రక్షణ మంత్రిత్వ శాఖ
భారతీయ తీర రక్షక దళ నౌక సముద్ర ప్రతాప్ను ప్రారంభించిన రక్షణ మంత్రి.. భారత్లో మొదటిసారి కాలుష్య నియంత్రణ నౌకను నిర్మించిన జీఎస్ఎల్
ఐసీజీ నౌకల్లో అతి పెద్ద నౌక ఇదే..దేశ పర్యావరణ సంబంధ ప్రతిస్పందనల సామర్థ్యాల్నీ,
కోస్తా ప్రాంతాల్లో గస్తీనీ, సముద్ర వాణిజ్య భద్రతనీ పెంచడానికి రంగ ప్రవేశం
మొదటిసారిగా, ముందువరుసలోని ఓ తీరరక్షక దళ నౌకలో మహిళా అధికారుల నియామకం
”పరిణతి చెందిన భారత రక్షణ పరిశ్రమ అనుబంధ విస్తారిత వ్యవస్థకు ప్రతీకగా ఐసీజీఎస్ సముద్ర ప్రతాప్..
సముద్ర వాణిజ్యంలో ప్రస్తుత కాలపు సవాళ్లను ఎదుర్కోవడానికి జీఎస్ఎల్ అధునాతన దృష్టికోణంతో దీన్ని రూపొందించింది’’
ఎలాంటి దుస్సాహసాన్నైనా ధైర్యంగా, దీటుగా తిప్పికొడతామని ప్రత్యర్థులకు స్పష్టమైన సందేశాన్ని ఇచ్చిన ఐసీజీ..
బహుముఖ పాత్ర దీని సొంతం: శ్రీ రాజ్నాథ్ సింగ్
‘‘భారత్ ఒక బాధ్యతాయుత సముద్ర వాణిజ్య శక్తి.. హిందూ-పసిఫిక్ ప్రాంతంలో శాంతి, సుస్థిరత్వాలకు పూచీ’’
‘‘నిర్ణీత పనులే కాకుండా, రహస్య సమాచార శక్తిగా ఐసీజీ మారాలి’’
प्रविष्टि तिथि:
05 JAN 2026 12:52PM by PIB Hyderabad
‘సముద్ర ప్రతాప్’ను కేంద్ర రక్షణ మంత్రి శ్రీ రాజ్నాథ్ సింగ్ 2026 జనవరి 5న గోవాలో ఇండియన్ కోస్ట్ గార్డ్ షిప్ (ఐసీజీఎస్)లో చేర్చారు. నౌకానిర్మాణం, సముద్ర వాణిజ్య సామర్థ్యాలనె పెంచుకోవడంలో స్వయంసమృద్ధిని సాధించే దిశగా ఒక ప్రధాన ముందడుగును ఇది సూచించింది. గోవా షిప్యార్డ్ (జీఎస్ఎల్) నిర్మించిన రెండు కాలుష్య నియంత్రణ నౌకల్లో ఈ నౌక మొదటిది. 60 శాతానికి పైగా స్వదేశీ సామగ్రిని ఉపయోగించి నిర్మించిన సముద్ర ప్రతాప్, మన దేశంలో మొదటి సారి దేశీయంగా తయారయిన కాలుష్య నియంత్రణ నౌక. ఐసీజీలోని నౌకలన్నింటి కన్నా అతి పెద్ద నౌక. సముద్ర ప్రతాప్ చేరికతో కాలుష్య నియంత్రణ, మంటల అదుపు, సముద్ర వాణిజ్య భద్రత, పర్యావరణ సంరక్షణ విధుల్లో భారతీయ తీర రక్షక దళ కార్యకలాపాల సామర్థ్యం గణనీయంగా పెరుగుతుంది. దీంతో భారత విశాల సముద్ర వాణిజ్య మండలాల్లో ఇది వరకటితో పోలిస్తే మరింత నిఘాతో పాటు ప్రతిస్పందన పూర్వక మిషన్లను చేపట్టే సత్తా కూడా పటిష్ఠమవుతుంది.
భారత్లో పరిపక్వ స్థితికి ఎదిగిన రక్షణ పరిశ్రమ అనుబంధ విస్తారిత వ్యవస్థకు ఈ నౌక ఒక నిదర్శనంగా నిలుస్తోందని రక్షణ మంత్రి వర్ణించారు. సంక్లిష్టమైన తయారీ సంబంధ సవాళ్లను ప్రభావవంతంగా ఎదుర్కొనే సామర్థ్యాన్ని దీనికి సమకూర్చారన్నారు. నౌకానిర్మాణ ప్రక్రియలో దేశీయంగా తయారు చేసిన సామగ్రిని 90 శాతం వరకూ పెంచడానికి నిరంతర ప్రయత్నాలు సాగుతున్నాయని మంత్రి తెలిపారు.
‘‘ఐసీజీఎస్ సముద్ర ప్రతాప్ను ప్రత్యేకంగా కాలుష్య నియంత్రణ కోసమే తయారు చేశారు. అయితే దీని భూమిక అంత వరకే పరిమితం కాదు. ఒకే వేదికపై అనేక సామర్థ్యాల్ని మిళితం చేసినందువల్ల, ఈ నౌక తీరప్రాంత గస్తీని ప్రభావవంతంగా నిర్వహించగలుగుతుంది. సముద్ర వాణిజ్య భద్రతను పటిష్ఠపరచగలుగుతుంది. వర్తమాన సముద్ర వాణిజ్య సంబంధిత సవాళ్లను ఎదుర్కోవడానికి సరళత్వాన్నీ, సన్నద్ధతనీ పెంచడమే గోవా షిప్యార్డు అనుసరించిన ఆధునిక దృష్టికోణం లక్ష్యం ’’ అని శ్రీ రాజ్నాథ్ సింగ్ వివరించారు.
సముద్ర కాలుష్యం మొదలు తీరప్రాంతాల్లో స్వచ్ఛత, అన్వేషణ, సహాయక కార్యకలాపాలు, సముద్ర వాణిజ్య చట్టాలకు సంబంధించిన నేర నియంత్రణ వరకూ చూస్తే.. బహుళ విధ పాత్రలను ఐసీజీ పోషిస్తున్నందుకుగాను ఐసీజీని రక్షణ మంత్రి ప్రశంసించారు. తీరరక్షక దళం తన కర్తవ్యాలను నిర్వర్తిస్తున్న తీరును బట్టి చూస్తే, దేశ శత్రువులకు వాళ్లు భారత సముద్ర సరిహద్దులపై కన్నేసినా, లేదా ఏదైనా దుస్సాహసానికి తెగబడినా వాళ్లకు దీటైన గుణపాఠం చెబుతామని దీంతో ఒక సుస్పష్ట సందేశాన్ని ఇచ్చినట్లయిందని ఆయన అన్నారు.
ఈ నౌకలో ఆధునిక కాలుష్య గుర్తింపు వ్యవస్థలు, కాలుష్యాన్ని ఎదుర్కోవడానికి ప్రత్యేకించిన నౌకలతో పాటు ఆధునిక అగ్నిమాపక సామర్థ్యాలను కూడా జోడించారు. దీనిలో హెలికాప్టర్ హంగర్, విమానయాన సహాయక సౌకర్యాలు ఉన్నాయి. ఇవి దీని వరకూ చేరుకోవడాన్ని, దీని ప్రభావశీలత్వాన్నీ చాలావరకూ పెంపొందించ గలుగుతాయి. ఈ హంగుల కారణంగా, ఈ నౌక సముద్రంలో అననుకూలంగా స్థితులు తలెత్తినా నిలకడైన సేవల్ని అందించగలుగుతుందనీ, ఫలితంగా వాస్తవ కార్యకలాపాలకు మంచి ఊతం లభించగలదన్న విశ్వాసాన్ని శ్రీ రాజ్నాథ్ సింగ్ వ్యక్తం చేశారు.
వాతావరణ మార్పు, భూతాపం వంటి సవాళ్ల నడుమ సముద్ర వాణిజ్య పర్యావరణ సంరక్షణ ఒక వ్యూహాత్మక అవసరం మాత్రమే కాదు.. అది ఒక నైతిక బాధ్యత కూడా అని రక్షణ మంత్రి అన్నారు. చమురు తెట్టు ఏర్పడ్డ వేళ తగిన ప్రతిచర్యల్ని చేపట్టినందుకూ, మంటలను అదుపు చేసినందుకూ, సహాయక కార్యకలాపాలకు నడుం బిగించినందుకూ ఐసీజీని మంత్రి ప్రశంసించారు. దీంతో భారత్ పురోగామి పర్యావరణ ప్రతిస్పందన సామర్థ్యాలు కలిగిన కొన్ని దేశాల సరసన స్థానాన్ని సంపాదించిందని ఆయన తెలిపారు. ‘‘త్వరిత గుర్తింపు, కచ్చితమైన స్టేషన్-కీపింగ్, కుశల రికవరీ వ్యవస్థల ద్వారా సామర్థ్యాలను సముద్ర ప్రతాప్ మరింత బలోపేతం చేస్తుంది. కాలుష్యానికి సంబంధించిన సంఘటనలు తలెత్తితే సమయానుగుణ నియంత్రణ సాధ్యమవుతుంది. దీంతో ప్రవాళ భిత్తికలు, మడ అడవులు, మత్స్య పోషణలతో పాటు సముద్రంలో వివిధ జీవులకు హాని కలగకుండా చూడడానికి కూడా వీలవుతుంది. ఇది తీరప్రాంత సముదాయాలు, నీలి ఆర్థిక వ్యవస్థ స్థిరత్వంతో నేరుగా ముడిపడి ఉంది’’ అని ఆయన అన్నారు.
సురక్షిత వాణిజ్యానికీ, భద్రమైన జీవనానికీ, సురక్షిత పర్యావరణానికీ పూచీ పడేది స్వచ్ఛ సముద్రమేనని శ్రీ రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. ఐసీజీఎస్ సముద్ర ప్రతాప్ వంటి వేదికలు భారత్ ఒక్క తన సముద్ర వాణిజ్య సంబంధిత బాధ్యతను మాత్రమే అర్థం చేసుకోవడానికి పరిమితం కావడం లేదనీ, వాటిని నెరవేర్చడానికి పూర్తి స్థాయిలో సన్నద్ధమైందని సూచిస్తున్నాయని ఆయన అన్నారు. సముద్ర ప్రతాప్ రంగ ప్రవేశం భారత విస్తృత సముద్ర వాణిజ్య దార్శనికతతో ముడిపడి ఉందని ఆయన స్పష్టం చేశారు. ‘‘సముద్ర వాణిజ్య వనరులు ఏ ఒక్క దేశానికి చెందిన సంపదో కాదు, అవి మానవాళి ఉమ్మడి వారసత్వమని మేం నమ్ముతాం. వారసత్వాన్ని పంచుకున్నప్పడు, దానిని సంరక్షించాల్సిన బాధ్యతను కూడా పంచుకోవాలి. ఈ కారణంగానే భారత్ ప్రస్తుతం ప్రపంచ వేదికపై శాంతి, స్థిరత్వంలతో పాటు పర్యావరణానికి సంబంధించిన సిద్ధాంతాల పక్షాన గట్టిగా నిలబడింది’’ అని ఆయన అన్నారు.
ప్రపంచవ్యాప్తంగా సముద్ర వాణిజ్యంలో అనిశ్చితి కొనసాగుతున్న ప్రస్తుత కాలంలో, భారత్ కేవలం తన ప్రయోజనాలను రక్షించుకోవడమే కాకుండా పూర్తి హిందూ-పసిఫిక్ ప్రాంతంలో శాంతినీ, స్థిరత్వాన్నీ కూడా పరిరక్షిస్తోందని చాలా సార్లు నిరూపించిందని రక్షణ మంత్రి అన్నారు. ఈ వైఖరి భారత్ను బాధ్యత కలిగిన సముద్ర వాణిజ్య శక్తిగా నిలబెడుతోందని ఆయన చెప్పారు.
సాంకేతిక విజ్ఞాన ఆధారిత, బహుళ విధ ముప్పుల నడుమ సముద్ర వాణిజ్య రంగాన్ని నిరంతరం బలోపేతం చేయడానికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలోని ప్రభుత్వం నిబద్ధతతో ఉందని శ్రీ రాజ్నాథ్ సింగ్ పునరుద్ఘాటించారు. ‘‘ఐసీజీ ఒక స్పందనాత్మక దళంగా మాత్రమే పనిచేయడం కాకుండా, చురుకైన దళంగా ఎదగాలి. దీనికి సహకారాన్ని అందించడానికి ప్రభుత్వం అన్ని విధాలుగా ముందుకు వస్తుంది. నౌకల సేకరణ కావచ్చు.. లేదా కొత్త విభాగాలను ఏర్పాటు చేయడానికి భూమిని అద్దెకివ్వడం కావచ్చు.. మానవ వనరులకు సంబంధించిన అంశాలు కావచ్చు.. ఐసీజీని అన్ని రకాలుగా ఆధునికీకరించడానికి మేం కృషి చేస్తున్నాం’’ అని ఆయన అన్నారు.
మొదటి సారి, ఈ నౌకలో ఇద్దరు మహిళా అధికారులు పనిచేయనున్నారు. సమ్మిళితమైన, స్త్రీ-పురుష సమానత్వాన్ని ప్రోత్సహించాలన్న ప్రభుత్వ దృష్టికోణాన్ని ఆచరణలో పెడుతున్నందుకు ఐసీజీని రక్షణ మంత్రి మెచ్చుకొన్నారు. ఇవాళ మహిళా అధికారులు పైలట్లుగా, పరిశీలకురాళ్లుగా, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లుగా, లాజిస్టిక్స్ అధికారులుగా, న్యాయాధికారులుగా నియామకాలు అందుకుంటుండడం గర్వకారణం, దీంతో పాటు వారికి హోవర్క్రాఫ్ట్ కార్యకలాపాల కోసం కూడా శిక్షణనిస్తున్నారు, ముందువరుసలో చురుకైన విధుల్లోనూ వారిని నియమిస్తున్నారని ఆయన అన్నారు. ‘‘ప్రస్తుతం, మహిళలు సహాయక పాత్రను నిర్వహించడానికే పరిమితం కావడం లేదు, వారు ముందువరుసలో యోధురాళ్ల రూపంలో దేశానికి సేవ చేస్తున్నారు. ఐసీజీఎస్ సముద్ర ప్రతాప్లో నియామకం పొందిన ఇద్దరు మహిళా అధికారులు భావితరం వారికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఐసీజీ అందరికీ అవకాశాల కల్పనతో పాటు అభివృద్ధికి దోహదం చేస్తూనే ఉంటుంది’’ అని ఆయన అన్నారు.
స్వయంసమృద్ధి సాధన దిశగా ఐసీజీ చేస్తున్న ప్రయత్నాలను శ్రీ రాజ్నాథ్ సింగ్ ప్రశంసించారు. ప్రభుత్వం ఇచ్చిన ఆత్మనిర్భరత నినాదం ఇప్పుడు పనితీరులో ఓ భాగంగా స్థిరపడిపోయిందని ఆయన అన్నారు. మేక్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమాలకు అనుగుణంగా, స్వదేశీ వనరులను ప్రోత్సహించడంలో కీలక భూమికను ఐసీజీ పోషించింది. ప్రస్తుతం మన తీర రక్షక దళ నౌకల తయారీ, సేవలు, మరమ్మతు మన దేశంలోనే పూర్తి అవుతున్నాయి. ఇది దీనంతట ఇదే ఒక గొప్ప విజయంగా చెప్పుకోవచ్చు’’ అని ఆయన అన్నారు.
వర్తమాన కాలం సవాళ్లను ఎదుర్కోవడానికి, ఐసీజీ ఒక వేదిక. నిర్ణీత పనుల నుంచి రహస్య సమాచార-ఆధారిత, ఏకీకరణ కేంద్రిత దళంగా మార్పు చెందాల్సిన అవసరం ఎంతయినా ఉందని రక్షణ మంత్రి స్పష్టం చేశారు. సముద్ర వాణిజ్య చట్టాల అమలు, పర్యావరణ పరిరక్షణ, సముద్ర వాణిజ్య రంగంలో సైబర్ భద్రత వంటి రంగాల్లో ఐసీజీలో ప్రత్యేక ఉద్యోగాల్ని కల్పించాల్సిన ఆవశ్యకత కూడా ఉందని ఆయన సూచించారు.
ఇటీవల కొన్నేళ్లలో ఐసీజీ ప్రాంతీయ స్థాయిలో ప్రమాణాల్ని నెలకొల్పిందనీ, ఇక ఈ భూమికను ప్రపంచానికి నాయకత్వం వహించే దిశగా విస్తరించాల్సిన సమయం ఆసన్నమైందనీ శ్రీ రాజ్నాథ్ సింగ్ అన్నారు. రాబోయే కాలంలో సముద్ర వాణిజ్య పాలన రంగంలో ప్రమాణాల రూపురేఖల్ని మనమే తీర్చిదిద్దాల్సి ఉంటుందనీ, సామర్థ్యాల్ని పెంచే కార్యక్రమాలను పటిష్ఠపరచాలనీ, సహకార పూర్వక వ్యవస్థల్ని ప్రోత్సహించాల్సి ఉంటుందనీ ఆయన అన్నారు. ఐసీజీ తన కార్యకలాపాలకు సంబంధించిన సిద్ధాంతాలనూ, సంస్థాగత అభ్యాసాలనూ, సాంకేతిక నవకల్పనలనూ ప్రపంచవ్యాప్తంగా అనుసరించదగ్గ అత్యుత్తమ ప్రమాణాల స్థాయికి తీసుకుపోగలగాలని మంత్రి అన్నారు. రక్షణ రంగాన్ని సుదృఢపరచడంలో ఐసీజీ ముఖ్య తోడ్పాటును అందించగలదన్న నమ్మకాన్ని ఆయన వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో గోవా ముఖ్యమంత్రి డాక్టర్ ప్రమోద్ సావంత్, రక్షణ కార్యదర్శి శ్రీ రాజేశ్ కుమార్ సింగ్, ఐసీజీ డైరెక్టర్ జనరల్ శ్రీ పరమేశ్ శివమణి, జీఎస్ఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ బ్రజేశ్ కుమార్ ఉపాధ్యాయ్లతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన అధికారులు కూడా పాల్గొన్నారు.
ఐసీజీఎస్ సముద్ర ప్రతాప్ గురించి
దేశ సముద్ర వాణిజ్య ప్రయోజనాలను పరిరక్షించడంతో పాటు సురక్షిత, స్వచ్ఛ సాగర జలాలను సురక్షితం, స్వచ్ఛంగా ఉంచాలన్న ఐసీజీ సంకల్పాన్ని సముద్ర ప్రతాప్ చాటిచెబుతోంది. ఈ నౌక 4,170 టన్నుల బరువు,114.5 మీటర్ల పొడవు ఉంది. సముద్ర మార్గంలో 22 మైళ్ల (నాట్స్)కు మించిన వేగంతో ఇది ప్రయాణించగలదు. దీనిని 7,500 కిలోవాట్ డీజిల్ ఇంజిన్ల సాయంతో నడుపుతారు. ఇవి దేశీయంగా అభివృద్ధిపరిచిన నియంత్రణయోగ్య పిచ్ ప్రొపెల్లర్, గేర్బుక్సుల సాయంతో కదులుతాయి. దీంతో ఈ నౌక శ్రేష్ఠమైన గతిశీలత్వాన్నీ, సరళత్వాన్నీ సంతరించుకొని 6,000 సముద్ర మైళ్ల మేర సహనశక్తిని కలిగి ఉంటుంది.
ఈ నౌకలో అత్యాధునిక వ్యవస్థల్ని ఏర్పాటు చేశారు. వాటిలో.. కాలుష్య నియంత్రణకు ఉద్దేశించిన ఒక ప్రయోగశాల, సులభంగా తీసుకుపోదగ్గ బార్జిలు, అధిక సామర్థ్యం కలిగి ఉండే స్కిమ్మర్లు, చెత్తను పోగుచేసుకొని తీసేసే నీటిపై తేలియాడే రకం బూమ్స్, సైడ్-స్వీపింగ్ ఆర్మ్స్ వంటివి కూడా ఉన్నాయి. మంటలను ఆర్పివేసేందుకు ఉద్దేశించిన ఒక వ్యవస్థ (ఎఫ్ఐ-ఎఫ్ఐ క్లాస్ వన్)ను ఈ నౌకకు అమర్చారు. డైనమిక్ పొజిషనింగ్, సమీకృత బ్రిడ్జి వ్యవస్థ, సమీకృత ప్లాట్ఫార్మ్ మేనేజ్మెంట్ సిస్టమ్, ఆటోమేషన్ను, పనితీరు సామర్థ్యాన్ని మెరుగుపరిచేందుకు స్వయం చాలక శక్తితో కూడి ఉండే విద్యుత్తు నిర్వహణ వ్యవస్థను కూడా ఈ నౌకకు సమకూర్చారు. దీనిలో 30 మి.మీ. సీఆర్ఎన్-91 శతఘ్ని, రిమోట్ కంట్రోల్తో పనిచేయగల 127 మి.మీ. స్టెబిలైజ్డ్ శతఘ్నులు రెండు, ఆధునిక అగ్నిమాపక వ్యవస్థలు ఉన్నాయి.
ఈ నౌక కోచి ప్రధాన కేంద్రంగా తన విధులను నిర్వహిస్తుంది. తీరరక్షక దళం పశ్చిమ ప్రాంత కమాండర్ నిర్వాహక నియంత్రణలో ఈ నౌక పనిచేస్తుంది. దీనిని కేరళ, మాహేలు పరిధిగా ఉన్న నంబర్ 4 కోస్ట్ గార్డ్ జిల్లా ప్రధాన కేంద్రం ద్వారా పనిచేయిస్తారు.
***
(रिलीज़ आईडी: 2211645)
आगंतुक पटल : 23