బొగ్గు మంత్రిత్వ శాఖ
బొగ్గు రంగంపై సుదీర్ఘంగా జరిగిన మారథాన్ సమీక్షా సమావేశానికి అధ్యక్షత వహించిన కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి
प्रविष्टि तिथि:
13 NOV 2025 9:26PM by PIB Hyderabad
కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి అధ్యక్షతన, బొగ్గు, గనుల శాఖ సహాయమంత్రి శ్రీ సతీష్ చంద్ర దూబే సహాధ్యక్షతన, బొగ్గు మంత్రిత్వ శాఖకు సంబంధించి ఆరు నెలల మారథాన్ సమీక్షా సమావేశం 13.11.2025న న్యూఢిల్లీలో జరిగింది. ఈ సమావేశానికి బొగ్గు మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ విక్రమ్ దేవ్దత్, అదనపు కార్యదర్శి శ్రీమతి రూపిందర్ బ్రార్, అదనపు కార్యదర్శి, సీఐఎల్ సీఎండీ (అదనపు బాధ్యత) శ్రీ సనోజ్ కుమార్ ఝా, సీఐఎల్ అనుబంధ సంస్థలు, ఎన్ఎల్సీఐఎల్, ఎస్సీసీఎల్ సీఎండీలు పాల్గొన్నారు.
భారతదేశ ఇంధన భద్రతకు మంత్రిత్వ శాఖ, పీఎస్యూలు అందిస్తున్న సుస్థిర సహకారాన్ని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి ప్రశంసించారు. భారీ వర్షాలు, కార్యకలాపాల్లో సవాళ్లున్నప్పటికీ స్థిరంగా బొగ్గు ఉత్పత్తిని కొనసాగించినందుకు పీఎస్యూలను కేంద్రమంత్రి అభినందించారు. దృఢ సంకల్పం, సమన్వయంతో కృషి చేస్తూ గతేడాది అభివృద్ధిని కొనసాగిస్తూ, ఈ సంవత్సరం ఉత్పత్తి లక్ష్యాలను చేరుకోవాలని కోరారు. "సంస్కరించటం, అమలు చేయటం, పరివర్తన, సమాచారం ఇవ్వడం" అని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నిర్దేశించిన మార్గదర్శక మంత్రాన్ని స్పష్టం చేస్తూ.. సంస్కరణలు, సామర్థ్యం, ఆవిష్కరణలపై అన్ని పీఎస్యూలు దృష్టి సారించి ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలని మంత్రి పిలుపునిచ్చారు.
ఇంటిగ్రేటెడ్ కోల్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ (ఐసీసీసీ) వంటి కార్యక్రమాలు ఆధునీకరణ వైపు ముఖ్యమైన ముందడుగని కేంద్రమంత్రి వ్యాఖ్యానించారు. నిజమైన పురోగతిని ప్రతిబింబించే స్పష్టమైన అభివృద్ధి, పరిమాణాత్మక ఫలితాలు రావాలని ప్రోత్సహించారు.
ఉత్పత్తి, లాభదాయకత, కార్మికుల సంక్షేమం, పర్యావరణ పనితీరులో అత్యుత్తమంగా ఉండేలా పీఎస్యూల మధ్య ఆరోగ్యకరమైన పోటీని మంత్రి ప్రోత్సహించారు. బొగ్గు రంగం అంతటా ఉత్తమ పద్ధతులను అనుసరించాలని అనుబంధ సంస్థలను కోరారు.
కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని, రెగ్యులర్ ఉద్యోగుల కోసం రూ.కోటి అదనపు వ్యక్తిగత ప్రమాద బీమా కవరేజీని అందించేందుకు కోల్ ఇండియా లిమిటెడ్ తీసుకున్న చొరవను మంత్రి ప్రశంసించారు. దీనివల్ల సంస్థకు అయ్యే ఖర్చు తక్కువే అయినప్పటికీ, ఉదోగ్యుల మనోధైర్యం, సామాజిక భద్రతపై గణనీయమైన ప్రభావం ఉంటుందని ఆయన అన్నారు. ఇతర పీఎస్యూలు కూడా ఇదే తరహా చర్యలను చేపట్టాలని మంత్రి సూచించారు. చిన్నపాటి సంక్షేమ కార్యక్రమాలు కూడా బొగ్గు కార్మికుల జీవితాలపై అధిక ప్రభావాన్ని చూపుతాయన్నారు.
భారతదేశ ఖనిజ భద్రతకు శాస్త్రీయ అన్వేషణ ప్రాముఖ్యతను తెలియజేస్తూ, పీఎస్యూలన్నీ ఓవర్బర్డెన్ (ఓబీ) పరీక్షలను వేగవంతం చేయాలని, అరుదైన మృత్తికా మూలకాలు (ఆర్ఈఈలు), కీలక ఖనిజాల కోసం తరచూ నమూనా సేకరణ చేపట్టాలని చెప్పారు.
సమయానుకూల అనుమతుల ద్వారా స్థిరమైన మద్దతును అందిస్తున్న పర్యావరణం, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ (ఎంఏఈఎఫ్సీసీ)తో మరింత బలమైన సమన్వయం అవసరమన్నారు. బొగ్గు నాణ్యతను మెరుగుపరచటానికి, దిగుమతిపై ఆధారపడటాన్ని తగ్గించేందుకు కోల్ వాషరీల అభివృద్ధిని అత్యంత ప్రాధాన్యంగా తీసుకోవాలని ఆయన ఆదేశించారు.
కోల్ వాషరీల కోసం అనుకూలమైన వ్యాపార నమూనాలతో ఔట్ సోర్సింగ్ అవకాశాలను అన్వేషించాలని మంత్రి తెలిపారు. అనేక మంది ప్రైవేట్ వాటాదారులు ఈ రంగంలో పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నందున, బాహ్య నిధుల సమీకరణ, భాగస్వామ్యాల అవకాశాలను కూడా పీఎస్యూలు అన్వేషించాలని సూచించారు. గనుల మూసివేత, సుస్థిరతపై మాట్లాడుతూ.. బొగ్గు తవ్వకం పూర్తయిన 340 గనులను సమయానికి మూసివేసేందుకు ప్రభుత్వ రంగ సంస్థల్లో ప్రత్యేక 'గని మూసివేత సెల్'ను ఏర్పాటు చేయాలని మంత్రి ఆదేశించారు.
పీఎస్యూల సామాజిక పాత్రను ప్రస్తావిస్తూ, ఎస్సీసీఎల్ ప్రారంభించిన కార్యక్రమాన్ని ఉదహరిస్తూ, అన్ని పీఎస్యూలు తమ కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద, యూపీఎస్సీ ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు మద్దతివ్వాలని సూచించారు. లాభదాయక సూచికలు పన్నుకు ముందు, పన్ను తర్వాత రెండూ తప్పనిసరిగా మెరుగుపడాలని స్పష్టం చేశారు. గతేడాది ఫలితాలను అధిగమించేందుకు అన్ని పీఎస్యూల ఆర్థిక పనితీరు, సామర్థ్యాన్ని బలోపేతం చేయాలని కోరారు.
ఉత్పత్తి, పనితీరు, సంస్కరణల కార్యక్రమాలను పర్యవేక్షించేందుకు, తదుపరి సమీక్షా సమావేశం కోసం కార్యాచరణ ప్రణాళికను రూపొందించటానికి, రెగ్యులర్ వాటాదారులతో అధికారులు సంప్రదింపులు జరపాలని కేంద్రమంత్రి సలహా ఇచ్చారు. ప్రభుత్వ దార్శనికత, సంస్కరణలే పురోగతికి కీలకమని స్పష్టం చేస్తూ కేంద్రమంత్రి ప్రసంగాన్ని ముగించారు.
బొగ్గు రంగం అద్భుతమైన స్థిరత్వం, సామర్థ్యాన్ని ప్రదర్శించిందని బొగ్గు మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ విక్రమ్ దేవ్దత్ అన్నారు. బొగ్గు ఉత్పత్తి, రవాణా శక్తిమంతంగా, స్థిరంగా కొనసాగాయని.. సరఫరాకు ఎక్కడా అంతరాయం కలగలేదని, అవసరానికి మించి నిల్వ స్థాయిలు ఉన్నట్లు వెల్లడించారు. ఈ ఏడాది ఎక్కడా విద్యుత్ కొరత రాలేదని, ఇది దేశవ్యాప్తంగా నిరంతరాయంగా ఇంధన లభ్యతను అందించగల సామర్థ్యం బొగ్గు రంగానికి ఉందని తెలియజేస్తుందన్నారు.
ఈ విజయం కార్యకలాపాల సామర్థ్యాన్ని మాత్రమే కాక, భారతదేశ ఇంధన భద్రతను పరిరక్షించాలనే మంత్రిత్వ శాఖ, ప్రభుత్వ రంగ సంస్థల సామూహిక సంకల్పాన్ని ప్రతిబింబిస్తుందని ఆయన స్పష్టం చేశారు. స్వావలంబన, సుస్థిరత, భవిష్యత్తుకు సిద్ధంగా ఉండే బొగ్గు పర్యావరణ వ్యవస్థ ద్వారా వికసిత్ భారత్ కల సాకారమయ్యేందుకు అర్థవంతంగా సహకరించాలనే ఏకైక లక్ష్యంతో ప్రతి సంస్కరణ, కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నట్లు శ్రీ దేవ్దత్ వెల్లడించారు. దేశవ్యాప్తంగా తగినంత ఉత్పత్తి, అంతరాయం లేని సరఫరా, కావాల్సినంత నిల్వ స్థాయిలతో కొత్త శకానికి బొగ్గు రంగం సిద్ధంగా ఉందన్నారు. మంత్రిత్వ శాఖ చేపట్టే ప్రతి కార్యక్రమంలోనూ సుస్థిరత ప్రధానంగా ఉంటుందని, పర్యావరణ పరిరక్షణ, సామాజిక నిబద్ధతకు తగిన ప్రాధాన్యతనిస్తూ, అభివృద్ధిని బాధ్యతాయుతంగా కొనసాగిస్తున్నట్లు తెలిపారు.
అమల్లో ఉన్న సంస్కరణలను ప్రస్తావిస్తూ, పారదర్శకత , డిజిటల్ పాలన, వ్యాపార సౌలభ్యాన్ని మెరుగుపరచటానికి మంత్రిత్వ శాఖ చేస్తున్న నిరంతర ప్రయత్నాల గురించి ఆయన వివరించారు. అంతర్-మంత్రిత్వ శాఖ సహకారం ముఖ్యమైన సాధికారిక శక్తిగా ఉద్భవించిందని, ఇది విధాన సమ్మేళనాన్ని పెంపొందించటం, కార్యాచరణ సమన్వయం, దేశ ఇంధన భద్రతను బలోపేతం చేయటానికి సంపూర్ణ విధానాన్ని ప్రోత్సహిస్తుందని తెలిపారు.
ఉమ్మడి లక్ష్యం, సహకారం, ఆవిష్కరణ ద్వారా బొగ్గు రంగాన్ని మరింత స్థిరంగా, స్వావలంబన దిశగా మంత్రిత్వ శాఖ తీర్చిదిద్దుతోంది. దూరదృష్టి, బాధ్యత, సుస్థిరతతో భారత్ వృద్ధికి ఈ రంగం నిరంతరంగా శక్తినందిస్తూనే ఉంటుంది.
కోల్ ఇండియా లిమిటెడ్ (సీఐఎల్), నార్తర్న్ కోల్ఫీల్డ్స్ లిమిటెడ్ (ఎన్సీఎల్), సౌత్ ఈస్టర్న్ కోల్ఫీల్డ్స్ లిమిటెడ్ (ఎస్ఈసీఎల్), వెస్ట్రన్ కోల్ఫీల్డ్స్ లిమిటెడ్ (డబ్ల్యూసీఎల్), సెంట్రల్ కోల్ఫీల్డ్స్ లిమిటెడ్ (సీసీఎల్), మహానది కోల్ఫీల్డ్స్ లిమిటెడ్ (ఎంసీఎల్), భారత్ కోకింగ్ కోల్ లిమిటెడ్ (బీసీసీఎల్), ఈస్టర్న్ కోల్ఫీల్డ్స్ లిమిటెడ్ (ఈసీఎల్), సెంట్రల్ మైన్ ప్లానింగ్ అండ్ డిజైన్ ఇనిస్టిట్యూట్ లిమిటెడ్ (సీఎంపీడీఐఎల్), సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (ఎస్సీసీఎల్), ఎన్ఎల్సీ ఇండియా లిమిటెడ్ (ఎన్ఎల్సీఐఎల్) సీఎండీలు ఆర్థిక సంవత్సరం మొదటి అర్ధభాగంలో పనితీరుపై సమగ్ర నివేదికలను సమర్పించారు. బొగ్గు ఉత్పత్తి, రవాణా, అధికభారం తొలగింపు, గనుల భద్రత, భూమి పునరుద్ధరణ, సుస్థిరత కార్యక్రమాలు, సీఎస్ఆర్ జోక్యం, డిజిటల్ ఔట్రీచ్ వంటి ముఖ్య అంశాలను ప్రదర్శనల ద్వారా తెలిపారు. ప్రతి పీఎస్యూ కూడా ఆవిష్కరణలు, ఉత్తమ పద్ధతులను పంచుకుంది.
ఉత్పత్తి, సామర్థ్యం, పారదర్శకతను పెంచేందుకు ఈ రంగంలోని సవాళ్లు, పాలసీ సంస్కరణలు, భవిష్యత్తు వ్యూహాలపై లోతైన చర్చల కోసం పరస్పర చర్చా సమావేశం జరిగింది.
ఈ సమావేశంలో 'ఇండియా కోల్ డైరెక్టరీ 2024-25'ను కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి విడుదల చేశారు. ఈ ప్రచురణ భారతదేశ బొగ్గు రంగానికి సంబంధించిన సమగ్ర అవగాహనను కల్పిస్తుంది. ఇందులో మొత్తం బొగ్గు నిల్వలు, ఉత్పత్తి, రంగాల వారీగా పంపిణీ తీరు, బొగ్గు దిగుమతి, ఎగుమతి, ప్రభుత్వ ఖజానాకు చెల్లింపులు, ప్రపంచ బొగ్గు ఉత్పత్తి, గనులు, బ్లాకుల డేటా వంటి సమాచారం ఉంటుంది. పాలసీ రూపకల్పన, పరిశోధన, పారిశ్రామిక విశ్లేషణకు విలువైన వనరుగా ఈ ప్రచురణ ఉపయోగపడుతుంది.
ప్రత్యేక ప్రచారం 5.0, స్వచ్ఛతా పక్వాడా కింద బొగ్గు పీఎస్యూలు కనబరిచిన అద్భుతమైన పనితీరుని ఈ సమీక్షా సమావేశం గుర్తించింది. పనికిరాని వస్తువులను పారవేయటం, డిజిటల్ ఫైల్ నిర్వహణ, సృజనాత్మక ప్రచారం, నూతన పరిశుభ్రతా కార్యక్రమాల కోసం ఎస్ఈసీఎల్, సీసీఎల్, ఎన్ఎల్ సీఐఎల్, ఎంసీఎల్, ఎస్ సీసీఎల్ చేసిన విశేష కృషిని అభినందించారు. దీనిద్వారా సామర్థ్యం, పారదర్శకత, సుస్థిర పద్దతులపై మంత్రిత్వ శాఖ ప్రాధాన్యత స్పష్టమవుతోంది.
ఇంధన స్వయం సమృద్ధి, వికసిత్ భారత్ 2047 లక్ష్యం దిశాగా భారత్ను నడిపించటానికి సమర్థత, ఆవిష్కరణ, భద్రత వంటి సూత్రాలను బొగ్గు మంత్రిత్వ శాఖ పాటించాలన్న సంకల్పాన్ని బలపరుస్తూ సమావేశం ముగిసింది.
***
(रिलीज़ आईडी: 2190454)
आगंतुक पटल : 4