ఎరువుల విభాగం
వికసిత్ భారత్ సాధనలో ప్రధానాంశమైన సమీకృత ఎరువుల క్లెయిము ప్రక్రియ ప్రారంభం: శ్రీ జేపీ నడ్డా
ఎరువులు రాయితీ: చరిత్రాత్మక సంస్కరణలో భాగంగా ప్రభుత్వం పూర్తిగా డిజిటల్ విధానంలోకి మారుతోంది
డిజిటల్ వేదిక ద్వారా చెల్లించబోయే ఎరువుల రాయితీ విలువ సుమారు రూ. 2 లక్షల కోట్లు
విధాన ప్రోత్సాహం: ఎరువుల సబ్సిడీ వ్యవస్థను పూర్తిగా డిజిటలైజ్ చేసిన ప్రభుత్వం
प्रविष्टि तिथि:
01 JAN 2026 7:13PM by PIB Hyderabad

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ డిజిటల్ ఇండియా దార్శనికతకు, 2047 నాటికి వికసిత భారత్ సాధించాలనే లక్ష్యానికి అనుగుణంగా డిజిటల్ పరిపాలన, ఆర్థిక సంస్కరణలను బలోపేతం చేసే దిశగా ఎరువుల విభాగం ముఖ్యమైన చర్య చేపట్టింది. న్యూఢిల్లీలోని కర్తవ్య భవన్లో ఈ-బిల్లు వ్యవస్థను కేంద్ర ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం, రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి శ్రీ జగత్ ప్రకాశ్ నడ్డా ఈ రోజు ప్రారంభించారు. ఇది సుమారుగా రూ. 2 లక్షల కోట్ల ఎరువుల సబ్సిడీని చెల్లించే వీలును ప్రభుత్వానికి కల్పిస్తుంది.

పారదర్శకమైన, సమర్థమైన, సాంకేతిక ఆధారిత పాలనను బలోపేతం చేయడంలో ఈ ఆన్లైన్ వ్యవస్థ ప్రధాన భూమిక పోషిస్తుందని కేంద్ర మంత్రి అన్నారు. విభాగానికి సంబంధించిన ఆర్థిక కార్యకలాపాలను ఆధునికీకరించడంలో ప్రధాన విజయంగా ఈ ప్రారంభం నిలుస్తుందని ఎరువుల కార్యదర్శి శ్రీ రజత్ కుమార్ మిశ్రా అన్నారు. ఎలాంటి భౌతిక బిల్లులను పంపించాల్సిన అవసరం లేకుండా.. కాగితాన్ని ఉపయోగించే పద్ధతుల నుంచి పనిని పూర్తిగా డిజిటల్ రూపంలోకి నూతనంగా ప్రారంభించిన వ్యవస్థ మారుస్తుంది.
ఎరువుల విభాగానికి చెందిన ఐఎఫ్ఎంఎస్ (ఇంటిగ్రేటెడ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సిస్టమ్), ఆర్థిక మంత్రిత్వ శాఖలోని కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ (సీజీఏ)కు చెందిన పీఎఫ్ఎంఎస్ మధ్య భాగస్వామ్యం ఫలితమే ఈ కార్యక్రమం.
అన్ని ఆర్థిక లావాదేవీలకు సంబంధించి కేంద్రీకృతమైన, మార్చడానికి వీలు లేని డిజిటల్ ఆడిట్ నిర్వహణను రూపొందించి,, పారదర్శకతను, జవాబుదారీతనాన్ని గణనీయంగా పెంచుతుందని సీసీఏ శ్రీ సంతోష్ కుమార్ అన్నారు. తద్వారా పర్యవేక్షణను మెరుగుపరిచి, తనిఖీలను సులభతరం చేస్తుందని తెలిపారు. ఖర్చులను నిరంతరం పర్యవేక్షించడంలో, ఆర్థిక నియంత్రణను బలోపేతం చేయడంలో ఉన్నతాధికారులకు ఈ వ్యవస్థ సహకరిస్తుంది. అలాగే.. ఏకీకృత వ్యవస్థ ద్వారా అన్ని చెల్లింపులను నిరంతరం పర్యవేక్షించి నివేదికను అందిస్తుంది.
విభాగానికి చెందిన అంతర్గత వ్యవస్థ, పీఎఫ్ఎంస్ మధ్య సమాచారాన్ని సజావుగా మార్చుకొనే వీలును కల్పిస్తుంది. అలాగే డేటాను రెండోసారి ఎంట్రీ చేయడాన్ని నివారిస్తుంది. మానవ పొరపాట్లను నిరోధిస్తుంది. అలాగే.. మొత్తం ప్రక్రియ సామర్థ్యాన్ని, డేటా కచ్చితత్వాన్ని పెంపొందిస్తుంది.
ఈ వ్యవస్థ ఎండ్ - టు - ఎండ్ డిజిటల్ బిల్లు ప్రక్రియలను చేపడుతుందని, తద్వారా వారాంతపు రాయితీ చెల్లింపులను సకాలంలో చేయడమే కాకుండా.. చెల్లింపులు చేసే సమయాన్ని తగ్గిస్తుందని జేఎస్ (ఎఫ్ అండ్ ఏ) మనోజ్ సేథీ అన్నారు. అదనంగా, ఎరువుల కంపెనీలు తమ క్లెయిములను ఆన్లైన్లో సమర్పించడానికి, చెల్లింపుల స్థితిని ట్రాకు చేసుకొనే వీలును కల్పించడం ద్వారా వినియోగదారు సౌకర్యాన్ని ఈ-బిల్లు వేదిక పెంపొందిస్తుంది. అలాగే కార్యాలయాలకు వచ్చి వాకబు చేయాల్సిన అవసరాన్ని తొలగిస్తుంది. ఈ శాఖలో.. ప్రామాణికమైన ఎలక్ట్రానిక్ పని తీరును (ముందు వచ్చిన బిల్లును మొదట పూర్తి చేయడం లాంటివి) అమలు చేస్తుంది. అలాగే బిల్లుల నిర్వహణలో స్థిరత్వం, న్యాయం, ఆర్థిక నియమాలను పాటించేలా చూస్తుంది. అలాగే సమాచార వ్యవస్థలోని లోపాలను తగ్గిస్తుంది. వ్యవస్థ నిర్వహణను సరళీకరిస్తుంది. సమాచార ఆధారిత నిర్ణయాలు, విధాన రూపకల్పన, బడ్జెట్ను సమర్థంగా నిర్వహించడంలో సహకరించేందుకు సమగ్ర ఆర్థిక సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందిస్తుంది.
ఈ కార్యక్రమంలో ఏఎస్ అనీతా సీ మెస్రం, ఏఎస్ అపర్ణ శర్మ, జేఎస్ కేకే పాఠక్, జేఎస్ అనురాగ్ రోహతగీ, డైరెక్టర్ లబోనీ దాస్ దత్తా పాల్గొన్నారు.
దీనికి సంబంధించిన సాంకేతిక నైపుణ్యాలను, క్రమబద్ధీకృత నిర్మాణాన్ని ఎన్ఐసీ, సీనియర్ టెక్నికల్ డైరెక్టర్ శ్రీ అసీమ్ గుప్తా వివరించారు. ఈ వేదికను ప్రారంభించడం, దీనికి సంబంధించిన వివరాలను అందించడంలో జాయింట్ డైరెక్టర్ శ్రీ అశుతోష్ తివారీ, డెవలపర్ శ్రీ హరేకృష్ణ తివారీతో సహా ఎన్ఐసీ బృందం మంచి సహకారం అందించింది. ఈ వ్యవస్థను రూపొందించి, అమలు చేయడంలో ఎన్ఐసీ ప్రయత్నాలకు అభినందనలు లభించాయి.
సమీకృత ఈ-బిల్లు వ్యవస్థ.. ఆర్థిక పాలనను గణనీయంగా మెరుగుపరుస్తుంది. ముందుగానే నిర్దేశించిన ప్రమాణాలకు అనుగుణంగా చెల్లింపును ధ్రువీకరించే బలమైన, అంతర్నిర్మిత నియంత్రణలతో, ఆడిట్కు అనుగుణంగా ప్రతి చర్యను నమోదు చేస్తుంది. అలాగే పారదర్శకమైన, సమర్థమైన, సాంకేతిక ఆధారిత పరిపాలన అందించాలనే ప్రభుత్వ నిబద్ధతను బలోపేతం చేస్తూ.. మోసం లేదా దుర్వినియోగం ముప్పులను తగ్గిస్తుంది.
***
(रिलीज़ आईडी: 2210768)
आगंतुक पटल : 2