యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ
మై భారత్: యువత కోసం జాతీయ వేదిక
నాడు పోస్టు చేయడమైనది:
02 FEB 2026 7:17PM by PIB Hyderabad
యువత భాగస్వామ్యాన్ని పెంపొందించే వేదిక మైభారత్. ఇది ప్రయోగాత్మక, స్వచ్ఛంద కార్యక్రమాల్లో యువతను పాల్గొనేలా చేస్తుంది. భాగస్వామ్య మంత్రిత్వ శాఖలు, సంస్థలు నిర్వహించే కార్యక్రమాల్లో సైతం భాగం చేస్తుంది.. అలాగే యువత నమోదు, ప్రొఫైల్ రూపకల్పనను సులభతరం చేస్తుంది. యువత భాగస్వామ్యం అవుతున్న స్థాయిలో, డిజిటల్ కార్యకలాపాల్లో సాధించిన వృద్ధిని అంచనా వేయడానికి వీలుగా రిజిస్ట్రేషన్లు, కార్యకలాపాల జాబితా, నూతన భాగస్వాములు, భాగస్వామ్య స్థాయిలు లాంటి సూచికలను ఈ వేదిక అందిస్తోంది.
నైపుణ్యాభివృద్ధి, ఉద్యోగకల్పనకు అంకితమైన లేదా ప్లేస్మెంట్ పోర్టల్గా మై భారత్ పనిచేయడం లేదు. దీనిలో యువత భాగస్వామ్యానికి సంబంధించినవి మినహా.. ఉపాధి ఫలితాలను కొలిచే సూచికలను దీనిలో పొందుపరచలేదు. యువత స్వచ్ఛందంగా పాల్గొనే వేదికగా మాత్రమే మై భారత్ పోర్టల్ పనిచేస్తుంది కానీ ఉద్యోగాల కల్పనకు సంబంధించిన పోర్టల్గా కాదు. ఈ వేదిక ఉద్దేశం ప్రత్యక్ష ఉద్యోగాలు లేదా ఉపాధి కల్పనతో అనుసంధానమవడం కాదు.
పర్యవేక్షణ, నివేదికల నిబంధనలు:
2025-26లో మై భారత్ ద్వారా చేపట్టిన కార్యక్రమాలను.. పోర్టల్కు అనుసంధానించిన ప్రత్యేక ఇంటర్నల్ డ్యాష్ బోర్డు ద్వారా పర్యవేక్షిస్తారు. యువత భాగస్వామ్యం, నిర్వహించిన కార్యక్రమాలు, మంత్రిత్వ శాఖలు/విభాగాలు, ఇతర భాగస్వాములతో ఒప్పందాలకు సంబంధించిన సమాచారాన్ని ఈ డ్యాష్ బోర్డు ఎప్పటికప్పుడు నమోదు చేస్తుంది.
ఈ వేదిక ద్వారా చేపట్టిన ప్రధాన కార్యక్రమాలు:
2025-26లో ఈ పోర్టల్ ద్వారా జాతీయ యువజనోత్సవం: వికసిత భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ (వీబీవైఎల్డీ)-2026తో సహా అనేక కార్యక్రమాలను యువజన వ్యవహారాల విభాగం నిర్వహించింది. వీబీవైఎల్డీ పరిధిలో జాతీయ స్థాయిలో నిర్వహించిన క్విజ్, వ్యాస రచన, హ్యాక్ ఫర్ సోషల్ కాజ్, డిజైన్ ఫర్ భారత్ కార్యక్రమాలు, కవితా రచన, చిత్ర లేఖనం, జానపద సంగీతం, జానపద నృత్యం లాంటి సాంస్కృతిక కార్యక్రమాల్లో లక్షల సంఖ్యలో యువత పాల్గొంది. స్వచ్ఛంద సేవా కార్యక్రమాలను నిర్వహించడానికి జాతీయ సేవా పథకం (ఎన్ఎస్ఎస్) మై భారత్ వేదికను ఉపయోగించుకుంటోంది. అలాగే ఏకీకృత డిజిటల్ పర్యవేక్షణ వ్యవస్థ ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న సంస్థలకు చెందిన స్వచ్ఛంద సేవకులు పాల్గొనే వీలు కల్పిస్తోంది.
ఈ వేదికలో తీసుకొచ్చిన నవీకరణలు, కొనసాగుతున్న అభివృద్ధి కార్యకలాపాలు:
యువత భాగస్వామ్యాన్ని పెంపొందించేందుకు, నైపుణ్య నిర్మాణాన్ని బలోపేతం చేసేందుకు, న్యాయకత్వ లక్షణాల అభివృద్ధి కోసం దశల వారీగా మై భారత్ వేదికను మెరుగుపరుస్తున్నారు. దీనిలో ఉన్న ప్రధాన కార్యక్రమాలు:
-
డిజిటల్ సమ్మిళిత్వం: డిజిటల్ అంతరాన్ని తగ్గించడానికి, విస్తరణను పెంపొందించడానికి ఈ వేదికను 22 భారతీయ భాషల్లో అందుబాటులో ఉంచారు. దీనితో పాటు ఆండ్రాయిడ్, ఐఓఎస్ల్లో మొబైల్ అప్లికేషన్ను అందుబాటులోకి తీసుకొచ్చారు.
-
ప్రధానాంశాలకు మెరుగులు: యువత నమోదు, కార్యకలాపాల జాబితా, స్వచ్ఛందంగా పాల్గొనడం, కార్యకలాపాల ట్రాకింగుకు సంబంధించిన ప్రధాన మాడ్యూళ్లు అభివృద్ధి, పరీక్షా దశల్లో ఉన్నాయి.
-
విజ్ఞానాన్ని పెంపొందించే మాడ్యూళ్లు: విశ్లేషణాత్మక ఆలోచన, సృజనాత్మకత, సమస్య పరిష్కార నైపుణ్యాలను మెరుగుపరిచేందుకు మై భారత్ క్విజ్, మై భారత్ వ్యాసరచన, డిజైన్ ఫర్ భారత్, హ్యాక్ ఫర్ సోషల్ కాజ్ లాంటి ఇంటరాక్టివ్ మాడ్యూళ్లను రూపొందించారు/మెరుగుపరిచారు.
-
సాంకేతికత ఏకీకరణలు: స్పీచ్-టు-టెక్స్ట్ సేవల కోసం భాషిణితో అనుసంధానించారు. సీఎస్సీ, హర్ ఘర్ తిరంగా పోర్టళ్లు, మిషన్ లైఫ్ తదితర ప్రభుత్వ వేదికలతో ఏకీకరణ చేశారు. మై భారత్ వినియోగదారులకు సహాయం అందించేందుకు ఏఐ ఆధారిత చాట్ బాట్ను పరిచయం చేశారు.
వృద్ధి, విస్తరణ:
యువత నమోదులో ఈ వేదిక రికార్డు స్థాయిలో వృద్ధిని నమోదు చేసింది. అలాగే దీనిలో మంత్రిత్వ శాఖలు, రాష్ట్ర ప్రభుత్వాలు, ఇతర భాగస్వాములకు సంబంధించిన సంస్థలు చేరడంలోనూ వృద్ధి నమోదయింది. జనవరి 27 నాటికి, మై భారత్ పోర్టల్ (https://mybharat.gov.in/) ద్వారా చేసిన రిజిస్ట్రేషన్ల సంఖ్య 2,07,66,353కు చేరుకుంది.. స్వచ్ఛంద సేవ, ప్రయోగాత్మక అభ్యాసం, సామర్థ్య నిర్మాణాలకు సంబంధించిన మాడ్యూళ్లు దీనిలో ఉన్నాయి. ఈ వేదిక విస్తరణలో భాగంగా సాంకేతిక, పరిపాలనా పరమైన అంశాలను పరిగణనలోకి తీసుకొని సంబంధిత భాగస్వాములతో సమన్వయం చేసుకుంటూ.. ఈ మాడ్యూళ్లను అభివృద్ధి చేస్తున్నారు.
కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్షుఖ్ మాండవీయ ఈ సమాచారాన్ని సోమవారం లోక్సభలో అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా అందించారు.
(రిలీజ్ ఐడి: 2222606)
సందర్శకుల సూచీ సంఖ్య : : 10