అంతరిక్ష విభాగం
పార్లమెంటు ప్రశ్న: భారతీయ అంతరిక్ష స్టేషన్
నాడు పోస్టు చేయడమైనది:
11 FEB 2026 12:48PM by PIB Hyderabad
స్పేస్ విజన్ 2047లో భాగంగా భారతీయ అంతరిక్ష స్టేషన్ (బీఏఎస్)ను ఏర్పాటు చేయాలని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) లక్ష్యంగా పెట్టుకుంది. జీవశాస్త్రం, వైద్య రంగంతో సహా వివిధ రంగాల్లో సూక్ష్మ గురుత్వాకర్షణ పరిశోధనలు, శాస్త్రీయ అధ్యయనాలు చేపట్టటానికి ఈ స్టేషన్ వేదిక కానుంది.
అయిదు మాడ్యూళ్లతో భారతీయ అంతరిక్ష స్టేషన్ ఆకృతిని ఇస్రో సిద్ధం చేసింది. ఈ ఆకృతిని జాతీయ స్థాయి సమీక్షా కమిటీ ఇప్పటికే పరిశీలించింది. గగన్యాన్ ప్రాజెక్టు సవరణలో భాగంగా 2028 నాటికి భారతీయ అంతరిక్ష స్టేషన్ మొదటి మాడ్యూల్ (బీఏఎస్-01)ని అభివృద్ధి చేయడానికీ, ప్రారంభించేందుకు కేంద్ర మంత్రి వర్గం సెప్టెంబర్ 2024లో ఆమోదం తెలిపింది. ప్రస్తుతం బీఏఎస్-01 మాడ్యూల్కు సంబంధించిన ఇంజినీరింగ్ పనులు, వివిధ ఉప వ్యవస్థల సాంకేతిక అభివృద్ధి కార్యకలాపాలు ఇస్రో కేంద్రాలు, యూనిట్లలో కొనసాగుతున్నాయి.
అధునాతన లైఫ్ సపోర్ట్ సిస్టమ్స్ వంటి సాంకేతిక అంశాలతో భారతీయ అంతరిక్ష స్టేషన్ (బీఏఎస్) భూమికి సమీప కక్ష్యలో (ఎల్ఈఓ) మానవులు దీర్ఘకాలం నివసించేలా చేస్తుంది. ఇది సామాజిక-ఆర్థిక ప్రభావం చూపే అధునాతన శాస్త్రీయ పరిశోధనలు, సాంకేతిక ప్రదర్శనలకు అవకాశమివ్వటమే కాక భూ కక్ష్యను దాటి భారత్ చేపట్టబోయే ఇతర మానవ అంతరిక్ష యాత్రలకు సహకరిస్తుంది.
వివిధ ముందస్తు మిషన్లు, బీఏఎస్-1 అభివృద్ధి, ప్రయోగానికి సంబంధించిన బడ్జెట్ కేటాయింపులను సవరించిన గగన్యాన్ మిషన్లో చేర్చారు. ఇప్పటికే ఆమోదించిన గగన్యాన్ నిధులకు అదనపు నిధులను జోడించి మొత్తం బడ్జెట్ను రూ.20,193 కోట్లకు పెంచారు. దీనికి 2024 సెప్టెంబర్లో కేంద్ర మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. ప్రస్తుతం బీఏఎస్ కోసం ఇతర అంతరిక్ష సంస్థలు, కంపెనీలతో ఎటువంటి నిర్దిష్ట సాంకేతిక సహకార ఒప్పందాలు లేవు.
సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్ల శాఖ, ప్రధానమంత్రి కార్యాలయ సహాయమంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ఇవాళ లోక్ సభలో ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో ఈ సమాచారాన్ని వెల్లడించారు.
***
(రిలీజ్ ఐడి: 2226503)
సందర్శకుల సూచీ సంఖ్య : : 9