ఏఐ పట్ల ఉన్న అపోహల్ని తొలగించడానికి ఉద్దేశించిన ‘యువ్ఏఐ ఫర్ ఆల్’ (YuvaAI for All) కార్యక్రమాన్ని కూడా చేర్చాం. బోధకుల నాయకత్వంలో శిక్షణ ప్రక్రియ, మైక్రో, నానో ప్రమాణపత్రాలతో పాటు దేశవ్యాప్త లభ్యతను కూడా కలబోయడం ద్వారా అన్ని ప్రాంతాల శిక్షణార్థులకీ ఏఐ నైపుణ్యాలు అందుబాటులోకి వచ్చేటట్లు చర్యలు తీసుకుంటున్నాం’’ అని వివరించారు.
ఇండియా గేట్ నుంచి ప్రస్థానాన్ని మొదలుపెట్టిన కౌశల్ రథ్ ఒక సంచార అవగాహనా కేంద్రంగా పనిచేస్తుంది. ఇది ఢిల్లీ-ఎన్సీఆర్లో వివిధ ప్రాంతాలకు వెళ్తుంది.
ఇది.. కోర్సు కోసం అక్కడికక్కడ పేర్ల నమోదుకు వీలు కల్పిస్తుంది.
..విద్యార్థులకీ, సామాన్య ప్రజలకీ ఏఐని ఎలా ఉపయోగించుకోవచ్చో ఉదాహరణలను తెలియజేస్తుంది.
..రాబోయే ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్-2026ను దృష్టిలో పెట్టుకొని రంగాన్ని సిద్ధం చేస్తుంది.
ఈ కోర్సు ముఖ్యాంశాలు:
• సులభతర శిక్షణ: 4 గంటల పాటు సాగే ఓ నిర్దేశిత కార్యక్రమంలో 6 విస్తృత శిక్షణ పద్ధతులుంటాయి.
• కోడింగ్తో పని ఏమీ ఉండదు: పాఠ్యక్రమంలో ఏఐ భావనలు, నైతికత, వాస్తవిక ప్రపంచంలోని సేవలపై దృష్టి పెట్టారు. నేర్చుకోవాలనే తపన కలిగిన వ్యక్తులకు సులభంగా అర్థం అయ్యేటట్టు పాఠ్యక్రమాన్ని రూపొందించారు.
• జాతీయ ప్రభావం: ఫ్యూచర్ స్కిల్స్ ప్రైమ్, ఐగాట్ కర్మయోగి, కోర్సెరా, టీసీఎస్ ఐయాన్, తదితర అంతర్జాతీయ, దేశీయ భాగస్వామ్య సంస్థల సహకారంతో దీనిని ప్రారంభించారు. భవిష్యత్కాల అవసరాలను తీర్చగల మానవ వనరులను తీర్చిదిద్దడం ఈ కోర్సు లక్ష్యం.
• ధ్రువీకరణ: కోర్సును పూర్తి చేసిన తరువాత దీనిలో పాల్గొన్నవారికి అధికారిక గుర్తింపును అందిస్తారు.. దీంతో వారి వృత్తి సంబధిత, విద్యా ప్రొఫైళ్లు అధిక విలువను సంతరించుకుంటాయి.
న్యూఢిల్లీలోని భారత్ మండపంలో 2026 ఫిబ్రవరి 16 నుంచి 20 వ తేదీల మధ్య ‘ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్-2026’ను నిర్వహించే కన్నా ముందు.. జాతీయ స్థాయిలో చైతన్యాన్ని కలిగించే, సామర్థ్యాల్ని పెంపొందించే దిశగా చేపట్టిన ప్రయత్నాల్లో కౌశల్ రథ్ విశేషమైన తోడ్పాటును అందించనుంది. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో మొదటి సారి ఏర్పాటు చేస్తున్న ప్రపంచ స్థాయి ఏఐ శిఖరాగ్ర సదస్సుగా చెబుతున్న ఈ కార్యక్రమంలో, ‘‘ప్రజలు, పృథ్వి, ప్రగతి’’.. ఈ మూడూ ముఖ్యాంశాలు కాబోతున్నాయి. దీంతో పాటే, భారతదేశ జాతీయ ప్రాధాన్యాలకు అనుగుణంగా.. ప్రపంచ ఏఐ సంబంధిత చర్చోపచర్చలను అభివృద్ధికి పెద్దపీట వేసే ఫలితాలుగా మార్చడంపైనా ఈ శిఖరాగ్ర సదస్సులో దృష్టిని కేంద్రీకరిస్తారు.
***
(రిలీజ్ ఐడి: 2226527)
సందర్శకుల సూచీ సంఖ్య : : 4