రక్షణ మంత్రిత్వ శాఖ
తొలి ప్రయాణాన్ని ప్రారంభించిన ఐఎన్ఎస్వీ కౌండిన్య భారత్-ఒమన్ సముద్ర వారసత్వానికి పుర్వ వైభవం తీసుకువచ్చే చరిత్రాత్మక నౌకాయానం
నాడు పోస్టు చేయడమైనది:
29 DEC 2025 7:56PM by PIB Hyderabad
భారత నౌకాదళానికి చెందిన, సంప్రదాయ పద్ధతిలో దేశీయంగా తయారు చేసిన ప్రాచీన నౌక కౌండిన్య, 29 డిసెంబర్ 2025న గుజరాత్లోని పోరుబందర్ నుంచి ఒమన్లోని మస్కట్ వరకు తొలి విదేశీ ప్రయాణాన్ని ప్రారంభించింది. ప్రాచీన సముద్రయాన వారసత్వానికి పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు, అవగాహన పెంచుకునేందుకు, దాని గురించి చాటిచెప్పేందుకు భారత్ చేపట్టిన ప్రయత్నాల్లో ఈ చరిత్రాత్మక యాత్ర కీలకంగా నిలుస్తుంది.
భారత్ లోని ఒమన్ రాయబారి గౌరవ ఇస్సా సలేహ్ అల్ షిబాని, భారత నౌకాదళ ఉన్నతాధికారులు, ఇతర విశిష్ట అతిథుల సమక్షంలో పశ్చిమ నౌకాదళ కమాండ్ ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్-ఇన్-చీఫ్ వైస్ అడ్మిరల్ కృష్ణ స్వామినాథన్ ఈ నౌకాయానాన్ని అధికారికంగా ప్రారంభించారు.
శతాబ్దాల కిందట సహజ సిద్ధమైన సామాగ్రి, సంప్రదాయ కుట్టు నిర్మాణ పద్ధతులతో ఐఎన్ఎస్వీ కౌండిన్య నౌకను నిర్మించారు. చారిత్రక ఆధారాలు, ప్రాచీన కళారూపాల స్ఫూర్తితో రూపొందించిన ఈ నౌక.. స్వదేశీ నౌకా నిర్మాణం, నావికా నైపుణ్యం, భారత సముద్రయాన వారసత్వానికి ప్రతీకగా నిలుస్తుంది. ఒకప్పుడు భారతదేశ పశ్చిమ తీరాన్ని ఒమన్ తో అనుసంధానించిన ప్రాచీన సముద్ర మార్గం ద్వారా ఈ ప్రయాణం సాగుతోంది. హిందూ మహాసముద్రం మీదుగా వాణిజ్యం, సాంస్కృతిక మార్పిడి, నిరంతరం నాగరికత సంబంధాలను పెంపొందించటంలో ఈ మార్గం కీలకంగా నిలిచింది.
భారత్, ఒమన్ మధ్య ఉమ్మడి సముద్రయాన వారసత్వాన్ని గుర్తు చేస్తూ, సాంస్కృతిక, ప్రజా సంబంధాలను బలపరచటం ద్వారా ద్వైపాక్షిక సంబంధాలను ఈ నౌకాయానం మెరుగుపరుస్తుందని భావిస్తున్నారు. మస్కట్ కు ఐఎన్ఎస్వీ కౌండిన్య చేరుకునే సంఘటన.. శతాబ్దాలుగా రెండు సముద్ర తీర దేశాల మధ్య చెక్కుచెదరని స్నేహం, పరస్పర విశ్వాసం, గౌరవానికి శక్తిమంతమైన చిహ్నంగా నిలుస్తుంది. గుజరాత్, ఒమన్ మధ్య లోతైన చారిత్రక అనుబంధాలను స్పష్టం చేస్తూ, ఇవాళ్టికీ కొనసాగుతున్న సహకార వారసత్వాన్ని ఈ యాత్ర ప్రతిబింబిస్తుంది.
సముద్రయాన దౌత్య సంబంధాలు, వారసత్వ సంరక్షణ, ప్రాంతీయ సహకారం పట్ల భారత నౌకాదళ ప్రాధాన్యతను ఈ యాత్ర చాటిచెబుతోంది. భారత అత్యున్నత సముద్రయాన దృక్పథానికి ఐఎన్ఎస్వీ కౌండిన్య ప్రయాణం నిదర్శనం. హిందూ మహాసముద్ర ప్రాంతంలో బాధ్యతాయుతమైన, సాంస్కృతిక మూలాలను గౌరవించే దేశంగా భారత్ పాత్రను ఇది స్పష్టం చేస్తుంది.
ఈ నౌకకు కెప్టెన్ గా కమాండర్ వికాస్ షియోరాన్, ఈ ప్రాజెక్టు ప్రారంభం నుంచి భాగస్వామిగా ఉన్న కమాండర్ వై.హేమంత్ కుమార్, ఈ యాత్రకు అధికారిగా వ్యవహరిస్తారు. ఈ బృందంలో మొత్తం నలుగురు అధికారులు, పదమూడు మంది నౌకాదళ సిబ్బంది ఉన్నారు.
3TXS.jpg)

GX5W.jpg)
IK0L.jpg)
***
(రిలీజ్ ఐడి: 2209828)
సందర్శకుల సూచీ సంఖ్య : : 37