వ్యవసాయ మంత్రిత్వ శాఖ
ఆంధ్రప్రదేశ్లోని గుంటూరులో జాతీయ వాటర్షెడ్ సదస్సు రెండో రోజు ‘వాటర్షెడ్ మహోత్సవ్’ను ప్రారంభించనున్న కేంద్ర మంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్
· గ్రామీణ భారత్లో నీరు, నేల సుస్థిర సంరక్షణ కార్యకలాపాల ప్రోత్సాహం దిశగా జాతీయ కార్యక్రమం
· వాటర్షెడ్ అభివృద్ధిలో ప్రజా భాగస్వామ్యాన్ని (జన్ బాగీదారి) బలోపేతం చేసేలా ఉత్సవం
· ప్రారంభోత్సవ అనంతరం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ ఎన్. చంద్రబాబు నాయుడుతో భేటీ కానున్న శ్రీ చౌహాన్
Posted On:
10 NOV 2025 6:11PM by PIB Hyderabad
కేంద్ర గ్రామీణాభివృద్ధి, వ్యవసాయం - రైతు సంక్షేమ శాఖ మంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ 2025 నవంబరు 11న ఆంధ్రప్రదేశ్లోని గుంటూరులో ‘వాటర్షెడ్ మహోత్సవ్’ను ప్రారంభిస్తారు. 2025 నవంబరు 10–11 తేదీల్లో జరిగే జాతీయ వాటర్షెడ్ సదస్సులో భాగంగా.. గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ పరిధిలోని భూ వనరుల శాఖ (డీవోఎల్ఆర్) ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. సదస్సు రెండో రోజు శ్రీ చౌహాన్ మహోత్సవాన్ని అధికారికంగా ప్రారంభిస్తారు.
ప్రధానమంత్రి కృషి సించాయి యోజన 2.0 (పీఎంకేఎస్వై 2.0) కింద రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో వాటర్షెడ్ డెవలప్మెంట్ కాంపోనెంట్ (డబ్ల్యూడీసీ) పురోగతిపై సమీక్ష, 2026 తర్వాత వాటర్షెడ్ అభివృద్ధికి సంబంధించి భవిష్యత్ ప్రణాళికపై భాగస్వాములతో చర్చలు, ‘వాటర్షెడ్ మహోత్సవ్’ను ప్రారంభించి ప్రజల్లో అవగాహన - సమాజ భాగస్వామ్యాన్ని పెంపొందించడం, గత వాటర్షెడ్ ప్రాజెక్టుల కింద సృష్టించిన ఆస్తుల పునరుద్ధరణ, నిర్వహణ లక్ష్యంగా ‘మిషన్ వాటర్షెడ్ పునరుజ్జీవ’ ప్రారంభోత్సవం, తదితర అంశాలు ఈ జాతీయ సదస్సు ప్రధాన ఎజెండాగా ఉన్నాయి.
‘జన్ భాగీదారీ’ని పెంపొందించడం లక్ష్యంగా.. దేశవ్యాప్తంగా రాష్ట్ర, ప్రాజెక్టు స్థాయిల్లో ‘వాటర్షెడ్ మహోత్సవ్’ నిర్వహిస్తారు. మహోత్సవ్ కింద జరిగే కార్యకలాపాల్లో.. వాటర్షెడ్ జన భాగీదారీ కప్ - 2025 విజేతల గుర్తింపు, పూర్తయిన పనుల ప్రారంభోత్సవం, కొత్త ప్రాజెక్టులకు శంకుస్థాపన, ‘శ్రమదానం’, మొక్కలు నాటడం, తదితర కార్యక్రమాలుంటాయి.
అంతేకాకుండా డబ్ల్యూడీసీ–పీఎంకేఎస్వై 1.0 పథకం కింద నెలకొల్పిన నేల, నీటి సంరక్షణ నిర్మాణాల నిర్వహణ, మరమ్మతుల కోసం కొత్త దిశను, వేగాన్ని నిర్దేశించేలా మహోత్సవ్ కింద ‘మిషన్ వాటర్షెడ్ పునరుజ్జీవ’ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం పథకం ద్వారా ఈ కార్యకలాపాలను చేపట్టడానికి, క్షేత్రస్థాయిలో అమలు కోసం దాని నిధులు దోహదపడేలా సమర్థ యంత్రాంగాన్ని ఏర్పాటు చేస్తున్నారు.
గుంటూరు వద్ద ఉన్న నల్లపాడులోని లయోలా పబ్లిక్ స్కూల్ మైదానంలో ఉదయం 11 గంటలకు సీనియర్ ప్రముఖుల సమక్షంలో శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ ‘వాటర్షెడ్ మహోత్సవ్’ను లాంఛనంగా ప్రారంభిస్తారు. గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ చంద్రశేఖర్ పెమ్మసాని, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, నోడల్ మంత్రి శ్రీ కొణిదెల పవన్ కల్యాణ్ కూడా ప్రారంభోత్సవానికి హాజరవుతారు. విధాన నిర్ణేతలు, సంబంధిత మంత్రిత్వ శాఖలు - విభాగాల ప్రతినిధులు, పరిశోధన సంస్థల శాస్త్రవేత్తలు, ప్రముఖ ప్రభుత్వేతర సంస్థల ప్రతినిధులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.
గ్రామీణ భారత్లో నీరు, నేల సంరక్షణకు సంబంధించి సుస్థిర కార్యకలాపాలను ప్రోత్సహించే జాతీయ కార్యక్రమంగా ఈ మహోత్సవ్ నిలవనుంది. ప్రధాన మంత్రి కృషి సించాయి యోజన (పీఎంకేఎస్వై) కింద వాటర్షెడ్ అభివృద్ధి విజయాలను ప్రదర్శించడం, జల భద్రతను బలోపేతం చేయడం కోసం భవిష్యత్ ప్రణాళికలు, గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలను పెంపొందించడం, కమ్యూనిటీ ఆధారిత వాటర్షెడ్ నిర్వహణ ద్వారా వ్యవసాయ ఉత్పాదకతను పెంచడం ఈ కార్యక్రమ లక్ష్యాలు.
గ్రామీణ ప్రాంతాల్లో జల భద్రత, సమర్థంగా వ్యవసాయం, నిరంతర జీవనోపాధిని అందించే దిశగా ప్రభుత్వం అనుసరిస్తున్న సమగ్ర విధానానికి శ్రీ చౌహాన్ పర్యటన నిదర్శనం. సహజ వనరుల నిర్వహణ, అన్ని రకాల వాతావరణ పరిస్థితులనూ ఎదుర్కొని నిలిచేలా గ్రామీణాభివృద్ధి లక్ష్యాలను ముందుకు తీసుకెళ్లేలా ప్రభుత్వ ఏజెన్సీలు, శాస్త్రవేత్తలు, కమ్యూనిటీలు, పౌర సమాజంతోపాటు భాగస్వాములందరినీ వాటర్షెడ్ మహోత్సవం ద్వారా ఒక్కచోట చేర్చాలని మంత్రిత్వ శాఖ భావిస్తోంది.
‘వాటర్షెడ్ మహోత్సవ్’ ప్రారంభానంతరం షెడ్యూలు ప్రకారం ఇతర కార్యక్రమాల్లోనూ కేంద్ర మంత్రి పాల్గొంటారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ ఎన్. చంద్రబాబు నాయుడిని కలిసి.. వ్యవసాయంలో మార్పులు, సహజ వనరుల నిర్వహణ అంశాల్లో సమష్టి చర్యలపై శ్రీ చౌహాన్ చర్చిస్తారు. అనంతరం గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి డాక్టర్ చంద్రశేఖర్ పెమ్మసానిని కుంచనపల్లిలోని ఆయన నివాసంలో కలుస్తారు.
నేపథ్యం:
ప్రధాన మంత్రి కృషి సించాయి యోజన (పీఎంకేఎస్వై) 2.0 కింది వాటర్షెడ్ డెవలప్మెంట్ కాంపోనెంట్ (డబ్ల్యూడీసీ) ఓ కేంద్ర ప్రాయోజిత పథకం. గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ పరిధిలోని భూ వనరుల శాఖ (డీవోఎల్ఆర్) దీనిని అమలు చేస్తుంది. అన్ని రాష్ట్రాలు, జమ్మూ – కాశ్మీర్, లడాఖ్ కేంద్రపాలిత ప్రాంతాల్లో వర్షాధార, క్షీణించిన భూముల అభివృద్ధిపై ఈ పథకం దృష్టి పెడుతుంది.
డబ్ల్యూడీసీ–పీఎంకేఎస్వై 2.0 కింద చేపట్టిన ప్రధాన కార్యకలాపాలు:
1. చెక్ డ్యాములు, గ్రామ చెరువులు, వ్యవసాయ కుంటల నిర్మాణం, పునరుద్ధరణ వంటి నేల, తేమ పరిరక్షణ చర్యలు,
2. వర్షపు నీటి సంరక్షణ, నీటి వనరుల అభివృద్ధి,
3. నర్సరీల స్థాపన, అడవుల పెంపకం, పచ్చిక బయళ్ల అభివృద్ధి,
4. పరీవాహక ప్రాంతాల్లో నివాసముంటున్న భూమిలేని పేదల కోసం జీవనోపాధి కార్యక్రమాలు.
క్షీణించిన నేల, వృక్ష సంపద, జల వనరుల వంటి సహజవనరుల వినియోగం, సంరక్షణ, అభివృద్ధి ద్వారా పర్యావరణ సమతౌల్యాన్ని పునరుద్ధరించడం ఈ కార్యక్రమ లక్ష్యం. వ్యవసాయ ఉత్పాదకతను మెరుగుపరచడం, అంతరాయం లేకుండా జీవనోపాధికి భరోసా ఇవ్వడం, గ్రామీణ భారత్లో ఉమ్మడి సహజ వనరుల నిర్వహణను ప్రోత్సహించడం కూడా దీని లక్ష్యాలుగా ఉన్నాయి.
‘వాటర్షెడ్ మహోత్సవ్’, ‘మిషన్ వాటర్షెడ్ పునరుజ్జీవన’ను ప్రారంభించడం ద్వారా.. వాటర్ షెడ్ అభివృద్ధిని ప్రజా ఉద్యమంగా మార్చడం, అన్ని రకాల వాతావరణ పరిస్థితులను తట్టుకునే వ్యవసాయం దిశగా భారత్ ప్రస్థానాన్ని బలోపేతం చేయడం, సుస్థిర జల నిర్వహణ, సమ్మిళిత గ్రామీణాభివృద్ధిలో నిబద్ధతను కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేస్తోంది.
***
(Release ID: 2188593)
Visitor Counter : 16