రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ
పబ్లిక్ ఇన్విట్ కార్యక్రమానికి ఊతాన్నివ్వడానికి రాజ్మార్గ్ ఇన్ఫ్రా ఇన్వెస్ట్మెంట్ మేనేజర్స్ (ఆర్ఐఐఎంపీఎల్)ను ఏర్పాటు చేసిన ఎన్హెచ్ఏఐ
Posted On:
20 NOV 2025 3:36PM by PIB Hyderabad
రహదారి ఆస్తులను మరింత లాభసాటిగా మార్చడంలో భాగంగా- జాతీయ రహదారుల మౌలిక సదుపాయాలను మరింత విస్తరించేందుకు జాతీయ రహదారుల సంస్థ- ప్రజల నుంచి పెట్టుబడి సేకరణ (ఇన్విట్) విధానంలో- రాజమార్గ్ ఇన్ఫ్రా ఇన్వెస్ట్మెంట్ ట్రస్టు (ఆర్ఐఐటీ)ని ఏర్పాటు చేస్తోంది. ఈ కార్యక్రమంలో భాగంగా, ప్రతిపాదిత ఇన్విట్కు ఇన్వెస్ట్మెంట్ మేనేజర్గా రాజ్మార్గ్ ఇన్ఫ్రా ఇన్వెస్ట్మెంట్ మేనేజర్స్ ప్రైవేటు లిమిటెడ్ (ఆర్ఐఐఎంపీఎల్)ను ఏర్పాటు చేసింది. ఎన్హెచ్ఏఐ చైర్మన్ శ్రీ సంతోష్ కుమార్ యాదవ్ ఆర్ఐఐఎంపీఎల్ను ముంబయిలో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎన్హెచ్ఏఐ సీనియర్ అధికారులు, భాగస్వామ్య సంస్థల ప్రతినిధులు కూడా పాల్గొన్నారు.
భారతీయ స్టేట్ బ్యాంకు, పంజాబ్ నేషనల్ బ్యాంకు, నాబ్ఫిడ్ (NaBFID), యాక్సిస్ బ్యాంకు, బజాజ్ ఫిన్సర్వ్ వెంచర్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంకు, ఐడీబీఐ బ్యాంకు, ఇండస్ఇండ్ బ్యాంకు, యెస్ బ్యాంకులు సహా ప్రధాన బ్యాంకులు, ఆర్థిక సహాయ సంస్థలు కలిసి ఏర్పాటు చేసిన సంస్థే ఆర్ఐఐఎంపీఎల్. చిన్న మదుపరులనూ, దేశీయ పెట్టుబడిదారులనూ ఆకర్షించగలిగేటట్లు అధిక ప్రయోజనాలను అందించే, దీర్ఘకాలిక ప్రాతిపదికను కలిగి ఉండే ఒక పెట్టుబడి పథకాన్ని ప్రవేశపెడుతూ, దీనికి తోడుగా జాతీయ రహదారులకున్న నగదు సమీకరణ సామర్థ్యాన్నీ ఉపయోగించుకోవాలనేదే ఈ భాగస్వామ్యం ఉద్దేశం. ఇన్వెస్ట్మెంట్ మేనేజర్ కంపెనీకి మేనేజింగ్ డైరెక్టర్ అండ్ సీఈఓ (అదనపు బాధ్యత)గా శ్రీ ఎన్.ఆర్.వి.వి.ఎం.కె. రాజేంద్ర కుమార్ను నియమించారు. ఈయనకు ఎన్హెచ్ఏఐలో మెంబర్ (ఫైనాన్స్)గా పనిచేసిన అనుభవం ఉంది.
ఈ సందర్భంగా ఎన్హెచ్ఏఐ చైర్మన్ శ్రీ సంతోష్ కుమార్ యాదవ్ ప్రసంగిస్తూ... ‘‘రహదారులకున్న నగదు సమీకరణ సామర్థ్యాన్ని వినియోగించుకోవడంలో ఎన్హెచ్ఏఐ విశేషమైన అనుభవాన్ని సంపాదించింది. ఇటీవల కొన్నేళ్లుగా, మేం టోల్-ఆపరేట్-ట్రాన్స్ఫర్ (టీఓటీ) నమూనాను అనుసరిస్తూ రూ.48,995 కోట్ల విలువైన ఆస్తుల్ని ఉపయోగించి నగదు రాబట్టుకొనే ప్రక్రియలో సఫలమయ్యాం. ప్రయివేటు ఇన్విట్ల తాలూకు నాలుగు రౌండ్లలో దేశీయ, అంతర్జాతీయ స్థాయుల్లో ప్రధాన పెట్టుబడిదారులను ఆకట్టుకొని, దాదాపు రూ.43,638 కోట్లు సమీకరించాం. రాబోయే మూడు సంవత్సరాలు లేదా అయిదు సంవత్సరాలలో, నిర్మాణ పనులు పూర్తి చేసిన జాతీయ రహదారులు సహా క్రియాశీల జాతీయ రహదారులకు చెందిన సుమారు 1,500 కిలోమీటర్ల మార్గాలను పబ్లిక్ ఇన్విట్ పరిధిలోకి తీసుకు రానున్నాం. దీంతో ప్రజలకు గణనీయ స్థాయిలో పెట్టుబడి అవకాశాలు లభిస్తాయి. ఈ కార్యక్రమం జాతీయ రహదారి సదుపాయాలను కల్పించడంలో ప్రజల భాగస్వామ్యంలో ఓ కొత్త అధ్యాయానికి నాంది పలుకుతుందని నేను నమ్ముతున్నాన’’న్నారు.
ఆర్ఐఐఎంపీఎల్ పటిష్ఠ పాలన ప్రమాణాలను ఏర్పరచడంపై దృష్టిని కేంద్రీకరిస్తుంది. సెబీ నిర్దేశించిన ఇన్విట్ నియమ నిబంధనలను పక్కాగా అమలుచేస్తుంది. పారదర్శకత, పెట్టుబడిదారుల ప్రయోజనాల పరిరక్షణలతో పాటు, నివేదికల రూపకల్పన, నియమ పాలన యంత్రాంగాల్లో కూడా అత్యుత్తమ స్థాయి పనితీరును కనబరుస్తుంది. చిన్న మదుపరులతో పాటు పబ్లిక్ ఇన్వెస్టర్లకు తొలి విడత ఇన్విట్ యూనిట్లను 2026 ఫిబ్రవరిలో జారీ చేసే సూచనలు ఉన్నాయి.
***
(Release ID: 2192240)
Visitor Counter : 3