ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ ఫర్మేశన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ
ఏఐతో ఆర్థిక పర్యవేక్షణలో పరివర్తన కోసం ఫైనాన్షియల్ రిపోర్టింగ్ కాంప్లియెన్స్ ఛాలెంజ్ను ప్రారంభించిన ఇండియాఏఐ, ఎన్ఎఫ్ఆర్ఏ
మొత్తం రూ.1.5 కోట్ల విలువైన బహుమతులు - 2026, ఫిబ్రవరి 22 వరకు అందుబాటులో దరఖాస్తులు
ఆటోమేటెడ్ కాంప్లియెన్స్ వాలిడేషన్, ఫైనాన్షియల్ డేటా ఎక్స్ట్రాక్షన్, రిస్క్ అనాలిటిక్స్ కోసం ఏఐ ఇంజిన్ల అభివృద్ధికి అంకురసంస్థలు, కంపెనీలకు ఆహ్వానం
న్యూఢిల్లీలో వర్చువల్ ఛాలెంజ్ రౌండ్, 5 రోజుల ఆన్-ప్రిమైస్ డెవలప్మెంట్ రౌండ్లో పాల్గొననున్న షార్ట్లిస్ట్ అయిన జట్లు
प्रविष्टि तिथि:
14 JAN 2026 6:33PM by PIB Hyderabad
ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతికత మంత్రిత్వ శాఖ డిజిటల్ ఇండియా కార్పొరేషన్ ఆధ్వర్యంలోని స్వతంత్ర వ్యాపార విభాగం అయిన ఇండియాఏఐ... నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ అథారిటీ సహకారంతో ఇండియాఏఐ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ కాంప్లియెన్స్ ఛాలెంజ్ను ప్రారంభించింది.
ఇండియాఏఐ అప్లికేషన్ డెవలప్మెంట్ ఇనిషియేటివ్లో భాగమైన ఈ కార్యక్రమం... నియంత్రణా విధానాల కోసం ఆర్థిక పత్రాల ధృవీకరణను ఆటోమేట్ చేసే బలమైన ఏఐ ఇంజిన్ను అభివృద్ధి చేయడానికి భారతీయ అంకుర సంస్థలు, కంపెనీలను ఆహ్వానిస్తోంది. ఏఐ ప్రయోజనాలను ప్రజాస్వామ్యీకరించడం లక్ష్యంగా ఈ పోటీని నిర్వహిస్తున్నారు.
స్కాన్ చేసిన, డిజిటల్ వెర్షన్లలోని బహుళ-ఫార్మాట్ డాక్యుమెంట్ మూలాల నుంచి టెక్స్ట్, పట్టికలు, హైపర్లింక్లు, ఎంబెడెడ్ డేటా, ఆర్థిక డేటాను సంగ్రహించగలిగే... వాటిని లాజికల్, హెడర్-ఆధారిత విభాగాలుగా విభజించి... ప్రతి విభాగం పరిపూర్ణత, సమగ్రత, ముందుగా నిర్వచించిన ప్రణాళికకు అనుగుణంగా సమ్మతిని ధృవీకరించగలిగే ఏఐ-ఆధారిత ఇంజిన్ను అభివృద్ధి చేయడం ద్వారా సమ్మతిలో అంతరాలను పరిష్కరించడానికి ఈ పోటీ ప్రయత్నిస్తుంది.
పోటీలో పాల్గొనేవారికి అద్భుత బహుమతులు:
· వర్చువల్ ఛాలెంజ్ రౌండ్ కోసం టాప్ 10 జట్లను షార్ట్లిస్ట్ చేసే అవకాశం ఉంది. ఇందులో ఒక్కో జట్టుకు 5 లక్షల రూపాయలు లభిస్తాయి. వారు ఏఐకోశ్ అందించే నమూనా డేటాసెట్పై తమ పరిష్కారాన్ని మెరుగుపరచాల్సి ఉంటుంది.
· షార్ట్లిస్ట్ అయిన 3 జట్లను వారి పరిష్కారాన్ని మెరుగుపరచడానికి న్యూఢిల్లీలో నిర్వహించే 5 రోజుల ఆన్-ప్రిమైస్ డెవలప్మెంట్ రౌండ్కు ఆహ్వానిస్తారు.
· విజేతగా నిలిచిన ఒక జట్టు తమ పరిష్కారాన్ని రెండు సంవత్సరాల పాటు ఎన్ఎఫ్ఆర్ఏ కోసం అమలు చేయడానికి గరిష్టంగా రూ. 1 కోటి విలువైన వర్క్ కాంట్రాక్టును పొందవచ్చు.
ఈ పోటీ పారదర్శక ఆర్థిక నివేదికల ద్వారా ప్రజల విశ్వాసం, పెట్టుబడిదారుల రక్షణను నిర్ధారిస్తూ, స్కేలెబుల్ రెగ్యులేటరీ టెక్నాలజీ మౌలిక సదుపాయాలను నిర్మించడం కోసం భారత్ చేస్తున్న వ్యూహాత్మక ప్రయత్నాన్ని సూచిస్తుంది.
ఆసక్తి గల అభ్యర్థులు దరఖాస్తు సమర్పణ మార్గదర్శకాలను ఏఐకోశ్ పోర్టల్: https://aikosh.indiaai.gov.in/home/competitions/details/b5ebae1e-73d1-4ba8-baa1-21beaabd1f6d ద్వారా తెలుసుకోవచ్చు, దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తులను సమర్పించడానికి చివరి తేదీ 2026, ఫిబ్రవరి 22.
ఇండియాఏఐ అనేది ఇండియాఏఐ మిషన్ను అమలు చేయు సంస్థ. ఇది సమాజంలోని అన్ని వర్గాల్లో ఏఐ ప్రయోజనాలను ప్రజాస్వామ్యీకరించడం... ఏఐ రంగంలో ప్రపంచస్థాయిలో భారత్ నాయకత్వాన్ని బలోపేతం చేయడం... సాంకేతిక స్వయంసమృద్ధిని పెంపొందించడం... నైతిక విలువలతో కూడిన, బాధ్యతాయుతమైన ఏఐ వినియోగాన్ని నిర్ధారించడం లక్ష్యంగా పనిచేస్తుంది.
***
(रिलीज़ आईडी: 2214987)
आगंतुक पटल : 7